• facebook
  • whatsapp
  • telegram

  తరుగుతున్న వాయు కాలుష్యం

* తేటపడుతున్న నగరాలు

    ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా పాటిస్తున్న ‘లాక్‌డౌన్‌’ పర్యావరణపరంగా మంచి ఫలితాలనిస్తోంది. దేశంలో వాయుకాలుష్యం పెచ్చుమీరిన పరిస్థితుల్లో- మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ వెన్వెంటనే ‘లాక్‌డౌన్‌’ కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా వాయు నాణ్యత మెరుగుపడినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దానితోపాటు గంగ, యమున నదీ జలాల్లోనూ కాలుష్య స్థాయులు కోసుకుపోయాయి. కరోనా తీవ్రతను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లలోనుంచి అడుగు బయటపెట్టకుండా ఉండిపోవడంవల్లే- నేడు రహదారులపై వాహనాల రాకపోకలు లేవు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పరిశ్రమలు, మార్కెట్లు, ఆఖరుకు ప్రార్థనా స్థలాల్లోనూ ప్రజల సంచారాన్ని కట్టడి చేయడంతో వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గింది. క్రమంగా కొడిగడుతున్న వాయు నాణ్యత సమస్యకు ఈ ‘లాక్‌డౌన్‌’ తాత్కాలిక పరిష్కారమే. కాలుష్య నియంత్రణ మండలి అంచనాల మేరకు- 2.5 పీఎమ్‌ మోతాదు కంటే తక్కువ పరిమాణంలోని కాలుష్య కారకాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ నుంచి ఇతర అవయవాలకు, రక్తంలోనూ కలిసి తీవ్ర అనారోగ్యానికి హేతువులవుతాయి.


శిలాజ ఇంధన వినియోగం తగ్గాలి
    దేశ రాజధాని దిల్లీలో ‘లాక్‌డౌన్‌’ మొదలైన వారం తరవాత వాయు నాణ్యతను పరీక్షించగా ఒక్క ఘనపు మీటరుకు 16 మైక్రోగ్రాముల నుంచి 42 మైక్రోగ్రాములుగా నమోదైంది. గడచిన ఏడాది ఇదే రోజుల్లో దిల్లీ నగరంలో గాలిలో కాలుష్య కారకాలు ఒక్క ఘనపు మీటరుకు 72 నుంచి 187 మైక్రోగ్రాములుగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం రహదారులపై మోటారు వాహనాలు వెదజల్లే శిలాజ ఇంధన ఉద్గారాలే. సాధారణంగా వేసవిలో వాయుకాలుష్యానికి- దుమ్ము-ధూళి, నిర్మాణ కార్యకలాపాలు 35 శాతం; మోటారు రవాణా పరిశ్రమల రంగం చెరో 20శాతం కారణమవుతున్నాయి. ఈ ‘లాక్‌డౌన్‌’ నేపథ్యంలో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడం శుభసూచకం. ఈ తగ్గుదల మోతాదులో పరిశ్రమల వాటా 10శాతం, మోటారు వాహనాల రంగం వాటా 10 శాతం, దుమ్ము-ధూళి కణాల వాటాను 10నుంచి 15 శాతంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కగట్టింది. మార్చి 29నాటి పరిస్థితులు గమనిస్తే దేశవ్యాప్తంగా 91 నగరాల్లో వాయు నాణ్యత సూచీ మెరుగుపడింది లేదా సంతృప్త స్థాయికి చేరింది. మరో 30 నగరాల్లో ఈ నాణ్యత మరింత మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రమే కాకుండా ముంబై, పుణె, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ సగటున నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు పరిమాణం మునుపటితో పోలిస్తే 40 నుంచి 50 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ఏప్రిల్‌ మొదటివారానికి పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి. రవాణా ఉద్ధృతి కనిష్ఠానికి చేరడం; కర్బన ఇంధనాల వినియోగం, విద్యుదుత్పాదనకు డిమాండ్‌ గణనీయంగా కోసుకుపోవడమే ఇందుకు కారణాలు. చైనా, ఐరోపా దేశాల్లోనూ కాలుష్యం గణనీయంగా తగ్గింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని కనీసస్థాయికి తగ్గించగలిగితే పెచ్చరిల్లుతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుందన్నది కరోనా వైరస్‌ నేర్పిన గుణపాఠంగా గుర్తుంచుకోవాలి. ఉత్తరాదిన వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చి చివరకు ఒక దశలో బలవంతంగా విద్యాసంస్థలను మూసివేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు విమానాలను దారి మళ్ళించాల్సి వచ్చిందంటే వాయు నాణ్యత ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ప్రస్తుతం దిల్లీవాసులు స్వచ్ఛమైన వినీలాకాశాన్ని దర్శించగలుగుతున్నారు. వాయునాణ్యత మెరుగుపడిందనడానికి ఇది నిదర్శనం.


పాఠాలు నేర్వాలి
    అంతకంతకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ శ్యాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో అత్యధిక శాతం శ్వాసకోశ వ్యాధిగ్రస్తులున్న దేశాల్లో భారత్‌ సైతం ఒకటి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్షయవ్యాధి పీడితులున్నదీ భారత్‌లోనే. శ్వాసకోశ వ్యాధుల ముప్పును కరోనా మరింత పెంచుతుంది. ఇప్పటికే న్యూమోనియా, అస్తమా వంటి వ్యాధులతో సతమతమవుతున్న యువత, పిల్లలు సైతం కరోనా విషవలయంలో చిక్కుకునే ప్రమాదం కొట్టిపారేయలేనిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం- ఇప్పటికే న్యూమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారికి; వృద్ధులకు ఈ వైరస్‌ వల్ల ముప్పు అధికంగా పొంచి ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది వాయుకాలుష్యం మూలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తే తప్ప వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కుదిరే పనికాదు. కరోనా సృష్టిస్తున్న సంక్షోభంనుంచి పాఠాలు నేర్చుకోవాలి. వ్యాధినిరోధకతను పెంచుకోవడం, స్వచ్ఛమైన ప్రాణవాయువు ప్రాధాన్యాన్ని గుర్తించడం అవసరం. ఆ మేరకు విధానాలను పునఃసమీక్షించుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, పవన, సౌరశక్తి గరిష్ఠ వినియోగంపై దృష్టిపెట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యపడుతుంది.
 

 డాక్ట‌ర్ జి.వి.ఎల్ విజ‌య్ కుమార్‌
భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం