• facebook
  • whatsapp
  • telegram

  నిబంధనలు గాలికి...

* కొరగాని పర్యావరణ చట్టాలు

    విశాఖపట్నంలో విషవాయువును విరజిమ్మిన ఎల్జీ పాలిమర్స్‌ పెట్రో రసాయన పరిశ్రమ ప్రమాదం పన్నెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా వందలమంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో మనదేశంలో ప్రమాదకర పరిశ్రమలు వెదజల్లే కాలుష్య వాయువుల నియంత్రణకు అమలవుతున్న పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్టాలు చర్చనీయాంశంగా మారాయి. అత్యంత ప్రమాదకర కాలుష్య కారక పరిశ్రమలు అనుసరించే ప్రమాణాలతో పాటు ప్రజాభద్రతలో పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ మేరకు జవాబుదారీగా వ్యవహరిస్తున్నాయనే అంశం తెరమీదకు వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం నాటి భోపాల్‌ దుర్ఘటన తరువాతే మన దేశంలో పరిశ్రమల కాలుష్యం నియంత్రణ కోసం పర్యావరణ చట్టాల అమలు ప్రక్రియ మొదలైంది. ఇన్నేళ్ల తరువాత కూడా పరిస్థితుల్లో, వ్యవస్థల్లో ఆశించిన మార్పు రాలేదన్న విషయాన్ని... తరచూ పునరావృతమవుతున్న పారిశ్రామిక ప్రమాదాలు తేటతెల్లం చేస్తున్నాయి.

దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా ‘పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్‌-2006’లోని నియమ, నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారిందనే విమర్శలున్నాయి. అత్యంత కాలుష్య కారక, ప్రమాదకర పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందే పర్యావరణ, సామాజిక నష్టాలను సమగ్రంగా అంచనా వేస్తే ఆధునిక సాంకేతికత సాయంతో ప్రమాదాలను నివారించే అవకాశాలుంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి విధానాలనే అమలు చేస్తున్నాయి. భారత్‌లో పర్యావరణ పరిరక్షణ చట్టం, రూపొందాక చాలా ఆలస్యంగా 1994లో ఈఐఏ మార్గదర్శకాల అమలు మొదలైంది. పెట్టుబడిదారుల అవసరాలకే ప్రాధాన్యమిస్తూ, ప్రజారోగ్యం, పర్యావరణ వ్యవస్థ విశాల ప్రయోజనాలను విస్మరించే అలవాటున్న పరిపాలన వ్యవస్థ ధోరణి కారణంగా ఈఐఏ విధానం ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేదు. 1994 తరవాత నియమాల్లో మరింత వెసుబాటు కల్పిస్తూ 2006లో ఈఐఏ నిబంధనల నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చింది. పరిశ్రమలు, ప్రాజెక్టులను ఏ,బీ కేటగిరీలుగా వర్గీకరించి, ఏ కేటగిరీ వాటికి కేంద్ర స్థాయిలోని అథారిటీ, బీ కేటగిరీకి రాష్ట్రస్థాయి అథారిటీ సూచనలు, సలహాలతో... కాలుష్య నియంత్రణ మండళ్లు, పర్యావరణ, అటవీ, సీఆర్‌జడ్‌ తదితర విభాగాల అనుమతులను మంజూరు చేస్తాయి. మెజారిటీ పరిశ్రమలు నియమ, నిబంధనల్లో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకుని ఈఐఏ నుంచి తప్పించుకొనే ధోరణి పెరిగింది. అత్యంత కాలుష్య కారకమైన ఏ కేటగిరీ కిందకు రావాల్సిన పెట్రో రసాయన ఆధారిత ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ దశాబ్దాలుగా ఈఐఏ ప్రక్రియను తప్పించుకున్న తీరు పర్యావరణ చట్టంలో లోపాలను ఎత్తిచూపుతోంది. కాలుష్య నియంత్రణ, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ యూనిట్‌ను నడిపేందుకు ఎల్జీ పరిశ్రమకు గత రెండు దశాబ్దాల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతులను లోతుగా పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అనుమతులిచ్చే అధికార వ్యవస్థ నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ఈఐఏ నోటిఫికేషన్‌ 1994, 2006 నిబంధన ప్రకారం ఈ యూనిట్‌లో తొలి నుంచీ పర్యావరణ ప్రభావ అంచనా, కాలుష్య నివారణకు అవసరమైన అధ్యయనాలు, వాటిని నివారణకు సూచనలు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి కీలక అంశాలను విస్మరించారు. పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్లుగా భద్రతా ప్రమాణాలు, సాంకేతిక పరికరాలు, గాలి నాణ్యత సూచించే పరిజ్ఞానం, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాలను పట్టించుకోకుండా ఏళ్ల తరబడి అనుమతులు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది.

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న పెట్రో కెమికల్స్‌, పెట్రో ఇన్‌వెస్ట్‌మెంట్‌ రీజియన్ల (పీసీపీఐఆర్‌) విధానం ప్రకారం కోస్తా తీరం వెంబడి ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ పెట్రోకారిడార్లలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌ సహా పదుల కొద్దీ పెట్రో రసాయనాల ఆధారిత పరిశ్రమలు ఉండగా... భవిష్యతులో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్‌కు మంజూరైన అనుమతులను సమీక్షించడంతోపాటు, లోపాలను గుర్తించాలి. మరోపక్క దేశవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటుకు మంజూరు చేసే పర్యావరణ, అటవీ, సీఆర్‌జడ్‌ల అనుమతుల కోసం ప్రస్తుతం అమలవుతున్న ఈఐఏ నోటిఫికేషన్‌ నిబంధనలు, 2006ను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో ఈఐఏ నోటిఫికేషన్‌, 2020 పేరిట కొత్త నిబంధనలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం మొదలు కాకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు తీసుకునే ప్రక్రియ 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించడం, ప్రాజెక్టు వాస్తవ స్థితి నివేదికను సమర్పించే గడువు ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచి నియమాలను మరింత సరళతరం చేయడం వంటివి ప్రజాభీష్టానికి వ్యతిరేకమనే వాదన వినిపిస్తోంది. కొత్త నిబంధనలపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ప్రజామోదం ప్రతిబింబించే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో పారదర్శకంగా, నష్ట ప్రభావ మదింపు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియలతో భరోసా కల్పించినప్పుడే ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి సహకారం లభిస్తుంది.
 

- గంజివరపు శ్రీనివాస్‌


 

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం