జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: మంచి పేరెన్నిక గల పాఠశాలల (బీఏఎస్) పథకంలో ప్రవేశాలు పొంది విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వారికి సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సీట్లను కేటాయించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. 2 నుంచి 8 తరగతుల విద్యార్థులను వారి గ్రామాలకు సమీపంలోని గురుకులాల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. వారికి అనుకూలమైన చోట్ల చేర్పించేలా ఆయా గురకులాల అధికారులతో మాట్లాడుతున్నారు. జిల్లాలో 2- 8 తరగతుల విద్యార్థులు 1,740 మంది బీఏఎస్లో చేరి విద్యను అభ్యసిస్తున్నారు. వీరిని ఆయా గురుకులాలు, ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేర్పించనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు 442 మందిని మాత్రం వారు చదువుతున్న పాఠశాలల్లోనే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఏఎస్ పథకాన్ని 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల వరకు అమలు చేయనున్నారు. 2 నుంచి 8 తరగతుల విద్యార్థులు వారికి దగ్గరలోని గురుకులాలకు వెళ్లి ప్రిన్సిపల్స్ని కలిసి సీట్ల ఖాళీల గురించి సమాచారం తీసుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులకు తెలియజేసినా వారు కూడా సమన్వయం చేసి ప్రవేశాలు కల్పించేలా చూస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.