• facebook
  • whatsapp
  • telegram

  కొత్త ప్రమాణంతో కాలుష్యానికి కళ్లెం

* బీఎస్‌6 అమలుకు భారత్‌ సిద్ధం

దేశంలో జనాభాతోపాటు వాహనాల సంఖ్యా అధికమవుతోంది. ఏటా కొన్ని లక్షల కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచంలోని మొదటి పది కాలుష్య నగరాల్లో అధికభాగం భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న లక్ష్యంతో దేశంలో తొలిసారిగా 1991లో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల విడుదలపై పరిమితులు విధించారు. అప్పటి నుంచే సీసం లేని పెట్రోల్‌ విక్రయంతోపాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన ‘క్యాటలిటిక్‌ కన్వర్టర్ల’ను వాహనాల్లో వినియోగించడం మొదలైంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై నియంత్రణకు 2002లో భారత ప్రభుత్వం నియమించిన మషేల్కర్‌ కమిటీ ఓ నివేదికను రూపొందించింది. ప్రపంచంలో అప్పటికే వాహన కాలుష్యంపై పలురకాల నిబంధనలను పొందుపరచి సమర్థంగా అమలు చేస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను నమూనాగా తీసుకుంది. మషేల్కర్‌ కమిటీ నివేదికను ప్రామాణికంగా తీసుకున్న కేంద్రం, 2003లో జాతీయ వాహన ఇంధన విధానాన్ని ప్రకటించింది. యూరో ప్రమాణాలకు అనుగుణంగా దీనికి ‘భారత్‌ స్టేజ్‌’ అని పేరు పెట్టారు. కర్బన ఉద్గారాల నియంత్రణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దీన్ని దశలవారీగా ఉన్నతీకరిస్తున్నారు. కాలుష్య నియంత్రణ కోసం వాహన తయారీ రంగంతోపాటు పెట్రో ఉత్పత్తుల తయారీకి సంబంధించీ విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నారు. 2003లో యూరో-2 నియమాలకు అనుగుణంగా భారత్‌ స్టేజ్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆధునికీకరించిన యూరో ప్రమాణాల ప్రకారం మారుస్తున్నారు. ప్రస్తుతం ఏప్రిల్‌ ఒకటి నుంచి భారత్‌ స్టేజ్‌ 6 అమలుకానుంది. భారత్‌ స్టేజ్‌ అనేది- వాహన ఇంజిన్ల ప్రమాణాలను నిర్దేశించి, కర్బన ఉద్గారాలను నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది. భారత్‌ స్టేజ్‌ 6 ఇంజిన్లకు మరింత శుద్ధి చేసిన ఇంధనం అవసరం కావడంతో చమురుశుద్ధి పరిశ్రమలు తమ కర్మాగారాలను ఆధునికీకరించాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కర్మాగారాలు ఆధునికీకరణకు రూ.30వేల కోట్లకు పైగా వ్యయీకరించినట్లు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం బీఎస్‌4 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ గడువు మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి పూర్తిగా బీఎస్‌6 వాహనాల విక్రయాలు మాత్రమే ఉంటాయి. ఒకవైపు బీఎస్‌6ను పూర్తిస్థాయిలో విపణిలోకి తీసుకురావాలన్న కేంద్రం, అదే సమయంలో విద్యుత్‌ వాహనాలపైనా దృష్టి సారించింది. దీంతో వాహన పరిశ్రమలో కొంత అయోమయం నెలకొంది. విద్యుత్‌ వాహనాలు పూర్తిస్థాయిలో వచ్చేందుకు ఇంకా చాలా సమయముంది. 2030నాటికి విద్యుత్‌ వాహనాలను భారీగా తీసుకురావాలని యోచన ఉన్నా ఆ లక్ష్యం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బహుళ ప్రయోజనాలు
దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనం లభ్యం కానుంది. బీమా, పన్నులు పెరగడమూ వాహన విక్రయాలకు అటంకమే. జీఎస్‌టీని తగ్గిస్తే వాహన విక్రయాలు పెరగవచ్చు. దీంతో పరిశ్రమ నష్టాల నుంచి బయటపడే అవకాశముంది. 2030కల్లా భారత్‌ 10లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాలని నీతిఆయోగ్‌ ఆశిస్తోంది. వాహన పరిశ్రమలో ముఖ్యంగా 150 సీసీ కంటే తక్కువ ఉండే ద్విచక్ర వాహనాలను 2025కు, త్రిచక్ర వాహనాలను 2023కు విద్యుత్తుతో నడిచే విధంగా తీసుకురావాలని సూచించింది. విద్యుత్‌ వాహనాలు రానున్న నేపథ్యంలో బీఎస్‌6 అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. దేశంలో విద్యుత్‌ వాహనాలు ఇప్పటికే విపణిలోకి వచ్చాయి. వీటి ధర సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో పాటు ఛార్జింగ్‌ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంవల్ల వీటి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేకించి దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి ‘బ్యాటరీ బ్యాకప్‌’ లేకపోవడంతో విద్యుత్‌ వాహనాలు నగరాలకే పరిమితమయ్యాయి. ఈ వాహనాల్లో లిథియం ఇయాన్‌ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. దీని తయారీకి సంబంధించిన ముడిసరకుల కొరతతో ఎక్కువగా ఉత్పత్తి చేయలేకపోతున్నారు. బ్యాటరీల్లో వాడే ముడిసరకులు సైతం కొన్ని దేశాల్లోనే లభ్యమవుతున్నాయి. దేశీయంగా సమృద్ధిగా దొరికే అవకాశం ఇప్పట్లో లేదు. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు విద్యుత్‌ వాహనాలు కనీసం 15 ఏళ్ల వరకు ఎలాంటి పోటీ ఇవ్వలేవు. దీంతో వాహనపరిశ్రమ ఎలాంటి సంశయం లేకుండా ముందుకు దూసుకుపోవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్ల లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో విద్యుత్‌ వాహనరంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రపంచంలో శిలాజ ఇంధన వినియోగం తగ్గుముఖం పడుతోంది. పెట్రో ఉత్పత్తులకు సంబంధించి సౌదీ-రష్యాల మధ్య ఏర్పడిన పోటీతో వాటి ధరలు తగ్గుతున్నాయి. ఫలితంగా సంప్రదాయక వాహనాల వినియోగమే మేలని చెప్పవచ్చు. బీఎస్‌6తో ఇంధనంలో కాలుష్య కారకాలైన సీసం, గంధకం, కార్బన్‌ మోనాక్సైడ్‌, నత్రజని తదితర వాయువుల విడుదలా తగ్గనుంది. ఈ అంశాలను పరిశీలిస్తే బీఎస్‌6 వాహన వినియోగం దేశానికి పలు విధాలుగా లబ్ధి చేకూర్చనుంది. ఇక వాహనాల జీవిత కాలాన్ని 15 ఏళ్లకు పరిమితం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను తుక్కు కింద మార్చేస్తారు. ఈ నిర్ణయం వెలువడితే కొత్త వాహనాల విక్రయాలు తిరిగి పుంజుకోవచ్చు.

పర్యావరణం- ఆరోగ్య సంరక్షణ
బీఎస్‌6 వాహనాలు, వాటికి అవసరమైన ఇంధనం ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి బీఎస్‌6 ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి బీఎస్‌4 తరవాత అయిదో దశ రావాల్సింది. కానీ, అయిదు, ఆరో దశలకు సంబంధించి పెద్దగా వ్యత్యాసాలు లేకపోవడంతో కేంద్రం ఆరో దశను ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది ఒక రకంగా ప్రజలకు, వాహనరంగ పరిశ్రమకు లాభదాయకమే. అయిదో దశను అమలుచేసి ఉంటే వాహన పరిశ్రమలో అంచెలవారీ ఆధునికీకరణకు భారీగా వ్యయమయ్యేది. మరింత స్వచ్ఛమైన ఇంధనంవల్ల మైలేజీ పెరగడం కారణంగా వాహన కాలుష్యమూ తగ్గుముఖం పడుతుంది. బీఎస్‌6 ఇంజిన్ల ప్రమాణాల కారణంగా కర్బన ఉద్గారాలు పెట్రోల్‌ వాహనాల్లో 25 శాతం, డీజిల్‌ వాహనాల్లో 68 శాతం వరకు తగ్గుతాయి. ప్రజా రవాణాలో ఎక్కువగా డీజిల్‌ వాహనాలు ఉండటంతో పాటు, క్యాబ్‌ సర్వీసుల్లో వచ్చే కొత్త వాహనాలు వెలువరించే కాలుష్యం చాలావరకు దిగివస్తుంది. ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది కలుషితమైన గాలి పీలుస్తున్నారు. కాలుష్యకారకమైన వాయువులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా ఏటా అయిదేళ్లలోపు చిన్నారులు దాదాపు లక్షమంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్యం కారణంగా ఆస్తమా, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాహన కాలుష్యం తగ్గితే వ్యాధుల తీవ్రతా అదుపులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం బీఎస్‌4 వాహనాల్లో 50 పీపీఎం వరకు గంధకం వెలువడుతోంది. బీఎస్‌6లో అది 10 శాతానికి తగ్గుతుంది. ఐరోపా దేశాల్లో అమలుచేస్తున్న యూరో6 ప్రమాణాలతో బీఎస్‌6 సరితూగుతుంది. జపాన్‌, అమెరికాలూ యూరో6 ప్రమాణాలను అనుసరిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా అత్యాధునికమైన కొత్త వాహనాలతో పాటు స్వచ్ఛఇంధనం ఉపయోగిస్తున్న దేశంగా ఖ్యాతి లభిస్తుంది. ఇప్పటికే వాడుకలో ఉన్న పాతవాహనాల్లోనూ కొత్తగా వచ్చే ఇంధనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కూడా పర్యావరణ పరిరక్షణకు కలిసివచ్చే అంశమే. మనం శిలాజ ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. కొత్త విధానంలో మైలేజీ అధికం కావడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. ఫలితంగా చమురు దిగుమతులు తగ్గి, ఆ మేరకు విలువైన విదేశ మారక ద్రవ్యం సైతం ఆదా కానుంది.


ఎదురవుతున్న సవాళ్లెన్నో!
కొద్దికాలంగా దేశంలో వాహన పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇలాంటి తరుణంలో బీఎస్‌6కి మారడం పరిశ్రమపై మరిం భారాన్ని మోపింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ మార్పు అనివార్యమన్నది పర్యావరణ రంగ నిపుణుల వాదన. కొత్త విధానంలోకి మారడంతో వాహనాల ధరలూ పెరిగాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌6 ఆధారిత ఇంజిన్లు కలిగిన మోటారు వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం లక్షలాది బీఎస్‌4 వాహనాలు విపణిలోనే నిలిచిపోనున్నాయి. వీటిని తుక్కు కింద పరిగణిస్తామని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. గడువు దగ్గర పడుతుండటంతో బీఎస్‌4 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. వస్తురవాణాలో మెజారిటీ భాగం ట్రక్కులది. బీఎస్‌6 వాహనాల కొనుగోలు కోసం యజమానులు కొత్త ట్రక్కుల కొనుగోలును వాయిదా వేశారు. దాంతో దీనిపై ఆధారపడిన పలు చిన్న పరిశ్రమల్లో పనులు ఉండటం లేదు. ద్విచక్ర, పాసింజర్‌ కార్ల విభాగానికి సంబంధించి బీఎస్‌6 వాహనాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. వాహన తయారీ పరిశ్రమలు ఏడాది క్రితం నుంచే ఆధునికీకరణ బాట పట్టాయి. కానీ, వినియోగదారుల్లో బీఎస్‌6పై ఇంకా అవగాహన ఏర్పడలేదు. బీఎస్‌6తో కూడిన వాహనాల వినియోగం, ప్రయోజనాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో భారీయెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఉంటే ఇప్పటికే వాహన కొనుగోలుదారుల్లో మంచి అవగాహన వచ్చి ఉండేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- కొలకలూరి శ్రీధర్‌

Posted Date: 27-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం