• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణహిత ప్రయాణం

ఈ-వాహనాలకు కావాలి ప్రభుత్వ అండాదండా

నగర భారతంలో వాయు కాలుష్యం మృత్యఘంటికలు మోగిస్తోంది. హైదరాబాదుతో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఒక్క 2020లోనే 1.2 లక్షల మందిని ఇది పొట్టనపెట్టుకున్నట్టు ‘గ్రీన్‌పీస్‌’ సంస్థ నివేదించింది. వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాల్లో 66శాతానికి డీజిల్‌ వాహనాలదే బాధ్యతని గతంలో ఓ అధ్యయనంలో తేలింది. ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాలను (ఈవీ) వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. కిందటి నెలలో ‘గో ఎలెక్ట్రిక్‌’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ ‘శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి ఏడాదికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. విద్యుత్తు వాహనాల వాడకం పెరిగితే దేశం మీద ఈ భారం తగ్గడంతో పాటు పర్యావరణానికీ మంచిది’ అన్నారు. భారత్‌లో శిలాజ ఇంధనాల వినియోగం ఇలాగే కొనసాగితే 2040నాటికి వాటి దిగుమతి వ్యయం మరో మూడు రెట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో ఈవీలకు ప్రాచుర్యం పెంచడం అత్యవసరం.

దశమార్చే ‘ఫేమ్‌’

విద్యుత్తు వాహనాల తయారీ, కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం 2011లో ‘భారత్‌లో విద్యుత్తు వాహనాల తయారీ, త్వరితగత స్వీకారం’ (ఫేమ్‌) పథకానికి రూపకల్పన చేసింది. దీని మొదటి దశలో 2.8 లక్షల వాహనాలకు రూ.359 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి ‘ఫేమ్‌’ రెండో దశ అమలులోకి వచ్చింది. దీనికి రూ.10 వేల కోట్లను కేటాయించారు. వీటిలో 86 శాతం నిధులను దేశంలో ఈవీల గిరాకీ పెంచడానికి వెచ్చిస్తున్నారు. ‘ఫేమ్‌’ రెండో దశ పూర్తయ్యేసరికి విద్యుత్తుతో నడిచే ఏడు వేల బస్సులు, 55 వేల కార్లు, అయిదు లక్షల త్రిచక్ర, పది లక్షల ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈవీల మీద జీఎస్టీని 12శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించారు. ఈ-వాహనాల ఛార్జర్లు, ఛార్జింగ్‌ స్టేషన్ల మీదా జీఎస్టీని 18శాతం నుంచి అయిదు శాతానికి పరిమితం చేశారు. ప్రభుత్వ ప్రయత్నాలతో ఈవీల అమ్మకాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. 2017-18లో 69 వేల విద్యుత్తు వాహనాలు అమ్ముడైతే, 2019-20 నాటికి వాటి సంఖ్య 1.67 లక్షలకు పెరిగింది. మొత్తమ్మీద 2017-20 మధ్యలో దేశవ్యాప్తంగా 3.79 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. అయితే, దేశంలో ఏటా జరిగే వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా ఒక శాతం కంటే తక్కువే! రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది అయిదు శాతానికి పైగా పెరిగే అవకాశముందని భారతీయ విద్యుత్తు వాహనాల తయారీదారుల సంఘం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ వేదిక క్లీన్‌ ఎనర్జీ మినిస్టీరియల్‌ (సీఈఎం) ‘ఈవీ30జీ30’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీఈఎం సభ్య దేశాల్లో 2030నాటికి ఏటా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీలు 30 శాతం ఉండాలన్నది దీని ఉద్దేశం. సీఈఎంలో సభ్యదేశంగా భారత్‌ సైతం ఈ లక్ష్యాన్ని స్వీకరించింది.

రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రత్యేక విధానాల ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో సహా 14రాష్ట్రాలు ఈవీ విధానాలను ప్రకటించాయి. ఈవీల తయారీ, ఛార్జింగ్‌ సదుపాయాల రంగంలో 2030 నాటికి నాలుగు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ‘తెలంగాణ ఈవీ, ఇంధన నిల్వ విధానం 2020-30’ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో అమ్ముడై రిజిస్ట్రేషన్‌ జరుపుకొనే మొదటి రెండు లక్షల విద్యుత్తు ద్విచక్ర, 20 వేల త్రిచక్ర వాహనాలు, అయిదు వేల ట్యాక్సీలు, టూరిస్టు క్యాబ్‌లు, పది వేల త్రిచక్ర సరకు వాహనాలు, అయిదు వేల కార్లు, అయిదు వందల బస్సులకు రహదారి సుంకం, రిజిస్ట్రేషన్‌ రుసుములనూ పూర్తిగా మినహాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ ఈవీల రంగంలో 2030నాటికి రూ.30వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలనుకుంటోంది. ఆర్టీసీ బస్సులను 2029 నాటికి పూర్తి ఈవీలుగా మార్చుతామని ఏపీ ఈవీ విధానం- 2018 ప్రకటించింది. నిరుడు డిసెంబరులో నీతిఆయోగ్‌ నిర్వహించిన సమావేశంలోనూ ఆంధ్ర అధికారులు దీన్ని పునరుద్ఘాటించారు.  

మౌలిక సదుపాయాలు ముఖ్యం

సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీలు ప్రియమైనవి. వీటి నిర్వహణ వ్యయం తక్కువ, పర్యావరణహితకరమైనవి. కొనుగోలు ధర ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు అక్కరకొస్తున్నాయి. ఛార్జింగ్‌ కేంద్రాలు ఎక్కువగా లేకపోవడంతో ఈవీల పట్ల ఆసక్తి ఉన్నవారూ కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. ఈ-వాహనాల ఛార్జింగ్‌ కోసం విద్యుత్తు అమ్మకాన్ని ‘సేవ’ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. ఈ నిర్ణయంతో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటు ఊపందుకుంటుందని అంచనా. తెలంగాణలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈవీల వినియోగాన్ని పెంచడానికి మొదటి దశలో నాలుగు వందల ఛార్జింగ్‌ కేంద్రాలను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే విద్యుత్తు వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయి. 

- సత్యభారతి
 

Posted Date: 20-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం