• facebook
  • whatsapp
  • telegram

ముంచుతున్న మంచు పలకలు

పర్యావరణానికి పెనుముప్పు

భారతదేశం సుమారు 22.5 కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా సమీపంలోని ఒక పెద్ద ద్వీపం. డెథీస్‌ (పురాతన తూర్పు, పడమర) మహా సముద్రం ద్వారా ఆసియా నుంచి అది వేరయింది. భూమి ఖండాలుగా విడిపోయే ప్రక్రియ 20కోట్ల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కాలక్రమేణా భారతదేశం ఉత్తరదిశగా ఆసియాలోకి చొచ్చుకువెళ్లడంతో ఖండాంతర పలకల మధ్య ఘర్షణ పెరిగి ఏర్పడిన హిమాలయాలు ఆ తరవాత సంవత్సరానికి ఒక సెంటీమీటరు చొప్పున ఎత్తు పెరగనారంభించాయి. అలా ఇప్పటివరకు ఆ పర్వతాలు సుమారు 8,849 మీటర్ల ఎత్తుకు చేరాయి.

విపత్తు నిర్వహణ వ్యవస్థ అవసరం

హిమాలయాల్లో భౌగోళిక పరిస్థితులు అంతటా ఒకేవిధంగా ఉండవు. పర్యావరణపరంగా హిమాలయాలు చాలా సున్నితమైనవి. పర్వతాల పైభాగంలో అప్పుడప్పుడూ తీవ్ర చలనాలు ఏర్పడతాయి. కిందిభాగాల్లో భూమి ఒత్తిడికి లోనై తరచూ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి. హిమాలయాలు పెరుగుతుండటం- భూమి సమతౌల్య స్థితిని పొందడానికి జరిగే ప్రయత్నమని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటారు. టిబెట్‌ పీఠభూమితో పోలిస్తే భారత్‌ను ఆనుకుని ఉన్న హిమాలయాలు అత్యంత పెళుసుగా ఉంటాయి. పర్వత చరియలకు సులభంగా విరిగిపడే స్వభావం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో నిరంతరం జరుగుతున్న విభిన్న పర్యావరణ మార్పులకు సంబంధించిన పలు అంశాలు అర్థం చేసుకోవడానికి, విపత్తులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకునేందుకు అనువైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం ఆ ప్రాంతాల్లోని మార్పులపై ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, విశ్లేషణ అవసరం. పర్యావరణ సంరక్షణ నియమాలు పాటించకుండా వాతావరణంలోకి విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికర వాయువులతో హిమాలయాల ఉపరితల ప్రాంతమంతా కంపిస్తోంది. ఆ ఉద్గారాలతో ఉత్పన్నమవుతున్న వేడికి మంచు నిలువెల్లా కరిగిపోతోంది. తద్వారా హిమాలయాల్లోని హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. అంటే... మంచు రూపంలో ఉన్న మంచినీటి నిల్వలు తరిగిపోతున్నాయని అర్థం. ఈ మార్పులు జల విలయాలకు కారణమవుతున్నాయి.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయానికి కారణాల్లో భూతాపం ప్రధానమైనది. వాతావరణ మార్పులపై ప్యారిస్‌ అంతర్జాతీయ ఒప్పందం (2015) ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 2100 నాటికల్లా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనేది ప్రధాన లక్ష్యం. పారిశ్రామికీకరణకు పూర్వం (1880-1900) ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 13.73 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేది. అయితే, ఖాట్‌మాంఢూ(నేపాల్‌)లోని అంతర్జాతీయ సమగ్ర పర్వత అభివృద్ధి సంస్థ (2019) నివేదిక 20వ శతాబ్దం ప్రారంభం నుంచే హిమాలయ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత దాదాపు రెండు డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీలకే కట్టడి చేసినా- అఫ్గానిస్థాన్‌ నుంచి మయన్మార్‌ వరకు మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ఉన్న హిందూకుష్‌ ప్రాంతాల్లో దానికంటే 0.3 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. వాయవ్య హిమాలయ ప్రాంతమైన- చైనా, భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మొత్తం 500 కిలోమీటర్ల మేర ఉన్న కారకోరం వద్ద ప్రపంచ సగటు కంటే 0.7 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలమేర పెరిగితే 2100 నాటికి హిమాలయాల్లోని హిమానీనదాలు సగానికి పైగా కరిగిపోగలవని ఆ సంస్థ వెల్లడించింది. ఇదే జరిగితే సముద్ర తీరప్రాంతాలకూ ముప్పు తప్పదు. ఉత్తరాఖండ్‌లో జరిగిన జల విషాదానికి హిమానీనదం కరగడమే కారణం కావచ్చని అంచనా. హిమానీ నదాల్లో ఉండే మంచు గడ్డల లోపలి భాగాల్లో నీరు ప్రవహిస్తుంది. వాతావరణం వేడెక్కడంవల్ల ఎక్కువగా మంచు కరిగి నీటి ఒత్తిడి ఎక్కువవుతుంది. దాన్ని తట్టుకునేందుకు భారీ స్థాయిలో ఉండే మంచు ఫలకాలు పగులుతాయి. అప్పుడు లోపలినుంచి నీరు ఒక్కసారి ఉద్ధృతంగా  బయటకు వస్తుంది. అదే ఈ విపత్తుకు మూలకారణమై ఉంటుందని నిపుణుల అంచనా.

అడవుల సంరక్షణే పరిష్కారం

ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలప్రళయంలో రైనీ అనే గ్రామానికి సమీపంలో కొత్తగా ఒక సరస్సు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అది దాదాపు 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల లోతుతో ఉంది. అక్కడ నీటిమట్టం క్రమంగా పెరిగితే మరో జల విపత్తుకూ దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎంతో సున్నితమైన, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా మానవుల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. హిమాలయ ప్రాంతాల్లో చెక్కలను, రాళ్లను ఉపయోగించి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇవి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతాయి. అదేవిధంగా జల విద్యుదుత్పత్తి నిర్మాణాలూ అక్కడ శ్రేయస్కరం కాదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి కశ్మీర్‌ వరకు ఉన్న హిమాలయ నదీ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు సైతం ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయన్నది నిపుణుల అంచనా. వాతావరణంలో పారిశ్రామిక, వాహన కాలుష్యాలను అరికట్టే చర్యలను ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. సౌర, పవన విద్యుదుత్పత్తిపై దృష్టి పెట్టాలి. అడవుల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలి. మరోవైపు అడవులను నాశనం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలి. అప్పుడే ఉద్గారాల తీవ్రతను అదుపులో ఉంచగలం. పచ్చదనాన్ని పెంచడంద్వారా మున్ముందు విపత్తులకు ఆస్కారం తగ్గుతుంది.

అపారమైన నీటి నిల్వలు

హిమాలయ పర్వతాలు మొత్తం 2,400 కిలోమీటర్ల మేర భారత్‌, పాకిస్థాన్‌, చైనా, భూటాన్‌, నేపాల్‌ దేశాల్లో విస్తరించాయి. ఈ పర్వతాల్లో సుమారు 15 వేల హిమానీనదాలు ఉన్నాయి. అవి 12వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచినీటి నిల్వలు కలిగి ఉన్నాయి. అందులో గంగోత్రి, యమునోత్రి (ఉత్తరాఖండ్‌), ఖుంబు (ఎవరెస్టు శిఖర ప్రాంతం), లాంగ్‌టంగ్‌, జీము (సిక్కిం) ముఖ్యమైనవి. హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తున్న మొత్తం 24 కోట్ల మందికి ఇవి ప్రాణాధారం. గంగ, బ్రహ్మపుత్ర, మోకాంగ్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో సుమారు 16.5 కోట్ల మంది నివసిస్తున్నారు.

Posted Date: 19-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం