• facebook
  • whatsapp
  • telegram

మూల్యం చెల్లించాల్సింది కాలుష్య కారకులే!

జవాబుదారీతనం పెరిగితే మేలు

కొన్ని మరణాలు అనివార్యం. ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. మరికొన్ని మాత్రం అడ్డుకుంటే ఆగేవే. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారించదగ్గవే. కాలుష్య కారక మరణాలు ఈ కోవలోకే వస్తాయి. 2019లో దేశంలో 17.8 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం. కాలుష్య కోరల బారిన పడి 16.7 లక్షల మంది మృతి చెందినట్లు ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాల కారకాల్లో వాయు కాలుష్యం నాలుగో స్థానంలో నిలుస్తోంది. మొత్తం మరణాల్లో పన్నెండు శాతం వాటా దీనిదే. ఇలాంటి మరణాలన్నీ పరిహరించదగినవే. వాయుకాలుష్యంతో సంభవించే ప్రతి వ్యాధినీ నివారించవచ్చు. వాయు కాలుష్యం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య సంక్షోభం. వాయు కాలుష్యం అనేది అదృశ్య హంతకి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే స్పష్టం చేస్తూనే ఉంది. దీని కారణంగా సంభవించే మరణాల రేటు లక్ష మందికి 86. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిశుభ్రమైన గాలికి సంబంధించిన పరిమితులకన్నా ఎక్కువ స్థాయుల్లో వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 92 శాతం ప్రపంచ జనాభా నివసిస్తోంది.

పెరుగుతున్న మరణాల రేటు

వాయు కాలుష్యం సాంక్రమిక వ్యాధులకు ఆజ్యం పోస్తోంది. గుండె వ్యాధుల్లో 20 శాతం వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవే. ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణంగా సంభవించే మొత్తం మరణాల్లో 19 శాతానికి వాయుకాలుష్యమే కారణం. ఉబ్బసం ముప్పునూ అంతకంతకూ పెంచుతోంది. పొగాకు, మద్యం వినియోగం వంటివీ మరణాలకు కారణమయ్యేవే. ఇవన్నీ నివారించదగినవి. ఈ క్రమంలో మనుషులకు అంతులేని నష్టాన్ని కలగజేస్తున్న పొగాకు, మద్యం వ్యాపార సంస్థలను ప్రభుత్వాలు జవాబుదారీ చేయవెందుకనేది పెద్ద ప్రశ్న. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కూడా ఒకదానికొకటి సంబంధం కలిగినవే. ఇవి మనుషులకు ఆర్థిక నష్టాలను కలిగించడంతోపాటు ఆరోగ్యపరమైన ముప్పునూ పెంచుతుండటం ఆందోళనకరం. ప్రభుత్వాలు అత్యవసరంగా స్పందించి చర్యలు తీసుకునేలా మాత్రం కనిపించడం లేదు.

వాయుకాలుష్యం కారణంగా అకాల మరణాలతో తలెత్తే ఉత్పత్తి నష్టం 2019లో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలని లాన్సెట్‌ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లోని బలహీన ఆరోగ్య వ్యవస్థకు కొవిడ్‌ రూపంలో అదనపు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో బహుళరకాల అకాల వ్యాధులను ఎదుర్కొనే పరిస్థితి లేదు. ప్రాథమికంగా నివారించగలిగిన వ్యాధులతో ఎవ్వరూ బాధపడకూడదు. అదేవిధంగా చికిత్స చేయదగిన వ్యాధులతో ఏ ఒక్కరూ అకాల మరణం బారిన పడకూడదు.

‘జాతీయ రాజధాని ప్రాంతం, పరిసరాల్లో వాయు నాణ్యత నిర్వహణపై కమిషన్‌-2020’కు సంబంధించిన ఓ అత్యవసరాదేశంపై భారత రాష్ట్రపతి ఇటీవల సంతకం చేశారు. వాయు కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించే వారికి కోటి రూపాయల జరిమానా లేదా అయిదేళ్ల జైలుశిక్ష విధించాలనే నిబంధన ఆ ఆదేశాల్లో ఉంది. రైతులు పంటవ్యర్థాలను దహనం చేయడం వల్ల తలెత్తే సమస్యల నేపథ్యంలో ఈ అత్యవసరాదేశం జారీ అయింది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో పారిశ్రామిక, వాహన కాలుష్యం వల్లే గాలి నాణ్యత అంతకంతకూ క్షీణిస్తున్నా- దీన్ని అరికట్టేందుకు ఏ ప్రభుత్వమూ కఠిన చట్టాన్ని తీసుకురావడం లేదు. కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశ్రమ వర్గాల ఒత్తిడి కారణంగా సమస్యతో రాజీపడుతున్నట్లు విమర్శలున్నాయి. పరిశ్రమలు, భారీ నగరాల సమీపంలోని జలవనరుల్లో కాలుష్యం స్థాయులే ఇందుకు తార్కాణం.

ప్రభుత్వాలదే బాధ్యత

సాధారణంగా కాలుష్యానికి కారకులుగా పేదలపైనే నెపం వేస్తుంటారుగానీ, పేదలు వినియోగించేదీ, కాలుష్యానికి కారణమయ్యేదీ చాలా తక్కువే. ఆర్థిక, ఆరోగ్య నష్టాలకు కారణమవుతున్న దారుణమైన వాయు కాలుష్యానికి ఎవరు మూల్యం చెల్లించాలి? గాలిని తీవ్రస్థాయిలో కలుషితం చేస్తున్న కార్పొరేట్‌ సంస్థల నుంచి ప్రభుత్వాలు పరిహారాల్ని ఎందుకు వసూలు చేయవు? వ్యాపార సంస్థల కోసం ప్రభుత్వాలు పర్యావరణ భద్రతా మార్గదర్శకాలను బలహీనపరచి, శక్తిహీనం చేసిన ఉదంతాలెన్నో కనిపిస్తాయి. పౌరులందరూ పరిశుద్ధమైన గాలిని పీల్చేలా చేయడం ప్రాథమికంగా ప్రభుత్వాలదే బాధ్యత. భూగ్రహం కలుషితమయ్యేలా ఎలాంటి కార్యకలాపాలకూ వాణిజ్య సంస్థలు పాల్పడకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఇలాంటి విషయంలో ఉల్లంఘనలకు పాల్పడే కార్పొరేట్‌ సంస్థలను జవాబుదారీగా మార్చాలి. మార్కెట్‌ ఆధారిత పరిష్కారాలు నిజంగా సమస్య నుంచి బయటపడేసేవి కావు. అవి తిరిగి వ్యాపార సంస్థలకే ప్రయోజనం చేకూరుస్తాయి. వాయుశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసినంతమాత్రాన పరిష్కారం దక్కదు. కాలుష్య కారక మూలాలను సరిదిద్ది, అభివృద్ధి నమూనాలను పూర్తిస్థాయిలో మార్చుకున్నప్పుడే గాలి, భూమిని కాలుష్యం బారిన పడకుండా అడ్డుకోవచ్చు.

- సందీప్‌ పాండే
(రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం