ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం(2021-22)లో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 8, 9, 10 తేదీల్లో ఆన్లైన్లో మొదటి విడత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఎల్ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 03న ఇక్కడి వర్సిటీ పరిపాలన కార్యాలయంలో హైదరాబాద్ ప్రాంగణం ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు, ప్రవేశాల సంచాలకుడు శ్రీనివాసరావులతో కలిసి ఆయన సంబంధిత గోడపత్రికను, కరపత్రాలను ఆవిష్కరించారు. అభ్యర్థులు మార్చి 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్లు ఉంటాయన్నారు. ఈ ప్రాంగణంలో 560 బీటెక్ సీట్లున్నాయని, విజయవాడ క్యాంపస్తో కలిపి దాదాపు 3,500 వరకు ఉన్నాయని రెడ్డి తెలిపారు. కేఎల్ వర్సిటీలో 100 శాతం మంది బీటెక్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు దక్కుతున్నాయని, ఈ సారి అత్యధికంగా పలువురు రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారన్నారు. వర్సిటీ అందించే కోర్సులు, దరఖాస్తులు, పరీక్షా కేంద్రాలు తదితర పూర్తి వివరాలను వెబ్సైట్ (www.kluniversity.in) ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.