• facebook
  • whatsapp
  • telegram

సమన్వయంతోనే లక్ష్యసాధన

హరిత ప్రపంచం దిశగా అడుగులు

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరుగుతోంది. వాతావరణంలో కొత్తగా ఉద్గారాలు పెరగకుండా ఉండే తటస్థ స్థాయి (నెట్‌ జీరో)ని సాధించేందుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయి. ఆసియా దిగ్గజాలుగా పేరొందిన చైనా, జపాన్‌, రిపబ్లికన్‌ ఆఫ్‌ కొరియా వంటి దేశాలు 2050-60 నాటికి ఉద్గారాలను తటస్థ స్థాయికి చేరుస్తామని ప్రతినబూనాయి. మరోవైపు- భారత్‌ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రోత్సాహమిస్తూ ముందడుగు వేస్తోంది. 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 నాటి పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా అడుగులు వేయడంలో- జీ20 దేశాల్లో భారత్‌ ముందుంది. భారత్‌కు తగినంత పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయని, దీనిద్వారా 2050 నాటికి ఆరువేల టెరావాట్‌అవర్‌ (టీడబ్ల్యూహెచ్‌) శక్తిని కర్బన రహితంగా అందించగలదని ఇంధన పంపిణీ సంఘం (ఈటీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. విద్యుత్తు వినియోగదారులపై ఏ మాత్రం భారం మోపకుండా ఆర్థిక ప్రగతి సాధించవచ్చని, సౌర, పవన విద్యుత్తులు ఇందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. 2019లో గ్రిడ్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తిలో సౌర పవన విద్యుత్తుల వాటా ఎనిమిది శాతం. నూక్లియర్‌, హైడ్రో, బయోమాస్‌ తదితరాలతో కలిపి దీని వాటా 25శాతం. 2030 నాటికి ఇది 32 శాతానికి చేరుతుందని ఈటీసీ పేర్కొంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి తప్పితే, కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు చేయకుండానే విద్యుత్తు లక్ష్యాలను సాధించాలని భారత్‌ యోచిస్తోంది.

శరవేగంగా మార్పులు

ప్రస్తుతం ఒక్కశాతంగా ఉన్న విద్యుత్తు వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30 శాతానికి పెంచాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు, వినియోగదారులకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పెద్ద సంఖ్యలో ఛార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తోంది. విద్యుత్తు వాహనాల(ఈవీ)పై జీఎస్టీని అయిదు శాతానికి తగ్గించడం, ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్తు వాహనాల అమ్మకం ధరలో బ్యాటరీ ధరలను మినహాయించడం వంటి చర్యలను చేపట్టింది. భారత సౌర ఇంధన సంస్థ (ఎస్‌ఈసీఐ-సెకి) గ్రీన్‌ హైడ్రోజన్‌ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీపీసీ సైతం హరిత ఇంధన సెల్‌ సాంకేతికతపై నిధులు వెచ్చించాలని, హైడ్రోజన్‌ పరిజ్ఞానంతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. రవాణా రంగం కూడా కర్బనాల్ని తగ్గించుకునే దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి రైల్వే సైతం నెట్‌జీరో కర్బన ఉద్గారాలతో ‘హరిత రైల్వే’గా రూపాంతరం చెందాలని ప్రయత్నిస్తోంది. విద్యుదీకరణ, జీవమరుగుదొడ్ల ఏర్పాటు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి చర్యలను రైల్వేశాఖ చేపట్టింది. బ్రాడ్‌గేజ్‌లో 63 శాతం అంటే 40వేల కి.మీ.కు పైగా విద్యుదీకరణ పనుల్ని పూర్తిచేసింది. అదే సమయంలో సౌర విద్యుత్తు వినియోగంలో భాగంగా రైల్వేస్టేషన్లు, ఇతర భవనాలపై 100 ఎండబ్ల్యూపీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌ సంస్థలూ ‘నెట్‌జీరో’కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్‌లో అత్యధిక బొగ్గు ఉత్పత్తిదారయిన కోల్‌ఇండియా 2023-24 నాటికి మూడువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నెట్‌జీరో కర్బన సంస్థగా రూపాంతరం చెందడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా, రిలయన్స్‌, అదానీలతో సహా ప్రధానంగా 24 అతి పెద్ద కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కర్బన రహిత ప్రణాళికల అమలుకు సిద్ధమవుతామని ప్రకటించాయి.

సమన్వయమే కీలకం

ఉద్గారాల విడుదలపై ఐరాస పర్యావరణ కార్యక్రమం 2020 నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 51శాతం గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలకు కారణమైన 126 దేశాలు నెట్‌జీరో లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్‌, హ్యారిస్‌ల పర్యావరణ ప్రణాళిక అమలులోకి వస్తే- ఆ భాగస్వామ్యం 63 శాతానికి చేరుతుంది. ఐరోపాసంఘం, జపాన్‌, కొరియా దేశాలు 2050 నాటికి ఉద్గారాలను తటస్థ స్థాయికి చేరుస్తామని ప్రమాణం చేశాయి. 2020 అక్టోబర్‌లో ప్రపంచ ఉద్గారాల్లో నాలుగోవంతుకు కారణమైన చైనా 2030 నాటికి కార్బన్‌డయాక్సైడ్‌ విడుదలను నియంత్రిస్తామని, 2060 నాటికి కర్బన తటస్థతను సాధిస్తామని ప్రకటించడం పర్యావరణపరంగా ముందడుగే. తన లక్ష్యాల సాధన కోసం ఏమేం చేయదలచుకున్నదీ చైనా ప్రకటించలేదు. ప్రస్తుతం చైనా శిలాజ ఇంధనాలతో విద్యుత్తు ఉత్పత్తిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇందులో బొగ్గుదే కీలక పాత్ర. భారత్‌ విషయానికొస్తే- ఉద్గారాల తటస్థ స్థితిని సాధించేందుకు తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇందుకు పరిశోధన రంగంలో పెట్టుబడుల్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. కర్బనరహిత ఉత్పత్తికి సిద్ధమవుతామని ప్రకటించిన భారీ సంస్థలు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో అన్ని దేశాలూ సమన్వయంతో కలిసి కదిలితే తప్ప అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు.

- పార్థసారథి చిరువోలు
 

Posted Date: 23-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం