• facebook
  • whatsapp
  • telegram

ప్రజాభద్రతకు బీటలు

ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న విపత్తులు

ఉత్తరాఖండ్‌లో భూకంపాల ముప్పు అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఏ సమయంలోనైనా భారీ స్థాయి భూప్రకంపనలు సంభవించే ప్రమాదం ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇదే జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం కనీవినీ ఎరగని రీతిలో ఉంటుందని తేల్చేశారు. అయినప్పటికీ దీర్ఘకాల విపత్తు నిర్వహణ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భూకంప తీవ్రత ఆధారంగా దేశాన్ని అయిదు జోన్లుగా విభజించారు. ప్రకంపనలు అత్యంత తీవ్రంగా ఉండే అయిదో జోన్‌లో ఉత్తరాఖండ్‌ ఉంది. సన్నద్ధతలో మాత్రం రాష్ట్రం వెనకబడింది. సమస్యను ఎదుర్కొనేందుకు సరైన వ్యవస్థ లేదు. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెలలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం- తొలిసారిగా రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయంలో భూకంప సూచన వ్యవస్థను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో భారీస్థాయి భూకంపం సంభవించే ప్రమాదం ఉందని దెహ్రాదూన్‌లోని ‘వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ’ శాస్త్రవేత్తలతో పాటు అనేకమంది నిపుణులు చేసిన హెచ్చరికలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. రిక్టర్‌ స్కేల్‌పై 7, అంతకుమించిన తీవ్రతతో భూప్రకంపనలు సంభవిస్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని హిమాలయ పర్యావరణ అధ్యయన పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకులైన పద్మవిభూషణ్‌ గ్రహీత డాక్టర్‌ అనిల్‌ జోషీ అంటున్నారు. తాజాగా హైతీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.2గా నమోదయింది. ఈ విపత్తులో సుమారు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. గంగ, యమున లోయల్లో ఏర్పాటు చేసిన సీస్మోగ్రాఫ్‌ల ద్వారా నియో-టెక్టానిక్‌ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

ఉత్తరాఖండ్‌లో గడిచిన రెండు శతాబ్దాలుగా ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 1991 అక్టోబర్‌లో తెహ్రీ, ఉత్తరకాశి, రుద్రప్రయాగలో సంభవించిన భూకంపం ఎంతోమంది బతుకులను చిదిమేసింది. తెహ్రీలోనే 1,500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయినా గత అనుభవాల నుంచి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవడంలో విఫలంకావడం బాధాకరం. వరస భూకంపాలు కుదిపేస్తున్నా, నాటి అవిభక్త ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సమస్యను పట్టించుకోలేదు. మధ్య హిమాలయ ప్రాంతంలో సాంకేతిక సర్వే చేపట్టాలని, సమస్య పరిష్కారానికి దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించాలని చాలా ఏళ్ల క్రితమే కేంద్ర  ప్రభుత్వం ఆదేశించినా కార్యరూపం దాల్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఉత్తరాఖండ్‌ ఆవిర్భావం తరవాతా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. భూకంప ఉపశమన ప్రణాళికలు లేకపోవడంతోపాటు బాధితులను ఆదుకునే ప్రయత్నాలూ జరగలేదు. ఏళ్లు గడిచినా పునరావాసం కోసం భూకంప బాధితులు ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో పునరావాస ప్రణాళికలపై చర్చలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. రాజకీయ హామీలు మొదలయ్యాయి.

రాష్ట్రంలో భూకంపాలు మాత్రమే కాకుండా- ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 2013 నాటి కేదార్‌నాథ్‌ జల ప్రళయాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోలేదు. నాటి వరదల్లో 5,700 మంది విగతజీవులైనట్లు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. నాటి ఘటన నుంచి కోలుకొనేందుకు ఉత్తరాఖండ్‌ వాసులు చేస్తున్న యత్నాలకు ప్రకృతి అడ్డుతగులుతూనే ఉంది. వరస విపత్తులతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన ఛమోలీ జిల్లాలో సంభవించిన జల విలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆకస్మిక వరదల కారణంగా 70 మందికిపైగా ప్రజలు మృతి చెందారు. పర్వత ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడి రిషిగంగ, ధౌళిగంగ, అలకనంద నదుల్లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైనీ గ్రామం తపోవనం సమీపంలోని విద్యుత్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు కూడా దెబ్బతింది. అందులోని కార్మికులూ ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలకు గఢ్వాల్‌ ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం కూడా ఓ కారణమని తెలుస్తోంది. దీనివల్ల సుమారు 1,400 కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. వీటన్నింటికి తోడు ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో కార్చిచ్చుతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది. వన్యప్రాణులకూ ముప్పు తప్పడం లేదు. ఇప్పటికే ఎన్నో జంతువులు అంతరించిపోయాయి.   ఉత్తరాఖండ్‌ దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గుర్తించాలి. పరిస్థితి చేయి దాటకముందే సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. అత్యంత సున్నిత ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలి

 

- ఆర్‌.పి.నైల్వాల్‌ 

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)
 

Posted Date: 17-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం