• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచీకరణ లబ్ధికి కరోనా గండి

   గడచిన మూడు దశాబ్దాల్లో ప్రపంచీకరణవల్ల సిద్ధించిన లాభాలెన్నో కరోనా దెబ్బకు మంటగలసిపోతున్నాయి. ప్రపంచీకరణ ప్రయోజనాల్లో ప్రధానమైనవి- భూగోళం మీద దాదాపు 200కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులు కావడం, 1990లో 27లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 90లక్షల కోట్ల డాలర్లకు పెరగడం. అదే సమయంలో ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నదీ నిజమే. కరోనా వైరస్‌ వల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టం 2008 ఆర్థిక సంక్షోభంవల్ల వాటిల్లినదానికన్నా ఎన్నో రెట్లు హెచ్ఛు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు తీసుకున్న చర్యలు ఇప్పుడు ఏ మేరకు పనిచేస్తాయో చెప్పలేం. అసలు కరోనా సంక్షోభం వంటిది మానవజాతికి పూర్తిగా కొత్త కాబట్టి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. కరోనా వైరస్‌కు ఇంతవరకు మందులు కానీ, టీకాలు కానీ అందుబాటులోకి రాలేదు. ప్రపంచం ఈ గండం నుంచి గట్టెక్కడానికి చాలా కాలమే పట్టనుంది. కరోనా సంక్షోభం సమసిపోయిన తరవాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్వరూపస్వభావాలు సమూలంగా మారిపోవడం ఖాయం.

పరిష్కారమేమిటి?
   కరోనా సంక్షోభాన్ని భారతదేశం సైతం తప్పించుకోలేదు. భారత్‌ నుంచి పాదరక్షలు, నగలు, క్రీడా వస్తువులు, తివాచీలు, ఇతర వినియోగ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ రంగాల్లో అయిదు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. 330 కోట్ల ప్రపంచ కార్మిక బలగంలో 81శాతం (267కోట్ల మంది) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా ప్రభావానికి లోనవుతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వీరిలో దాదాపు సగం మంది చిల్లర వర్తకం, హోటళ్లు, ఆహార వ్యాపారం, పారిశ్రామికోత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటికే 19.5కోట్ల పని గంటలు నష్టమయ్యాయని, కరోనా సంక్షోభం కొనసాగినంత కాలం ఈ నష్టం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి మందులో, వ్యాక్సినో వేగంగా అందుబాటులోకి రావాలి. అదే జరిగితే ప్రాణ నష్టం లేకుండా జనం పనిపాటల్ని పునఃప్రారంభించ గలుగుతారు. అది ఆలస్యమైనంత కాలం ఆర్థిక నష్టం పెరుగుతూనే ఉంటుంది. మొదట అంతర్జాతీయ పెట్టుబడి ప్రవాహాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. వ్యాపారాలు బంద్‌ కావడం వల్ల ప్రైవేటు లాభాలు ఆవిరైపోయి నగదుకు కటకట ఏర్పడుతుంది. ఇప్పటికే తీవ్ర రుణ భారంతో కుంగిపోతున్న ప్రైవేటు కంపెనీలు వినూత్న పరిష్కారాలతో, నవ కల్పనలతో ముందుకువస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. కేంద్ర బ్యాంకులు భారీగా ఉద్దీపన నిధులు ప్రవహింపజేసి ప్రభుత్వాలకు, వ్యాపారాలకు గుక్కతిప్పుకొనే వ్యవధి ఇచ్చాయి. తమ దేశంలో కౌంటీ (జిల్లా) స్థాయి నుంచి బాండ్లు కొనుగోలు చేయాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వు (కేంద్ర బ్యాంకు) నిశ్చయించింది. దీనివల్ల జిల్లా, మునిసిపల్‌, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల అవుతాయి. మొత్తంమీద అమెరికా ఫెడ్‌ రిజర్వు నిరంతరం బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తొమ్మిది లక్షల కోట్ల డాలర్లను ప్రవహింపజేసింది. ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఏమైనా సరే ఆర్థిక వ్యవస్థను నిలబెడతామని ప్రకటించాయి. మహా మాంద్యాన్ని నివారించడానికి ఏది అవసరమైతే అది చేస్తామంటున్నాయి.

నిధులకు కటకట...
   నేడు సంపన్న, వర్ధమాన రాజ్యాలనే తేడా లేకుండా అన్ని దేశాలూ విలవిల్లాడుతున్నాయి. వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ఇప్పటికే 10,000 కోట్ల డాలర్ల నిధులు తరలిపోవడంతో, ఆ దేశాల కరెన్సీ విలువలు క్షీణించాయి. రానున్న నెలల్లో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినబోతున్నాయి. పర్యాటకం, విమానయానం, హోటళ్లు, ప్రయాణ సేవలు, క్రీడలు, అసంఘటిత రంగ కార్యకలాపాలు ఎప్పటికి తేరుకుంటాయో ఎవరూ చెప్పలేకున్నారు. ప్రపంచమంతటా ఈ రంగాల్లో కోట్లమంది పనిచేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు, భౌతిక దూరం పాటింపుల వల్ల గిరాకీ తగ్గి కార్మికులు, వ్యాపారాలు, ప్రభుత్వాలు అతలాకుతలమవుతున్నాయి. దాదాపు 70 దేశాలు ఎగుమతులపై ఆంక్షలు విధించినందువల్ల ప్రపంచ వాణిజ్యం కుదేలైంది. ప్రపంచ వాణిజ్యం 2020లో 13 నుంచి 32శాతం వరకు క్షీణించనుందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) హెచ్చరించింది. కరోనా విజృంభణ మూలంగా ప్రపంచంలో సగం చిన్న వ్యాపారాలు దెబ్బతినిపోవచ్చు.

ప్రభావం తాత్కాలికమే!
   కరోనా సంక్షోభం, చైనా పట్ల పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని చూసి ప్రపంచీకరణ అధ్యాయం ఇక ముగిసినట్లేనని భావించడం పొరపాటు. గడచిన 30 ఏళ్లలో ప్రపంచీకరణ పలు దేశాల్లో సరఫరా గొలుసుల ఆవిర్భావానికి కారణమైంది. అంటే, ఒక వస్తువు ఆకృతి (డిజైన్‌) ఒక దేశంలో రూపుదిద్దుకుంటే, దాని ఉత్పత్తి వేర్వేరు దేశాల్లో జరుగుతోంది. ఉదాహరణకు స్మార్ట్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ ఒక దేశంలో, దాని కెమెరా, ఇతర విడిభాగాలు వేర్వేరు దేశాల్లో తయారవుతాయి. దీన్నే సరఫరా గొలుసు అంటారు. దేశదేశాలకు విస్తరించిన ఈ గొలుసులను ఉన్నపళంగా తెంచితే అందరికీ నష్టమే. అలాగని అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు ఏమీ మారవని భావించడానికీ వీల్లేదు. ప్రభుత్వాలు ఈ సరఫరా గొలుసులను పనిగట్టుకుని విచ్ఛిన్నం చేయకూడదు. ముఖ్యంగా ఆహారం, మందుల సరఫరా గొలుసుల విషయంలో తొందరపాటు పనికిరాదు. మొండిగా ముందుకెళితే ప్రపంచంలో ఆహారం, ఔషధాలకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. కనుక నిత్యావసర వస్తువుల విషయంలో ప్రపంచ దేశాలు మరింత సహకారం సాధించాలి. కరోనా వల్ల పేద దేశాలు బాగా దెబ్బతింటున్నాయి. వ్యక్తులతో పాటు సంస్థలు, ప్రభుత్వాలు దివాలా అంచుకు చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ సభ్య దేశాల్లో కొన్ని- ఆ సంస్థ నుంచి ఆర్థిక సాయం కోరాయి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఇలాంటిది ఎన్నడూ జరగలేదు. అధిక జనాభా ఉన్న చిన్న దేశాలకు చేయూత ఇవ్వడానికి ధనిక దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ముందుకురావాలి. అలా చేయకపోతే ఈ దేశాలు తీవ్రవాద భావజాలం కలిగిన పార్టీలు, వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లి, రానున్న దశాబ్దాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతాయి. పేద దేశాల కరెన్సీలో రుణాలు మంజూరు చేసి వస్తుసేవల రూపంలో సహాయం అందించడానికి ధనిక దేశాలు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల అవి తీవ్ర ఆర్థిక లోటులోకి జారిపోకుండా రక్షించవచ్ఛు ఆర్థిక రథం మళ్లీ గాడిన పడేట్లు చూడవచ్ఛు ఆపైన ప్రభుత్వాలు యథావిధిగా తమ పాలనా బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం మీద దృష్టి పెట్టగలుగుతాయి.

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం