• facebook
  • whatsapp
  • telegram

మంచుకొండలకు సరికొత్త ముప్పు

ప్రమాదకరంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు
 

హిమాలయాలను అధిరోహించాలని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం మీద జెండా పాతి రావాలని పర్వతారోహకులు ఎంతగానో పరితపిస్తారు. అటువంటి వారి ఉత్సాహమే ఆ మంచుకొండల పాలిట శాపంగా మారుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ పదార్థాలను ఎవరెస్ట్‌ మీదకు తీసుకెళ్లడాన్ని ఎప్పుడో నిషేధించినా- పాలిస్టర్‌, అక్రిలిక్‌, నైలాన్‌, పోలీప్రొపైలీన్‌ లాంటి పదార్థాల నుంచి వెలువడే సూక్ష్మ ప్లాస్టిక్‌లు (మైక్రో ప్లాస్టిక్స్‌) ఎవరెస్ట్‌ శిఖరానికి అత్యంత సమీపంలో పేరుకుపోతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూస్తే- పర్వతారోహకులు ధరించే దుస్తులు, వారు బస చేసే గుడారాలు, పర్వతారోహణకు ఉపయోగించే కొన్ని పరికరాల నుంచేనని తేలింది. సింథటిక్‌ దుస్తులలో ప్రతి గ్రామునుంచి 20 నిమిషాలకోసారి 400 సూక్ష్మ ప్లాస్టిక్‌లు వెలువడతాయి. హిమాలయాలపై 27,500 అడుగుల ఎత్తులో ఉండే బాల్కనీ అనే ప్రదేశం నుంచి ఎవరెస్ట్‌ శిఖరం కేవలం కొన్ని గంటల దూరంలోనే ఉంటుంది. సరిగ్గా అక్కడే ఈ సూక్ష్మ ప్లాస్టిక్‌లు ఇటీవల పెద్ద సంఖ్యలో కనిపించాయి. పరిశోధకులు వివిధ ప్రాంతాల్లో మంచును సేకరించి, దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అనుకోకుండా 11 ప్రాంతాల్లోని నమూనాల్లో ఈ సూక్ష్మ ప్లాస్టిక్‌లను గుర్తించారు. ఇవన్నీ బేస్‌క్యాంపు, బాల్కనీల మధ్యలోనే ఉన్నాయి. అక్కడ పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ఇంకా పెద్ద సంఖ్యలోనే ఈ కాలుష్య కారకాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇవన్నీ మంచుకొండలకు సరికొత్త ముప్పును తెచ్చి పెడుతున్నాయి.
 

నిజానికి హిమాలయాలపై కాలుష్యం ఈనాటిది కాదు. మనిషి ఆ మహాపర్వతం మీద అడుగుపెట్టడానికి 200 ఏళ్లకు ముందే పారిశ్రామిక కాలుష్యం అక్కడ ఉందన్న విషయం అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం పుణ్యమాని 1780 నుంచే పరిశ్రమల ఏర్పాటు మొదలైంది. వాటినుంచి వెలువడిన కర్బన ఉద్గారాలు క్రమంగా శీతల పవనాల్లో కలిసి, 10వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి హిమాలయాల మంచు ఫలకాల్లో పేరుకుపోయాయి.
 

గాలి నుంచి కూడా సూక్ష్మ ప్లాస్టిక్‌లు అదనంగా వచ్చి పేరుకుంటున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. తాము చూసిన ప్రతి ఒక్క మంచు నమూనాలోనూ సూక్ష్మప్లాస్టిక్‌లు కనిపించాయని, సాధారణంగా అయితే హిమాలయాలు, అందునా అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌ వరకు ఇవి చేరుకోవడం అసాధ్యమనే ఇన్నాళ్లూ అనుకున్నా, అక్కడికీ వ్యాపించాయంటే ఇప్పుడైనా కళ్లు తెరవక తప్పదు. హిమాలయాలను ఇప్పటికే పలు రకాలుగా కాలుష్య కాసారాలుగా మార్చేశారు. సాధారణంగా ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కడానికి పర్వతారోహణ ప్రారంభించినప్పటి నుంచి 6-9 వారాల సమయం పడుతుంది. పర్వతారోహకులు, వారి సహాయకులు నెలలపాటు వదిలిన వ్యర్థాలన్నీ టన్నుల లెక్కన అక్కడ పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను అక్కడినుంచి తరలించేందుకు నేపాల్‌ ప్రభుత్వం పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ దేశం మీదుగా శిఖరారోహణకు వెళ్లే ప్రతి బృందం నుంచి నాలుగువేల డాలర్లు వసూలు చేస్తోంది. కిందకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది కిలోల వ్యర్థాలను తీసుకొస్తే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. అలా ఒక్క 2017 సంవత్సరంలోనే 25 టన్నుల చెత్తను, 15 టన్నుల మానవ వ్యర్థాలను పర్వతారోహకులు ఎవరెస్ట్‌ మార్గం నుంచి కిందకు తీసుకొచ్చి కొంతమేర ఆ శిఖరాన్ని శుభ్రం చేశారు.
 

ఇవన్నీ ఒక ఎత్తయితే- సూక్ష్మప్లాస్టిక్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పు మరో ఎత్తు. ఎందుకంటే, ఇతర వ్యర్థాలన్నింటినీ మామూలు కంటితో చూసి, గుర్తించి తీసేసేందుకు అవకాశం ఉంది. కానీ సూక్ష్మ ప్లాస్టిక్‌లు అలా కాదు. వాటిని సేకరించడం దాదాపు అసాధ్యం. గతంలో ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతంలో తవ్వినప్పుడు, మహాసముద్రాల లోతుల్లో గాలించినప్పుడు కొన్ని సూక్ష్మ ప్లాస్టిక్‌లు కనిపించాయి. అలాగే సముద్రపు లోతుల్లో ఉండే కొన్ని జీవుల ఉదరాల్లోనూ వీటి జాడను శాస్త్రవేత్తలు పసిగట్టారు. చివరకు సొరచేపల కడుపులోనూ కొన్ని సూక్ష్మప్లాస్టిక్‌లు కనిపించాయి. దీన్నిబట్టి చూస్తే ఈ కాలుష్యం సముద్రపు లోతుల నుంచి అత్యున్నత శిఖరం వరకు అన్నిచోట్లా ఉందని అర్థమవుతోంది. సాధారణంగా మన శరీరంలో ఉండే రక్తప్రవాహంలోకి బయటి వస్తువులేవీ చేరకుండా ఉండేలా కాపాడేందుకు ఒక పొర ఉంటుంది. దాన్ని సైతం ఈ సూక్ష్మ ప్లాస్టిక్‌లు దాటి వెళ్లిపోతున్నాయి. అంతేకాదు- గర్భిణులు వీటి ప్రభావానికి గురైతే, మాయ గుండా వెళ్లి గర్భస్థ శిశువు మీదా ఇవి ప్రభావం చూపగలవు. వీటివల్ల పురుషులు, మహిళల్లో పునరుత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్ల విడుదల తగ్గడం వల్ల సంతాన సాఫల్య రేటు పడిపోతుంది. పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగం, పునరుపయోగాలను తగ్గించడం ఒక్కటే మార్గం. ప్లాస్టిక్‌, సింథటిక్‌ దుస్తులకు బదులు కాటన్‌ వంటి సహజ ఫైబర్లతో తయారైన దుస్తులను ఉపయోగిస్తే భవిష్యత్తులో అసలు ఈ సమస్యే ఉత్పన్నం కాదు.
 

- పి.ఉషారాణి
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం