• facebook
  • whatsapp
  • telegram

సాగర గర్భంలో ఖనిజాన్వేషణ

వెలికితీత పర్యావరణానికి హానికరం

సముద్రం అపార జలనిధి మాత్రమే కాదు, అనంత ప్రాణికోటికి జీవనాధారం. అంతులేని జలరాశిలో ఉండే మత్స్యజాతులు, ముత్యపు చిప్పలు, పగడాల దిబ్బల ప్రత్యేకతల గురించి మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాం. ఇవి మాత్రమే కాకుండా, సముద్ర గర్భంలో లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలూ ఉన్నాయి. సల్ఫైడ్లు, ఫెర్రోమాంగనీస్‌, పాలీమెటాలిక్‌ ముద్దలు... వంటివెన్నో సముద్ర అంతర్భాగాల్లో ఉంటాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్వహించిన హెచ్‌ఎంఎస్‌ ఛాలెంజర్‌ ఎక్స్‌పెడిషన్‌ (1872-1876) ఫలితంగా ఆధునిక సముద్రశాస్త్ర తీరుతెన్నులే మారిపోయాయి. పసిఫిక్‌     సముద్రంలో మెక్సికో, హవాయి మధ్య సముద్రానికి నాలుగు నుంచి ఆరు వేల మీటర్ల లోతున దాదాపు బంగాళాదుంప పరిమాణంలో ఉండే ఖనిజాల ముద్దలు భారీయెత్తున ఉన్నాయి. వీటిని సేకరించగలిగితే అత్యున్నత నాణ్యతతో కూడిన నికెల్‌, కోబాల్ట్‌, మాంగనీస్‌, రాగి లాంటి అనేక ఖనిజాలు మన వశం అవుతాయని గుర్తించారు. 1970ల నుంచే వీటిపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతానికి ఈ రంగంలో వాణిజ్యపరమైన కార్యకలాపాలు అంతగా లేవు. అన్వేషణ, పరిశోధన, అభివృద్ధి... వంటి అంశాలకే పరిమితం అవుతున్నారు. భూమిని తవ్వి ఇలాంటి ఖనిజాలను వెలికి తీస్తే పర్యావరణానికి అపార నష్టం కలుగుతుందని, దానికితోడు భూస్వరూపం కూడా మారిపోతుందని, అందుకే సముద్ర గర్భంలోని ఖనిజాల గురించి అన్వేషణ మొదలైందని ఈ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బృందాలు చెబుతున్నాయి.

అధ్యయనాల పరంపర

సాగర సంపదలో దాదాపు 95 శాతందాకా సముద్ర గర్భంలోనే ఉంటుంది. జలగర్భంలో ఉన్న వనరులను వెలికితీసి, వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కేంద్ర మంత్రివర్గం కూడా ఇటీవలే పచ్చజెండా ఊపింది. దశలవారీగా అయిదేళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమానికి రూ.4,077 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో భాగంగా ముందుగా సముద్రంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తారు. సముద్ర గర్భంలో జీవవైవిధ్య అన్వేషణ, పరిరక్షణకు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాత హిందూ మహాసముద్రం, సముద్రం మధ్యలో ఉండే కొండల్లో లభించే ఖనిజ సంపదను అన్వేషిస్తారు. వీటితో పాటు సముద్రం నుంచి శక్తి, మంచినీరు పొందే అవకాశాలు, సముద్ర జీవశాస్త్రంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయడం లాంటి అంశాలపై ఈ కార్యక్రమం దృష్టిపెడుతుంది. అయితే, సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు మనకు అందుబాటులో లేవు. కొన్ని గుర్తింపు పొందిన సంస్థలు, ప్రైవేటు రంగం సహకారంతో వీటిని అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. సాధారణంగా ఇలాంటి సముద్ర గర్భ కార్యకలాపాలన్నింటినీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఇంటర్నేషనల్‌ సీబెడ్‌ అథారిటీ (ఐఎస్‌ఏ)’ పర్యవేక్షిస్తుంది. ఇప్పటిదాకా చైనా, జపాన్‌, రష్యా, బ్రిటన్‌, కొరియా, జర్మనీ, పోలాండ్‌, బెల్జియం తదితర దేశాలకు చెందిన కంపెనీలకు 18 కాంట్రాక్టులు దక్కాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలకే పరిమితమయ్యాయి. సముద్రగర్భ ఖనిజాన్వేషణ వల్ల లాభాలు భారీగా కనిపిస్తున్నా, పర్యావరణంపై పడే ప్రభావం విషయంలో చాలా ఆందోళనలు ఉన్నాయి. ఎంతోకొంత పర్యావరణ ప్రభావం పడకుండా ఈ లోహాలను వెలికితీయడం అసాధ్యమని కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి. ముందుగా పర్యావరణ ప్రభావాన్ని మదింపు వేసిన   తరవాతే, ఐఎస్‌ఏ అనుమతితో ముందుకు వెళ్తామని చెబుతున్నాయి. అయితే, సముద్రం అట్టడుగు భాగంలో ఉండే ‘సీఫ్లోర్‌’లో అపారమైన ఖనిజ సంపదతో పాటు అనేక వృక్ష, జంతు జాతులు ఉంటాయి.  సముద్రమట్టానికి 3,500-6,500 మీటర్ల దిగువన కొన్నిచోట్ల అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. వీటివల్లే సముద్ర జలాలు వేడెక్కుతాయి. ఇంత వేడితో పాటు సూర్యరశ్మి లేకపోవడం, బోలెడంత పీడనం ఉండటం లాంటివి ఉన్నా, ఆ తరహా వాతావరణంలో సైతం మనుగడ సాగించగలిగే జీవజాతులు బోలెడన్ని ఉన్నాయి.

జీవజాలంపై ప్రభావం

సాగర గర్భంలో అత్యంత క్లిష్టమైన వాతావరణాలను తట్టుకుంటూ జీవిస్తున్న వృక్ష, జంతు జాతులపై ఇప్పటి వరకూ పరిశోధనలు పెద్దగా సాగలేదు. కాబట్టి అక్కడ ఉండే జీవవైవిధ్యం గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. అందువల్ల సముద్ర గర్భంలో ఖనిజాన్వేషణ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అంచనా వేయడం అంత సులభం కాదు. అలాంటప్పుడు సముద్ర జీవాలకు, అక్కడి వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పర్యావరణవాదుల సందేహం. యంత్రాలతో ‘సీఫ్లోర్‌’ను తవ్వడం వల్ల అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోతాయి. సముద్ర గర్భంలో ఉండే చాలా జాతులు ఈ భూగ్రహంలో వేరెక్కడా ఉండవు. వాటి నివాస ప్రాంతాన్ని కదిలిస్తే, ఆ జీవుల్ని భవిష్యత్తులో చూడలేం. తవ్వకాలు జరిపేటప్పుడు కొన్ని వ్యర్థాలు వెలువడటం కూడా సహజమే. అలాగే యంత్రాల నుంచి వెలువడే కాలుష్యం సరేసరి. వీటన్నింటి వల్ల అక్కడి పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. స్వచ్ఛమైన నీళ్లలోనే ఉండే కొన్ని జీవజాతులకు ఇలాంటి కార్యకలాపాల వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుంది. తిమింగిలాలు, సొరచేపలు, ట్యూనా చేపల్లాంటివి- శబ్దకాలుష్యం, ప్రకంపనలు, కాంతికాలుష్యం, ఇంధన ఉత్పత్తుల లీకేజీ వంటి వాటిని తట్టుకోలేవు. ఒకవైపు సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికితీయాలంటునే, మరోవైపు పర్యావరణానికి హాని కలగకూడదని ఐఎస్‌ఏ చెబుతోంది. ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యమనేది పెద్ద ప్రశ్న. భూమిపై కాలుష్యాన్ని నివారించడానికి సముద్రంలో ఖనిజాలను వెలికి తీస్తామని చెబుతున్నా... దానివల్ల అక్కడ ఏర్పడే కాలుష్యం గురించి, అక్కడి జీవజాతులకు వాటిల్లే ముప్పు గురించి ఇంకా ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే... ఇప్పుడు భూమి అనుభవిస్తున్న దుస్థితినే రేపు సముద్రం కూడా అనుభవించాల్సి వస్తుందన్న సంగతి విస్మరించరానిది.

విలువైన సంపద

సముద్ర గర్భంలోంచి వెలికి తీయాలని భావిస్తున్న ఖనిజాలతో మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఉదాహరణకు పెట్రోలు, డీజిల్‌ కార్ల కంటే విద్యుత్‌ వాహనాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా లోహాలు వాడతారు. 75 కిలోవాట్ల బ్యాటరీ ఉండే ఒక్కో విద్యుత్‌ వాహనానికి 56 కిలోల నికెల్‌, 12 కిలోల మాంగనీస్‌, ఏడు కిలోల కోబాల్ట్‌, 85 కిలోల రాగి అవసరం అవుతాయి. దాదాపు వీటన్నింటినీ భూమి లోపలి నుంచే తీస్తున్నారు. ఈ  నిల్వలు క్రమంగా కరిగిపోయేవే. వీటిని తవ్వితీసే క్రమంలో కాలుష్యం కూడా వెలువడుతుంది. అందుకే ఈ విలువైన సంపదను సముద్ర గర్భం నుంచి వెలికి తీయాలని భావిస్తున్నారు.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ
 

Posted Date: 29-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం