• facebook
  • whatsapp
  • telegram

హిమగిరులకు పెనుముప్పు!

చార్‌ధామ్‌ రైల్వే ప్రాజెక్టుపై ఆందోళనలు

హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో చేపట్టిన చార్‌ధామ్‌ రైల్వే ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత పర్వత ప్రాంతాల్లో చేపట్టిన తొలి అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుగా దీన్ని పేర్కొంటున్నారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ గఢ్వాల్‌ ప్రాంతంలో రైల్వే లైను నిర్మిస్తున్నారు. గఢ్వాల్‌ ప్రాంతం పర్వతాలతో నిండి ఉంటుంది. హిందువులు ఏటా పెద్ద సంఖ్యలో దర్శించే నాలుగు తీర్థాలను కలుపుతూ రైల్వే లైను నిర్మించాలని 2014లోనే కేంద్రం తలపెట్టింది. 327 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైనులో 61 సొరంగాలు, 59 వంతెనలు, 21 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. 2024 నాటికి దీన్ని పూర్తి చేసేలా రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ వేగంగా పనులు చేపడుతోంది. గఢ్వాల్‌ ప్రాంతంలో రిషీకేశ్‌- కర్ణప్రయాగ్‌ల మధ్య మీటర్‌ గేజ్‌ రైల్వే లైను నిర్మాణానికి 1925లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. గఢ్వాల్‌ కొండలు చాలా పెళుసైనవని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావించినందువల్ల ఈ ప్రాజెక్టును అప్పట్లో తిరస్కరించినట్లు చెబుతారు. అదే సమయంలో ఇతర పర్వత ప్రాంతాలైన డార్జిలింగ్‌, సిమ్లా, ఊటీల్లో మీటర్‌ గేజ్‌ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. చార్‌ధామ్‌ రైల్వే ప్రాజెక్టు కోసం 2014-15లో రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ గఢ్వాల్‌ ప్రాంతంలో ప్రాథమిక సర్వే నిర్వహించి, 2015లో నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు క్షేత్రాలను తేలిగ్గా దర్శించుకోవడంతో పాటు ఎత్తయిన ప్రాంతాల్లోని అడవులు, లోయలగుండా రైలు ప్రయాణం యాత్రికులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది.

వెనకబడిన తమ ప్రాంతంలో ఈ రైల్వే ప్రాజెక్టు వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఉత్తరాఖండ్‌లో కొందరు దీన్ని ఆహ్వానిస్తుంటే, మరి కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరంతరం రైళ్ల రాకపోకల వల్ల అసలే పెళుసుగా ఉండే గఢ్వాల్‌ కొండలు మరింత బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కుంభవృష్టి వల్ల గఢ్వాల్‌లో కొండ చరియలు తరచూ విరిగిపడుతుంటాయి. ఈ క్రమంలో గతంలో బురద ముంచెత్తి గ్రామాలకు గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఆకాశానికి చిల్లులు పడినట్లు 2013 జూన్‌లో కురిసిన వర్షానికి చమోలీ జిల్లా కేదార్‌నాథ్‌లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా, వందల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఎందరో నిరాశ్రయులుగా మిగిలారు. 1970 జులైలో ఇదే జిల్లా రుద్రప్రయాగ్‌లో కురిసిన జడి వానా తీవ్ర ఆవేదన మిగిలించింది. మరోవైపు గఢ్వాల్‌ ప్రాంతం భూకంపాలకూ నెలవే. ఇది దేశ సీస్మిక్‌ మ్యాప్‌లోని నాలుగో జోన్‌లో ఉంది. 1902-1999 మధ్య ఈ ప్రాంతంలో పెద్ద, చిన్న స్థాయి    భూకంపాలు చాలానే సంభవించాయి. 1991, 99ల్లో వచ్చిన రెండు తీవ్ర భూకంపాలు పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు, భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. 1991 అక్టోబర్‌ భూకంపం ఒక్కటే దాదాపు పదిహేను వందల మందిని కబళించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆరేళ్లలోనే రిక్టర్‌ స్కేలుపై 4 నుంచి 5.1 తీవ్రతతో పదుల సంఖ్యలో చిన్న భూకంపాలు ఇక్కడ సంభవించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి పరంపర కొనసాగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

చార్‌ధామ్‌ రైల్వే ప్రాజెక్టు వల్ల గఢ్వాల్‌ ప్రాంతంలో అడవులు, వన్యప్రాణి ఆవాసాలూ ప్రభావితమయ్యాయని మరి కొందరు తమ వాణి వినిపిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఎన్నో వన్యప్రాణులు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్‌) అంతరించే జాబితాలో ఉన్నాయి. దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి మనుషుల రాకపోకలు పెరిగితే ఇక్కడి వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని, స్థానికుల సాంఘిక జీవనం మీదా ప్రభావం పడుతుందని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా జల విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం జరిపిన పేలుళ్లు గఢ్వాల్‌ కొండలను తీవ్రంగా దెబ్బతీశాయని శాస్త్రవ్తేతలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో 45 హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు పనిచేస్తుండగా, మరో 199కి పైగా ప్రతిపాదనలో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం రాబోయే కాలంలో మరిన్ని పేలుళ్లు జరపవలసి ఉంటుంది. ఆనకట్టల నిర్మాణం కోసం ఇక్కడి నదీ లోయల్లో జరిపే పేలుళ్లూ గఢ్వాల్‌ కొండల పటిష్ఠతను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి    అభివృద్ధి పేరుతో చేపడుతున్న పనుల వల్ల సున్నితమైన గఢ్వాల్‌ ప్రాంతంలో మేలు కంటే నష్టమే ఎక్కువని ఆలోచనాపరులు ఆందోళన వ్యక్తీకరిస్తున్నారు.

- ఆర్‌.పి.నైల్వాల్‌

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)
 

Posted Date: 21-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం