• facebook
  • whatsapp
  • telegram

  భూమాతకు పచ్చలహారం!

    పంచభూతాల సమాహారం మన విశ్వం. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఎంత స్వచ్ఛంగా ఉంటే... సమాజం, మానవాళికి అంత ఆరోగ్యం. కోటానుకోట్ల సంవత్సరాలుగా సజీవంగా, స్వచ్ఛంగా ఉన్న ప్రకృతి 19వ శతాబ్దం నుంచి మూలాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా గడచిన మూడు దశాబ్దాలలో వచ్చిన శాస్త్ర, సాంకేతిక, జీవావరణ మార్పులు... ప్రకృతి స్వచ్ఛతను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, జీవుల మనుగడను శాసిస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం, అడవుల నరికివేత, వనరుల విధ్వంసం, మితిమీరిన ప్లాస్టిక్‌, రసాయనాల వినియోగం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. అందుకే నేడు భూమి, నీరు కలుషితమైంది. గాలి, నిప్పు, చివరకి నింగి కూడా కాలుష్య కేంద్రమైంది. పర్యవసానంగానే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రుతువులు గతితప్పి సకాలంలో వానలు కురవకుండా పోతున్నాయి. కరవులు కాటేస్తున్నాయి. శుద్ధమైన నీరు దొరకడం లేదు. నాణ్యమైన పంట పండటం లేదు. ఇలాంటి వాతావరణ పెను పరిణామాలకు కారణం మానవ చర్యలే. మానవ వికృత చేష్టలే పర్యావరణ భద్రతను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెడుతున్నాయి. వాతావరణ అసమతౌల్యం మానవ మనుగడకే ముప్పని తెలిసినా నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు.


సకలం కాలుష్యం...
    ప్రపంచవ్యాప్తంగా ఏటికేడు పెరుగుతున్న జనాభా, రెట్టింపవుతున్న వాహనాల సంఖ్య, పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, అంతరిస్తున్న అడవులు, తరిగిపోతున్న ప్రకృతి వనరులు వెరసి కాలుష్యం విషం చిమ్ముతూ భూతాపం తీవ్ర సమస్యగా మారింది. ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ఇవన్నీ కరవు కాటకాలకు దారితీస్తూ నీరు, ఆహార కొరతకు ఆజ్యం పోస్తున్నాయి. భూతాపాన్ని కనిష్ఠంగా రెండు డిగ్రీలకు తగ్గించాలన్న పారిస్‌ ఒప్పందం పట్టాలెక్కకపోవడం, అగ్రరాజ్యాలు కలసి రాకపోవడం... భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంలా మారింది. అసలే అధిక జనాభాతో అమితంగా సహజ వనరులు ఖర్చయ్యే మన దేశంలో కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. దేశంలోని ప్రతి సమస్యకు మూల కారణమై నిలుస్తోంది. ముఖ్యంగా భూమి, నీరు, పచ్చదనంపై ఆ ప్రభావం అధికంగా ఉంటోంది. అడవుల నరికివేత, మోతాదుకు మించిన ఎరువుల వాడకంతో నేల కన్నీరు పెడుతోంది. పుడమి పచ్చగా ఉండాలంటే 33 శాతం అడవులు ఉండాల్సిన దేశంలో 21 శాతానికి మించిలేవు. సగటున రోజుకు 333 ఎకరాల మేరకు అటవీ భూమి అదృశ్యమై నిర్జీవమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితోపాటు కొట్టుకుపోతున్నాయి. దీనికితోడు విచక్షణ రహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల పసిడి నేలలు నిర్జీవ క్షేత్రాలుగా మారుతున్నాయి. కోట్లాది సూక్ష్మ జీవులు, పోషకాలతో నిండి ఉండే సుసంపన్నమైన నేల నిస్సారంగా మారింది. సూక్ష్మ, స్థూల ధాతువుల లోపం పెరిగిపోయింది. హరిత విప్లవం తరవాత బస్తాల కొద్దీ ఎరువులు గుమ్మరించనిదే పంట పండని రీతిలో నేలలు క్షయమయ్యాయి. భూసార ఆధారిత ఎరువుల వినియోగానికి పెద్దపీట వేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రైతుల్లో అవగాహన కరవై ఎరువుల వినియోగం తగ్గడం లేదు. సేంద్రియ కర్బనం హరించుకుపోయి కనీస దిగుబడి కూడా దక్కడం లేదు.
    ఈ భూమిపై తన స్థానం ఏమిటనేది మానవుడు గుర్తెరగాలి. మనతోపాటు ఎన్నో లక్షల జీవరాశులు ఈ ప్రకృతిని పంచుకుంటున్నాయనే విషయం మరవకూడదు. మన చర్యల కారణంగా ఎన్నో జాతులు, జీవులు అంతరించే దశ, అరుదైన జాబితాలోకి చేరుతున్నాయని గ్రహించాలి. జీవులు అంతరిస్తే జీవ వైవిధ్యం క్షీణిస్తుందన్న వాస్తవం పసిగట్టాలి. భూతాపం, పర్యావరణ మార్పులకు మనమే కారకులం. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనదే. ఉష్ణోగ్రతలు తగ్గించడం సంగతేమోగానీ అవి పెరగకుండా కాచుకోవాల్సిన అవసరం మానవాళిదే.


గుణపాఠాలతో మేల్కోవాలి...
    పచ్చదనం, జలం లేనిదే పర్యావరణం లేదు. నేల తల్లిని దెబ్బతీసే పనులు చేస్తే భవిష్యత్తు అంధకారమే! ఈ హెచ్చరికను ప్రపంచ పర్యావరణ దినం మరోసారి గుర్తుచేస్తోంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఉత్తరాదిలో మానవ కార్యకలాపాలు, పారిశ్రామిక వ్యర్థాల విడుదల ఆగిపోవడంతో... గంగ, యమున నదులు స్వచ్ఛంగా మారిన ఉదంతాలు మనకు కనువిప్ఫు మనిషి నీడ తగలకపోతే నదులు ఎంత నిర్మలంగా ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం. మనిషి పలువ్యాధులు, కాలుష్యం లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే పర్యావరణానికి పునరుజ్జీవం పోయాలి. భూమి, నీరు, మొక్కలు, జీవులను కాపాడుకోవాలి. ప్రస్తుతం యావత్‌ ప్రపంచానికి సవాలు విసురుతున్న కరోనా నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్‌’ కార్యక్రమంలో పిలుపునిచ్చినట్లుగా... జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో హరిత వనాల వృద్ధికోసం ఉభయ ప్రభుత్వాలు చేస్తున్న చర్యలను రెట్టింపు చేయాలి. అడవుల విస్తీర్ణం పెంపుకోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలి. నేలను తాకే ప్రతి నీటిబొట్టునూ నిల్వ చేయగలగాలి. మొక్కలు పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తలకెత్తుకోవాలి. భూతాపం, పర్యావరణ మార్పుల తొలి బాధితులైన అన్నదాతలు భాగస్వాములు కావాలి. ఆదర్శ సేద్య విధానాలను అవలంబించి భూమాతను కాపాడుకోవాలి. బిందు, తుంపర్ల సేద్యం, కందకాలు, నీటి గుంతలు, బోర్ల రీఛార్జితో బొట్టు నీరు వృథా కాకుండా పొదుపుగా వాడాలి. భూసారాన్ని పరిరక్షించి, నీటి అవసరం తగ్గించే సహజ సేద్య పద్ధతులు అనుసరించాలి. ప్రతి పౌరుడు ప్రకృతి వనరుల పరిరక్షణకు ముందుకు కదిలితేనే సుసంపన్న వనరులతో నిండిన ప్రకృతిని రేపటి తరాలకి అందించగలుగుతాం. ఈ భూమండలాన్ని యథాతథంగా కాపాడటమే పర్యావరణ దినోత్సవ అంతరార్థం అనే సంగతిని మరవద్దు.


ప్రమాద ఘంటికలు
   జీవ ఉనికికి, మనుగడకు ఆధారం జలం. భూమండలంలో మూడొంతులు నీరున్నా సాగు, తాగుకూ కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు పారిశ్రామిక, రసాయనిక వ్యర్థాలతో జల కాలుష్యం కాటేస్తుంటే... మరోవైపు వరదల వేళ ఉదారంగా లభించే జలాలు సముద్రం పాలవుతున్నాయి. వర్షం నీటిని ఒడిసిపట్టడం మానేసి, భూగర్భానికి తూట్లు పెడుతూ తోడేస్తున్న జలంతో ఏటికేడు నీటి కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాలు మృగ్యమై, భూగర్భ జలాలు పడిపోయి జీవ తడులు సైతం అందక పచ్చని చేలు బీళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు జల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం మూలంగా రైతులు క్షామాలతో అల్లాడుతూ అప్పుల పాలవుతున్నారు. మరోవైపు...జీవ వైవిధ్యానికి ప్రతిరూపాలైన వృక్షాలు కనుమరుగవుతున్నాయి. సామాజిక వనాలకు జీవం పోయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నాయంటూ నిర్దాక్షిణ్యంగా చెట్లను తొలగిస్తున్నాయి. పచ్చని చెట్ల నరికివేత, వర్షాభావం, నీటి కొరత, గాలి కాలుష్యానికి కారణభూతమై నాణ్యమైన జీవనాన్ని హరిస్తోంది.
 

- ఎం.కరుణాకర్‌ రెడ్డి
(రచయిత- ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)

 

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం