• facebook
  • whatsapp
  • telegram

27 నుంచి జాతీయ వైద్యవిద్య ప్రవేశాలు

* న‌వంబ‌రు 5న సీట్ల కేటాయింపు

ఈనాడు - హైదరాబాద్‌: అఖిల భారత వైద్యవిద్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. అక్టోబర్‌ 27 నుంచి నవంబరు 2 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 5న సీట్లు కేటాయిస్తారు. సీటు పొందినవారు న‌వంబ‌రు 6 నుంచి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 15 శాతం సీట్లను అఖిల భారత కోటాలో జమ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి సుమారు 230 సీట్లను ఈ కోటాలోకి ఇస్తుండగా.. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 6,410 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి నుంచి కొత్తగా ఎయిమ్స్‌ కళాశాలలు, జిప్‌మర్‌ వైద్యసంస్థల్లోనూ సీట్లను నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ చేస్తుండడంతో.. అభ్యర్థులు తాము ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో వాటినీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నవంబరులో రెండో విడత..
* నవంబరు 18 నుంచి 22 వరకూ రెండో విడతకు దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది.
* 25న ఫలితాలు వెల్లడిస్తారు. 26 నుంచి అభ్యర్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
* మిగిలిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను రాష్ట్రాల వారీగా డిసెంబరు 3న తిరిగి అప్పగిస్తారు.
* అఖిల భారత కోటా (15 శాతం) సీట్లకు మాప్‌రౌండ్‌ అంటూ ఏమీ ఉండదు.
* కేంద్ర, డీమ్డ్‌ వైద్య విశ్వవిద్యాలయాలు, ఈఎస్‌ఐ వైద్యకళాశాలలు, ఎయిమ్స్‌, జిప్‌మర్‌ సంస్థల్లో మాత్రం చివరి అవకాశంగా డిసెంబరు 10 నుంచి 14 వరకూ మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహిస్తారు.
* అప్పటికీ సీట్లు మిగిలితే.. వాటిని ఆయా వైద్యసంస్థలకే అప్పగించి, డిసెంబరు 28 నుంచి 31 వరకూ నీట్‌ ర్యాంకుల అర్హత ప్రాతిపదికనే స్థానికంగా భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తారు.
 

రాష్ట్ర ప్రవేశ ప్రకటన నెలాఖరుకు..
  కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నీట్‌ ర్యాంకుల సమాచారం అక్టోబర్‌ 27 నాటికి చేరే అవకాశాలున్నాయనీ, రాగానే అక్టోబర్‌ 29న ప్రవేశ ప్రకటన విడుదల చేస్తామని కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ర్యాంకుల ప్రకటనతోనే దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో ఉంటుంది. అఖిల భారత కోటాలో తొలివిడత ప్రవేశ ప్రక్రియ నవంబరు 12తో ముగియనుండడంతో.. 15 నాటికి రాష్ట్రంలో తొలివిడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో సీట్లకు 2020 ఏప్రిల్‌ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.