• facebook
  • whatsapp
  • telegram

తాగునీరు విషతుల్యం!

కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే

నీరు ప్రకృతిలోని ప్రతి ప్రాణికీ జీవనాధారం. పర్యావరణ పరిరక్షణలో నీటిది ప్రత్యేక స్థానం. మానవ శరీరంలోని వివిధ కణ జాలాలు, అవయవాలు పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేయాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు అవసరం. మనం తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి. స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. రక్షిత మంచినీరు ఆరోగ్య ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది వంటిది. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కారణంగా మన దేశంలో భారీస్థాయిలో ఆర్థిక భారం పడుతున్నట్లు యునిసెఫ్‌ అంటోంది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 1170 మిల్లీమీటర్లుగా నమోదవుతోంది. సహజ జల వనరులూ ఉన్నాయి. ఈ నీటిని పరిరక్షించుకోవడంలో లోపాల కారణంగా సింహభాగం సముద్రంలో కలిసి వృథా అవుతోంది. మితిమీరిన జల కాలుష్యం, జనాభా పెరుగుదల, పెరిగిన వాతావరణ ఉష్ణోగ్రతలు మన దేశంలో తీవ్ర నీటి ఎద్దడికి దారి తీస్తున్నాయి. కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ గణాంకాల మేరకు 2016-17 నాటికి దేశంలోని 65 శాతం మాత్రమే గొట్టాల ద్వారా, చేతి పంపుల ద్వారా రక్షిత మంచినీరు పొందినట్లు తెలుస్తోంది. ఇంకా వేలకొద్దీ గ్రామాలు సాధారణ నీటి వసతికి దూరంగానే ఉన్నాయి. 2016లో విడుదలైన ‘వరల్డ్‌ వాటర్‌ ఎయిడ్‌’ నివేదిక ప్రకారం మనదేశంలో రక్షిత మంచినీటి లభ్యత అంతంత మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అంచనా మేరకు మన దేశ ప్రస్తుత నీటి అవసరాలు సంవత్సరానికి 110 కోట్ల ఘనపు లీటర్లు. 2025 నాటికి ఇది 120 కోట్ల ఘనపు లీటర్లుగా, 2050 నాటికి 144 కోట్ల ఘనపు లీటర్లుగా ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి మన దేశంలో నీటి కొరత యాభై శాతానికి పైగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు  స్పష్టం చేస్తోంది.  

నేడు మన దేశంలో స్వచ్ఛమైన తాగునీరు లభించడం మహాభాగ్యంగా మారింది. మనకు అందుబాటులో ఉన్న తాగునీటి నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా లేవని నిపుణులు అంటున్నారు. నీటి స్వచ్ఛతను కొలిచే ప్రక్రియ మన దేశంలో నిర్దుష్టంగా లేకపోవడంతో కలుషిత నీటినే ఎందరో ప్రజలు వినియోగించాల్సి వస్తోంది. అనేక ప్రాంతాల్లో నీరు- బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లతో, సీసం, ఆర్సెనికం, నికెల్‌, రాగి వంటి భారలోహాలతో కలుషితం అవుతున్నట్లు ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలు, గృహాల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు భూగర్భ జలాలనూ కలుషితం చేస్తున్నాయి. క్రిమిసంహారక మందులు, రసాయనాల వాడుక వ్యవసాయంలోను, చేపల సాగులోను మితిమీరుతోంది. తినే ఆహారం, తాగే నీరు, పాలు వంటి వాటిలో విష పదార్థాలు చేరి వ్యాధులకు, శారీరక సమస్యలకు కారకమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆర్గానో క్లోరైడ్‌తో కలుషితమైన నీరు మానవ నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు, కండరాలపై దీర్ఘకాలిక దుష్ఫలితాలను కలిగిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. తుపానులు, వరదలు సంభవించినప్పుడు ఈ కలుషిత జలాల ప్రభావం ప్రజలపై మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

కలుషిత నీటి సమస్యను ఆసరాగా చేసుకుని ప్లాస్టిక్‌ సీసాల్లో తాగునీటి అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఇది తాగు నీటి అవసరాలను కొంతమేరకు తీర్చగలిగినా ప్లాస్టిక్‌ వ్యర్థాల కాలుష్యానికి కారణమవుతోంది. దాదాపు ఎనభై శాతం ప్లాస్టిక్‌ సీసాలు మట్టిలో, జల వనరుల్లో కలుస్తూ, ప్రమాదకరమైన రసాయనాల విడుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్‌ పూర్తిగా కృశించిపోవడానికి దాదాపు వెయ్యి సంవత్సరాల సమయం పడుతుంది. మానవాళి, పశు, వృక్ష సంపదలపై ఆ మేరకు తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగు పడుతున్నాయి.

జల వనరులను పరిరక్షించడంలో, నీటి కాలుష్యాన్ని నివారించడంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తూ పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించడంలో శ్రద్ధ వహించాలి. నిషేధిత క్రిమి సంహారక మందుల వాడకంపై ఉక్కుపాదం మోపాలి. రైతులకు రసాయనాల వాడుకపై అవగాహన కల్పించి, సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగించే విషయంలో ప్రజానీకంలో చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు ఊపందుకోవాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌ 
(వైద్య రంగ నిపుణులు)

 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం