• facebook
  • whatsapp
  • telegram

  నదీమతల్లుల తేటగీతి!


    కూర్చున్న కొమ్మనే తెగనరికి అభివృద్ధికి నిచ్చెనలు వెయ్యాలనుకొనే వివేక భ్రష్టత్వం అనేక విధాలుగా మనిషి మనుగడను దుర్భరం చేస్తోంది. పారిశ్రామికీకరణ కారణంగా జడలు విరబోసుకొన్న కాలుష్యం నేలానింగీ గాలీనీటిని విష సదృశం చేసి మనుషుల ఆయుర్దాయాన్ని నిర్దయగా చిదిమేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కాటుకు 83 లక్షలమంది బలి అయితే, అందులో 23 లక్షలమంది భారతీయులేనని నిరుడు డిసెంబరునాటి అంతర్జాతీయ అధ్యయనం నిగ్గుతేల్చింది. ఒక్క పారిశ్రామిక కాలుష్యమే ఇండియాలో దాదాపు పన్నెండున్నర లక్షలమందికి మరణశాసనం లిఖిస్తోంది. కరోనా మహమ్మారి కట్టడి వ్యూహంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలుచేయడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయి- పర్యావరణం తేటపడిన తీరు విస్తుగొలుపుతోంది. జీవ నదుల్లోకి విషకాలుష్య వ్యర్థాల వరద ఆగిపోవడంతో వాటిలో స్వచ్ఛ జలకళ ఉట్టిపడుతోందని ఉత్తర్‌ ప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి స్పష్టీకరిస్తోంది. కాలుష్య కాసారంలా మారిన పావన గంగను శుద్ధిచేసే మహా సంకల్పాన్ని కేంద్రం ప్రకటించి మూడున్నర దశాబ్దాలైంది. రాజీవ్‌ జమానాలో మొదలై నాలుగు వేలకోట్ల రూపాయలు ధారపోశాక కూడా గంగ ప్రక్షాళన జరగకపోబట్టే మోదీ సర్కారు ‘నమామి గంగ’ ప్రాజెక్టును చేపట్టింది. రూ.28,790 కోట్ల వ్యయంతో 310 ప్రాజెక్టులు చేపట్టి ఈ సంవత్సరాంతానికి లక్ష్యం సాధించాలనుకున్నా, 37 శాతం పనులే పూర్తి అయ్యాయి. మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల్ని విస్తృతంగా చేపట్టి గంగను పరిశుద్ధం చెయ్యాలని ప్రభుత్వం భావిస్తే- పారిశ్రామిక వ్యర్థాలు కలవకుంటే తనకు తానే పునరుజ్జీవం పొందగలనని గంగమ్మ చాటిచెబుతోంది. కాలుష్యం కాటు లేకపోవడంతో ప్రధాన నదీమ తల్లులన్నీ తమంతట తామే తేరుకొంటున్న తీరు- జలసిరుల పునరుజ్జీవన వ్యూహాలు మారాలనీ స్పష్టీకరిస్తోంది!
    పావన గంగను భారతావని ఆత్మగా తొలి ప్రధాని నెహ్రూ సంభావిస్తే- తాగడానికే కాదు, పవిత్ర స్నానానికీ పనికిరాని విధంగా ఆ ఆత్మను ఛిద్రం చేసిన పాపం ఎనిమిది రాష్ట్రాల అధికార యంత్రాంగానిది. ప్రధాన పాయకు పక్కనే ఉన్న 97 పట్టణాలనుంచి ప్రతి రోజూ మూడొందల కోట్ల లీటర్ల మురుగునీరు 155 పెద్ద కాల్వల ద్వారా నేరుగా గంగలోకే ప్రవహించి దాని జీవాత్మను హరించింది. ఒక్క గంగానదే కాదు, విచ్చలవిడిగా కాలుష్య వ్యర్థాలను నదీ గర్భాలకు చేర్చే దురంతాలకు ఎక్కడికక్కడ కాలుష్య నియంత్రణ మండళ్ళే ప్రచ్ఛన్న తోడ్పాటునందిస్తుండటంతో పరిస్థితి అక్షరాలా చేయిదాటిపోయింది. దేశవ్యాప్తంగా 450 నదులున్నా- సగానికి పైగా తాగడానికి, నాలుగోవంతు స్నానానికీ పనికిరాకుండాపోవడం ఎంత ప్రమాదకరం? ఆ కాలుష్య కాసారాల నీటితో సాగైన పలు పంటల్లోకీ విష వ్యర్థాల అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి చేటుగా మారాయి. మురుగునీటి వ్యర్థాల శుద్ధిలో నేటికీ ఎంతో వెనకంజలో ఉన్న ఇండియా- గంగ పునరుజ్జీవన ప్రాజెక్టుల్లో ప్రధానంగా పట్టం కట్టింది వాటి నిర్మాణానికే! మొత్తం 310 ప్రాజెక్టుల్లో 152 మురుగునీటి శుద్ధి నిర్మాణాలే చేపట్టి రోజుకు 488 కోట్ల లీటర్లను శుభ్రపరచి నదిలోకి వదలాలన్నది ఏలికల అభిమతం. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, మురుగునీటి శుద్ధిని పకడ్బందీగా చేపట్టి, ఆ నీటిని పునర్వినియోగించేలా చూడటం ద్వారానే నదులకు సరైన సాంత్వన దక్కుతుందన్నది పర్యావరణవేత్తల మనోగతం! లాక్‌డౌన్‌ ముగిశాక కూడా పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోకి వెళ్లకుండా నియంత్రించే గట్టి చర్యలకు సానపట్టడం పర్యావరణ హితకరమవుతుంది. అపరిశుభ్ర నీటి వినియోగం వల్ల జనం రోగాలూ రొష్ఠుల పాలబడే దురవస్థ రూపుమాసిపోవాలంటే, జలవనరుల్ని ప్రాణప్రదంగా కాపాడుకోవడం వినా గత్యంతరం ఏముంది?

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం