• facebook
  • whatsapp
  • telegram

కాలుష్యం కాటుకు నీరే గరళం!  

మేలుకోకుంటే తప్పదు ముప్పు

ప్రకృతి వనరుల్లో గాలి తరవాత నీరే వేగంగా కలుషితమవుతోంది. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతోపాటు భూగర్భ జలాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే 60 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే 2050 నాటికి భూమ్మీద ఈ నీరే గరళమవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. నీరు తన సహజ స్వభావాన్ని కోల్పోయి రసాయనిక, భౌతిక మార్పులు చెందడమే కాలుష్యం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో చోటుచేసుకున్న అంతుచిక్కని వ్యాధి ఉదంతానికి అసలు కారణం నీటి కాలుష్యమేనని ఇప్పటికే చాలామంది నిపుణులు తేల్చి చెప్పారు. నీటిలో మోతాదుకు మించి రసాయనాలు, లోహ అవశేషాలు ఉండటాన్ని గుర్తించారు. బొద్దింకలు, దోమలు ఇతర కీటకాలను చంపే రసాయనాల్లో వినియోగించే విషప్రభావం ఉండే రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించడం ఆందోళనకరం. ఇవేకాకుండా సీసం, నికెల్‌ వంటి లోహాలూ నీటిలో కరిగి ఉండటం గమనార్హం. 

‘ఓషన్‌ ఇండెక్స్‌ హెల్త్‌’ బృందం 2013లో ప్రపంచవ్యాప్తంగా 171 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది, జల సంరక్షణలో రష్యా ప్రథమ స్థానంలో నిలవగా భారత్‌ 162వ స్థానానికి పరిమితమైంది. దేశంలో నీటి కాలుష్యానికి చాలా కారణాలున్నా- పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రసాయనాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు ప్రధాన కారకాలు. ఒకప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటితో పంట చేలల్లో చేపలు ఎగసిపడేవి. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల  వాడకంతో నీరు విషతుల్యమై చేలల్లో మచ్చుకైనా చేపలు కానరావడం లేదు. నీటిలో ఉండే నత్తలు, జలగలు, ఏలిక పాములు వంటి ఎన్నో జీవులు ఈ గరళం ధాటికి కనుమరుగై పోతున్నాయి. చేలల్లో రసాయన జలాలు నదుల్లోకి, నదుల్లో కలుషితమైన నీరు పొలాల్లోకి చేరి నీటి విషగాఢతను పెంచుతున్నాయి. ఈ నీటిని వినియోగించిన జీవులు, మొక్కల్లో అవి అందించే ఆహార పదార్థాల్లో విషాలు చేరి దుష్ప్రభావాలను కలగజేస్తున్నాయి. తోళ్లు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్, ఇంధనాలు, బ్యాటరీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా చాలాచోట్ల యథేచ్ఛగా నదుల్లో కలుస్తున్నాయి. నగరాలే కాదు... గ్రామాల్లో సైతం మురుగు నీటిని మురికి కాలువల ద్వారా నదీజలాల్లో కలిపేస్తున్నారు. పారిశుద్ధ్య వ్యర్థాలు నదులు, కాలువలు, నీటి వనరుల గట్ల మీదే తాండవిస్తున్నాయి. ఇవి కూడా నిరంతరాయంగా నీటిలో కలిసి పోతున్నాయి. 

నిజానికి భూమి ఓ భారీ వడపోత యంత్రంలాంటిది. ఎంతటి వ్యర్థ జలాలనైనా వడకట్టి, శుద్ధ జలాలను భూమిలో ఇంకించి వ్యర్థాలను తనలో కలుపుకొని కొన్నాళ్లకు మట్టిగా మార్చేస్తుంది. మట్టితో కూడిన పిల్ల కాలువలు, మురికి కాలువలు కనుమరుగై పోతున్న తరుణంలో మనుషులు వినియోగించిన నీరు, వ్యర్థ జలాలు- కాంక్రీట్‌... మురుగు కాలువలు, ప్లాస్టిక్‌ గొట్టాల ద్వారా భూమిలో ఇంకే పరిస్థితి లేకుండా నేరుగా జలాశయాల్లో కలుస్తున్నాయి. భారత్‌లో ప్రతి మనిషి రోజుకు సగటున 135 నుంచి 150 లీటర్ల నీటిని వాడుతున్నట్లు అంచనా. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం దేశంలో రోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తుండగా- 7,800 టన్నులు మాత్రమే పునశ్శుద్ధి జరుగుతోంది. మిగతా 18,200 టన్నుల ప్లాస్టిక్‌ భూమిలో, నీటి వనరుల్లో, సముద్రాల్లో వ్యర్థాలుగా కలుస్తోంది. 450 ఏళ్ల వరకు కరగని ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేసేస్తున్నాయి. భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డుపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జలాల్ని కలుషితం చేస్తున్నాయి. 

మనదేశంలో నీటి వనరులను సంరక్షించుకునేందుకు 1974 నుంచి జలకాలుష్య నియంత్రణ నివారణ చట్టం అమలులోకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, ప్రమాదకర వృథా పదార్థాల (నిర్వహణ) నియమాలు-1989, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల దిగుమతి నిరోధక నియమాలు-1989, అటవీ సంరక్షణ చట్టం-1970, వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972, జాతీయ జీవవైవిధ్య చట్టం-2002... ఇవన్నీ నదుల పరిరక్షణ, జలకాలుష్య నియంత్రణ గురించి స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేటికీ కోట్లమంది కలుషితమైన నీటినే వాడాల్సిన దుస్థితి నెలకొంది. కలుషిత నీటితో నీళ్ల విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో ఏటా లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా ఉండటం బాధాకరం. ఇలాంటి పరిస్థితులున్న క్రమంలో చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు, జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించేలా విస్తృత జనచేతన కార్యక్రమాలు చేపట్టాలి. 

- చిలుకూరి శ్రీనివాసరావు
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం