• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ స్పృహే పుడమికి రక్ష

మేలుకొనకపోతే తీవ్ర దుష్పరిణామాలు

‘గత వందేళ్ల కాలంలో మానవ చర్యల వల్ల ప్రకృతికి పూడ్చలేని నష్టం జరిగింది. ప్రపంచ దేశాలు, పర్యావరణ సంస్థలు అంచనా వేసినదానికంటే ఎక్కువగా పర్యావరణం దెబ్బతింది. భూతాపం, వాతావరణ మార్పుల నియంత్రణకు ఇప్పటికైనా పటిష్ఠమైన చర్యలు తీసుకోకపోతే మొత్తం మానవాళి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వచ్చే శతాబ్దాల్లో మనిషితో పాటు మరెన్నో జీవులు ఒక్కపెట్టున అంతరించే పరిస్థితులు సైతం దాపురించవచ్చు’- వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక ఇది. ఇటీవల విడుదలైన ఐపీసీసీ ఆరో మదింపు నివేదిక భూగోళానికి జరుగుతున్న నష్టాన్ని కూలంకషంగా వివరించింది. యూకేలోని గ్లాస్గోలో కాప్‌-26 సదస్సు కొనసాగుతున్న తరుణంలో, ఆ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సాగుకు ఇబ్బంది

ఐపీసీసీలో మూడు బృందాలు ఆరో మదింపు నివేదికను తయారు చేస్తున్నాయి. ఒక బృందం నివేదిక విడుదలయ్యింది. వచ్చే ఏడాది మిగిలిన రెండింటి పరిశీలనలతో కలిపి పూర్తి నివేదిక రానుంది. ఐపీసీసీలోని 195 సభ్య దేశాలు ఆరో నివేదికను ఆమోదించాయి. ఇందులో తొలిసారిగా ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థలపై లోతైన విశ్లేషణలు చేశారు. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు, కరవులు, తుపానులు, వేడిగాలులు, మంచు కొండలు కరిగిపోవడం, సముద్ర మట్టాల పెరుగుదల, ఎడారీకరణ వంటి అంశాలను క్షుణ్నంగా వివరించారు. ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇప్పటిదాకా అంచనా వేసిన గణాంకాలను ఈ నివేదిక పునస్సమీక్షించింది. ఐపీసీసీ అయిదో నివేదిక కాలంతో(2014) పోలిస్తే- ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగినట్లు ఆరో నివేదిక స్పష్టంచేసింది. భూతాపాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 2015లో పారిస్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలని, సాధ్యమైనంత వరకు వాటిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030-52 మధ్య ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల దాకా పెరగవచ్చని ఐపీసీసీ భూతాప ప్రత్యేక నివేదిక నాలుగేళ్ల క్రితం అంచనా వేసింది. వచ్చే రెండు దశాబ్దాల్లోనే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించిపోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక హెచ్చరించింది. నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు సైతం దాటే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణ తీవ్రత 1.5 డిగ్రీలకు పెరిగితే వేడి గాలులు అధికమవుతాయి. ఎండాకాలం పెరిగి, శీతాకాలం తగ్గుతుంది. ఇక రెండు డిగ్రీలు దాటితే, వేడిగాలులు పరిమితులు మించిపోతాయి. వ్యవసాయానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.

వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులకు మొదటగా ప్రభావితమయ్యేది వ్యవసాయ రంగమే. ఇప్పటికే కరవులు, తుపానులతో కునారిల్లుతున్న వ్యవసాయ రంగం- ఎడారీకరణ, హరిత గృహ వాయువులు, రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో మరింతగా నష్టపోతోంది. నేలకోత అధికమై భూములు నిస్సారంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అధికం కావడంవల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. అసాధారణ వాతావరణ మార్పులు, రుతుపవనాల అపసవ్యత కారణంగా తెగుళ్ల బెడద అధికమై కొత్త వైరస్‌లు, నూతన రోగాలు పుట్టుకొస్తున్నాయి. కాలంతోపాటు ప్రజల ఆహార అలవాట్లు మారడం, కొన్ని రకాల పంటలు, వంగడాలు కనుమరుగు కావడం, కొన్ని రకాల పంటలనే రైతులు పెద్దయెత్తున సాగుచేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తనున్నాయి. ఏటికేడు పెరుగుతున్న ఉత్పాదక ఖర్చులు, గిట్టుబాటుకాని ధరలకు తోడు పర్యావరణ మార్పులు జతపడి అన్నదాతలు మరిన్ని అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కఠిన నిర్ణయాలు అవసరం

రాబోయే దశాబ్దాల్లో వాతావరణ మార్పుల తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. దీనివల్ల అన్ని రంగాలూ ప్రభావితం కానున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతిఒక్కరూ బాధితులుగా నిలవనున్నారు. శిలాజ ఇంధనాల వినియోగం శ్రుతిమించడం, కర్బన ఉద్గారాల మోతాదు అధికం కావడమే దీనికి కారణం. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఏకమై పటిష్ఠ చర్యలు చేపట్టకపోతే మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుంది.శిలాజ ఇంధనాల్లో సింహభాగాన్ని వినియోగిస్తున్న చైనా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, యూకే, బ్రెజిల్‌, కెనడా, జర్మనీ, భారత్‌, ఇండొనేసియా, సౌదీ అరేబియా తదితర దేశాలు పునరుత్పాదక వనరులపై దృష్టి సారించాలి. హరిత గృహ వాయువులను కట్టడిచేసి పర్యావరణ హితకర పారిశ్రామిక, వ్యవసాయ విధానాలను అనుసరించవలసిన అవసరం ఉంది. కోపెన్‌హాగన్‌, క్యోటో, పారిస్‌ సహా ఇప్పటిదాకా జరిగిన అనేక ఒప్పందాలు ఆచరణలో సరిగ్గా సఫలం కాకపోవడం బాధాకరం. అగ్రరాజ్యాలు ఏవీ కర్బన ఉద్గారాల కట్టడిలో నిబద్ధతను చాటడంలేదు. కాప్‌-26 సదస్సు తరుణంలో కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయోనని మిగతా దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు పరిమితికంటే మించకుండా, శిలాజ ఇంధనాల వినియోగాన్ని భారీగా తగ్గించి వాటి స్థానంలో సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన శక్తిని పెంచాలి. నీరు, ప్లాస్టిక్‌ వినియోగం, నదులు, అడవుల సంరక్షణ, సాగులో రసాయన ఎరువుల వాడకం తదితరాల్లో భారత్‌ కఠిన నిర్ణయాలు అమలు చేయవలసి ఉంది. పౌరుల్లో సైతం పర్యావరణ స్పృహ పెరగాలి. మనిషి వేసే ప్రతి అడుగూ పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలి. సహజ సంపదను అవసరాల మేరకు సమతుల్యంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదే పుడమికి రక్షణ. ఈ దిశగా కాప్‌-26 నిర్ణయాలు ఉండాలని, ప్రతి దేశం బాధ్యతాయుతమైన ప్రణాళికలతో ముందుకు రావాలని ఆశిద్దాం.

భారత్‌పై ప్రభావం

శీతోష్ణస్థితుల్లో మార్పులు, భూతాపం ప్రభావం దక్షిణాసియా దేశాల్లో అధికంగా ఉంటుందని ఐపీసీసీ నివేదిక పేర్కొంది. భారత ఉపఖండంలో అధిక కరవులు, వర్షాలు సంభవించే ప్రమాదం ఉంది. అనూహ్య భారీ వర్షపాతాలు ఇరవై శాతందాకా పెరుగుతాయి. 7500 కి.మీ. పైబడిన తీర ప్రాంతం కలిగిన భారత్‌లో సముద్ర మట్టాలు పెరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. సముద్ర మట్టాలు 50 సెంటీమీటర్లు పెరిగితే ఆరు తీర నగరాలు తీవ్ర ముంపు సమస్యను ఎదుర్కొంటాయి. చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, సూరత్‌, విశాఖపట్నం నగరాల్లో నివసించే 2.86 కోట్ల మంది ప్రభావితులవుతారు. వాతావరణంలో అసాధారణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని పేదల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారతాయి. ఆహారం, నిరుద్యోగ సమస్యలు ముప్పిరిగొంటాయి.

- డాక్టర్‌ నక్కా సాయిభాస్కర్‌ రెడ్డి 

(పర్యావరణ నిపుణులు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శ్రీలంక తప్పిదాలు భారత్‌కు పాఠాలు

‣ టిబెటన్లను గుప్పిటపట్టే ఎత్తుగడ

Posted Date: 05-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం