• facebook
  • whatsapp
  • telegram

జలం... గరళ సదృశం!

కాలుష్యం బారి నుంచి నదులకు మోక్షమెప్పుడు?

భారత్‌లో నదీ జలాల్లోకి వ్యర్థాల గుమ్మరింతను వెంటనే నిలువరించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించడం- దేశవ్యాప్తంగా జలవనరులు కాలుష్యం బారిన పడి ప్రమాదభరితంగా మారుతున్న వైనాన్ని మరోసారి కళ్లకు కడుతోంది. కలుషితమైన నదులను పరిరక్షించాలనే అంశాన్ని సుమోటోగా తీసుకుని- ఆ పని యమునా నదితో ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం గత వారం సూచించింది. పురపాలికలు శుద్ధి చేయని, లేదా పాక్షికంగా శుద్ధి చేసిన మురుగును, వ్యర్థాలను నీటివనరుల్లో కలుపుతూ ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్నాయంటూ దిల్లీ జల్‌ బోర్డు దాఖలు చేసిన ఓ వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా...  సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందించింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు తాకీదులు జారీ చేసింది.

సమూల ప్రక్షాళన అత్యావశ్యకం

ఒక్క యుముననే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో నదులను ప్రక్షాళించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణ, మంజీర, మూసీ, పెన్న, తుంగభద్ర, నాగావళి, వంశధార వంటి నదులూ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. సువిశాల భారతదేశంలో 450 నదులుంటే అందులో కలుషితమైనవాటి సంఖ్య 350కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రెండేళ్ల నాడే గుర్తించింది. పదేళ్లకు ముందు వాటి సంఖ్య 121. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) 2015లో సమర్పించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉత్పన్నమయ్యే మురుగునీరు 6,194.8 కోట్ల లీటర్లు. దేశంలోని నీటి శుద్ధి కేంద్రాలకు అందులో 38శాతాన్నే శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది. దీంతో నిత్యం 3,800 కోట్ల లీటర్ల శుద్ధి చేయని వ్యర్థ జలం భారత దేశంలోని నదులు, ఇతర జలవనరుల్లో కలుస్తోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు, పురపాలక వ్యవస్థలకు, పెద్ద నగరాలకు- నీటి శుద్ధి కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటికీ జలవనరుల్లోకి వ్యర్థాలను మళ్లించే తంతు నిరాఘాటంగా జరుగుతోందంటే కాలుష్య నియంత్రణ చర్యలు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో తెలుస్తోంది. మరోవైపు జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక (ఎన్‌ఆర్‌సీపీ), పట్టణాల్లో నీటి సరఫరాతో పాటు పలు ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసిన ‘అటల్‌ మిషన్‌’ (అమృత్‌), ‘నమామి గంగే’ వంటి ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు ధారపోస్తున్నా- కాలుష్యం తగ్గకపోగా నానాటికీ ప్రమాదకరస్థాయికి చేరుతోంది.

ఇప్పటికే దేశంలోని ఉపరితల జలాల్లో అత్యధికం వినియోగానికి పనికిరావని సీపీసీబీ వెల్లడించింది. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నది క్షాళనకు కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగే’ ప్రాజెక్టును రూ.20వేల కోట్లతో ప్రారంభించింది. 2020 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావలసిఉన్నా, ఇప్పటివరకూ 37శాతం పనులే పూర్తయినట్లు కేంద్ర జల్‌శక్తి అభియాన్‌ మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్నిబట్టి లక్ష్యాలను చేరుకోవడంలో మన యంత్రాంగాలకు ఉన్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోంది. ప్రక్షాళనకు నిధులు వెచ్చించినంతమాత్రాన సమస్య పరిష్కారం కాదు. కాలుష్య కట్టడికి కట్టుదిట్టమైన చర్యలూ అవసరం. ఉదాహరణకు ‘నమామి గంగే’లో భాగంగా రూ.11 వేల కోట్లకు పైగా వ్యయం చేసి నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి నిత్యం 117 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయగలవని అంచనా. అయితే, జాతీయ గంగా శుద్ధి మిషన్‌ అంచనాల ప్రకారం గంగానదిలో రోజుకు 290 కోట్ల లీటర్ల మురుగునీరు కలుస్తోంది. గంగానది ప్రక్షాళన ప్రాజెక్టుకు కొనసాగింపుగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు నదులను శుద్ధి చేసేందుకు ఇటీవల సిద్ధమయింది. ‘సేవ్‌ రివర్స్‌ (నదులను రక్షిద్దాం)’ పేరిట 13 ప్రాజెక్టులను సిద్ధం చేసింది. అందులో గోదావరి, కృష్ణ నదులూ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం.

కఠిన ఆంక్షలు తప్పనిసరి

ప్రమాదకరమైన ఫాస్పేట్‌ వంటి రసాయనాలు చేరితే నీటిపై నురగ ప్రత్యక్షమవుతుంది. దిల్లీ, ఆగ్రా పరిసరాల్లో ప్రవహించే యమునానదిలో ఇది తరచూ కనిపిస్తుంది. గతంలో ఐరోపా దేశాల్లోని నదుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఫాస్పేట్‌కు కారణమైన డిటర్జెంట్‌లను ఆ దేశాలు నిషేధించాయి. ప్రపంచంలోని అత్యంత కలుషిత నదుల్లో గంగా నది కూడా ఒకటి. మిగతావి... ఇటలీలోని శార్నో, ఇండొనేసియాలోని సిటారం, న్యూజెర్సీలోని పసిఫిక్‌, అర్జెంటీనాలోని మటజా నదులు. శుద్ధి చేయని వ్యర్థాలే ఈ నదులన్నింటికీ శాపమయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో చాలా నదుల్లో కాలుష్య స్థాయులు తగ్గినట్లు సీపీసీబీ గత ఏడాది (2020) సెప్టెంబరులో జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. సుమారు 19 నదుల్లో నీటి శాంపిళ్లను పరిశీలిస్తే అయిదు మినహా మిగతా నదుల్లో కాలుష్యం కొంతమేర తగ్గినట్లు వెల్లడయింది. అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని నిపుణుల అభిప్రాయం. జల కాలుష్య కట్టడికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి. జలవనరుల్లో స్నానాలు చేయడం, దుస్తులు ఉతకడం, పశువులను, వాహనాలను కడగడం వంటి చర్యల్ని నిషేధించాలి. శుద్ధి చేయని పారిశ్రామిక, మానవ వ్యర్థాలు నదీజలాల్లో చేరకుండా కఠిన ఆంక్షలు విధిస్తేనే నదులు, ఇతర జలవనరుల పునరుజ్జీవం సాధ్యమవుతుంది!

- వెన్నెల
 

Posted Date: 19-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం