• facebook
  • whatsapp
  • telegram

నదీజలాల్లో భార లోహాలు

కఠిన నిబంధనలతోనే కట్టడి

ఫ్లోరైడ్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే, ఉపరితల జల వనరులను వినియోగించడమే శ్రేష్ఠమని కేంద్ర జలశక్తి సంఘం గతంలోనే సూచించింది. ఆ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుదూర ప్రాంతాల్లోని నదీజలాలను నగరాలకు తరలించి శుద్ధి చేసి అందిస్తున్నాయి. కానీ, ఆయా నదుల్లో చేరుతున్న కాలుష్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో సుమారు 20 నదీ పరీవాహక ప్రాంతాలు భార లోహాల కాలుష్య కోరల్లో ఉన్నాయి. ఫలితంగా వాటిపై ఆధారపడ్డ వృక్ష, జంతుజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నదని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (ఐయూసీఎన్‌) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎనిమిది భార లోహాలను విషపూరితమైనవిగా అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకటించింది. అందులో సీసం, క్రోమియం, ఆర్సెనికం, జింకు, కాడ్మియం, రాగి, పాదరసం, నికెల్‌ ఉన్నాయి. ఇవి తక్కువ మోతాదుల్లో పర్యావరణంలో కలిసినా జీవజాలం, మొక్కలపై తీవ్ర దుష్పరిణామాలు తప్పవు. ఈ ప్రభావాలను గుర్తించే నదీజలాల్లో వీటి మోతాదు తెలుసుకునేందుకు కేంద్రజలసంఘం (సీడబ్ల్యూసీ) దేశంలో ప్రధాన నదులపై 531 ప్రాంతాల్లో నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. గంగానదీ పరీవాహక ప్రాంతం పరిధిలో 145 కేంద్రాలతో పర్యవేక్షిస్తోంది. ఇలాంటి కేంద్రాలు గోదావరి పరిధిలో 39, కృష్ణా పరిధిలో 36 ఉన్నాయి. సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం-447 ఉపరితల నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుంచి 2,959 నమూనాలు సేకరించి పరీక్షిస్తే... 287 ప్రదేశాల్లోని నీటిలో మోతాదుకు మించి భార లోహాలున్నట్లు  తేలింది. 101 నమూనాల్లో రెండు భారలోహ ధాతువులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించింది. సాధారణంగా అన్ని నదుల్లో కనిపించే కాలుష్య కారక లోహం ఇనుముగా తేల్చింది. ఆ తరవాతి  స్థానంలో ఆర్సెనికం, జింకు, సీసం, కాడ్మియం, నికెల్‌, క్రోమియం వంటి విషప్రభావం కలిగినవి ఉన్నాయి.

నదుల్లోకి చేరుతున్నదిలా...
నిరంతర గనుల తవ్వకం, కాగితం, తోలు శుద్ధి, బ్యాటరీల పరిశ్రమలు, వ్యవసాయ సంబంధ రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగం, గృహ మురుగు నీటి వ్యర్థాల వల్ల ఈ ధాతువులు నదుల్లోకి చేరుతున్నాయి. వీటివల్ల భూమి సారం కోల్పోయి, మొక్కల్లో ఆహార గొలుసు దెబ్బతింటుంది. ఒక టన్ను రాగి ఉత్పత్తి చేసేందుకు చేపట్టే తవ్వకాలతో అంతకు మూడు రెట్ల వ్యర్థాలు వెలువడుతున్నట్లు జాతీయ సైన్స్‌ అకాడమీ ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఉపరితల గనుల తవ్వకం భూగర్భ తవ్వకాలతో పోల్చితే ఎనిమిది రెట్ల వ్యర్థాలకు కారణమవుతోంది. గృహ వ్యర్థాల నుంచీ ఈ కాలుష్య కారకాలు అధికంగా వచ్చి నేరుగా జలవనరుల్లో కలుస్తున్నాయి. నగరాల్లో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు 50శాతం మాత్రమే వీటిని వేరు చేయగలుతున్నాయి. కాడ్మియం, క్రోమియం, రాగి, సీసం, పాదరసం- గృహాలు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి పెద్దయెత్తున భూమి, నీటిలో కలుస్తున్నాయి. ఇవి నీరు, ఆహారం, గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పరిమితికి మించిన ఖనిజాలున్న నీరు తాగితే కండరాల క్షీణత, నరాల బలహీనత, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులు పీడిస్తాయి. నదీ నీటి కాలుష్యం వల్ల జీర్ణకోశ వ్యాధులు క్యాన్సర్‌ వంటి జబ్బులూ దాపురిస్తున్నాయి. మన దేశంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిమితికి మించి ఈ తరహా కాలుష్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

రక్షణ ఎలా?
ప్రజలు తాగే నీటిలో ఖనిజాలు ఎంత ఉండాలో ప్రమాణాలు నిర్దేశించారు. కానీ, ఆహార పదార్థాల్లో చేరుతున్న లోహధాతువులను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. జంతువులు, మొక్కలకు పెట్టే నీటి విషయంలో ప్రమాణాలున్నాయన్న విషయమూ ఎక్కువ మందికి తెలియకపోవడం గమనార్హం. భారలోహాలున్న నీటిని తాగిన పశువు ఇచ్చే పాలూ ఆ ప్రభావానికి గురవుతున్నాయి. ఆ తరహా నీటితో పెరిగిన మొక్కలు ఇచ్చే ఉత్పత్తుల్లోనూ ఆ అవశేషాలు ఉంటున్నాయి. అందుకే జాతీయ సైన్స్‌ అకాడమీ- పశువులు, కోళ్లు వంటివాటికి అందించే నీటికీ ప్రమాణాలు నిర్దేశించింది. ఎక్కడా ఇవి అమలు కావడంలేదు. నీటిని శుద్ధి చేసేందుకు రసాయన, భౌతిక, జీవ సంబంధమైన అనేక పద్ధతులు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వ్యర్థాలు విడుదలయ్యే పరిశ్రమల్లోనూ దీనిపై చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రమాణాల మేరకు శుద్ధి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో నామమాత్రంగా పని ముగించేస్తున్నారు. పెరుగుతున్న భార లోహాల కాలుష్యాన్ని తగ్గించాలంటే- వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న ప్రదేశంలోనే శుద్ధి చేసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. ప్రతి సీజన్‌లో భూసార పరీక్షలు చేసి అధిక మొత్తంలో రసాయన ఎరువులు వినియోగించకుండా రైతుకు సూచనలు చేయాలి. లేకపోతే కలుషిత నీరు తాగిన మనుషుల ప్రవర్తనలో, ఆహార అలవాట్లలో, జన్యుక్రమంలోనూ మార్పులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

- బండపల్లి స్టాలిన్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం