• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపులు

దౌత్యవ్యూహంతో భారత్‌కు ప్రయోజనం

వాస్తవాధీన రేఖ వెంట భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) తీవ్ర యత్నాలు చేస్తోంది. ‘పోరాడకుండానే ప్రత్యర్థిని లొంగదీసుకోవడమే యుద్ధ కళ’ అని చైనా తొలితరం వ్యూహకర్త సన్‌-జూ చెప్పిన సూత్రాన్ని భారత్‌పై అమలు చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో సరిహద్దుల్లో తాటాకు చప్పుళ్ల మోతను పెంచింది. అదే సమయంలో లోపాలను వేగంగా సరిదిద్దుకొనే పనిని డ్రాగన్‌ మొదలుపెట్టింది. 2020 ఆగస్టు చివరి వారంలో భారత ప్రత్యేక దళాలకు చెందిన ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌-22’ పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో కీలక శిఖరాలను స్వాధీనం చేసుకుంది. వాటిని తురుఫుముక్కలా వాడుకుని ఆ సరస్సు వద్ద వివాదాస్పద ప్రదేశాల నుంచి డ్రాగన్‌ దళాలను వెనక్కి పంపింది. తొలుత చర్చలకే ఇష్టపడని చైనా- ఆ పరిస్థితిని అస్సలు ఊహించలేదు. ఆ ఘటనతో టిబెట్‌ వాసులకు పర్వత యుద్ధతంత్రంలో ఉన్న పట్టు దానికి తెలిసి వచ్చింది. దాంతో టిబెటన్లను సైన్యంలో చేర్చుకోవడం, అక్కడి చిన్నపిల్లల మనసులను చైనాకు అనుకూలంగా మార్చడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆధిపత్యానికి సవాలు

యుద్ధరంగంలో భౌగోళిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకోకపోతే ఎంత గొప్ప సైన్యమున్నా ఓటమి తప్పదు. ఆ విషయం గుర్తించిన డ్రాగన్‌ దేశం భారత్‌ నుంచి 1958లో స్వాధీనం చేసుకున్న ఖుర్నాక్‌ ఫోర్టు ప్రాంతాన్ని తన స్థానబలం పెంచుకోవడానికి వాడుకోవాలని నిర్ణయించింది. 134 కిలోమీటర్ల పొడవున్న పాంగాంగ్‌ సరస్సులో భారత్‌ వైపు ఉన్న భాగంలో ఉత్తర-దక్షిణ తీరాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. చైనా అధీనంలోని సరస్సుకు రెండు తీరాల మధ్య దూరం అంతగా ఉండదు. ఖుర్నాక్‌ సమీపంలో ఆ దూరం 500 మీటర్లే! అక్కడ గతేడాది సెప్టెంబరు చివరి వారంనుంచి డ్రాగన్‌ వంతెన నిర్మాణం ప్రారంభించినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. ఆ సరస్సు శీతాకాలంలో మంచు ఫలకంలా మారిపోతుంది. దాని నిర్మాణానికి చాలా ముందుగానే ప్రణాళిక సిద్ధమై, పనులు మొదలైనప్పటికీ భారత్‌ వేగంగా గ్రహించలేకపోయింది. ఆ వంతెన నిర్మాణంలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్‌, సిరిజాప్‌లలోని స్థావరాలనుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం కలుగుతుంది. వంతెన నిర్మాణంతో దళాల ప్రయాణ దూరం 180 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. కొత్త వంతెన నిర్మాణం ఆ ప్రాంతంలో చైనా రక్షణాత్మక వైఖరికి చిహ్నమే అయినప్పటికీ, భారత ఆధిపత్యానికి గండిపడే ప్రమాదం ఉంది. మరోవైపు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా 34 చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి చైనా తరఫున కవ్వింపు చర్యల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు గల్వాన్‌ ఘర్షణ చిత్రాలను భారత్‌ గోప్యంగా ఉంచితే, చైనా మాత్రం తనకు అనుకూలమైన చిత్రాలను మీడియా సంస్థలకు లీక్‌ చేస్తోంది. భారత సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతీయడానికే అటువంటి చర్యలకు పాల్పడుతోంది. ఇండియాలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు ఇటీవల డ్రాగన్‌ కొత్తపేర్లు సైతం పెట్టింది. 2017లో డోక్లాం వివాద సమయంలోనూ చైనా అలాగే చేసింది.

గ్రామాల నిర్మాణం

భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను 1959, 1962ల్లో చైనా ఆక్రమించింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. మరోవైపు కొత్తగా భూసరిహద్దు చట్టాన్ని జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చింది. అందులో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భూభాగాలను తనవిగా డ్రాగన్‌ పేర్కొంది. ఆ చట్టంలో సరిహద్దు వినియోగంపైనా ఎక్కువగానే దృష్టిపెట్టింది. వాటి రక్షణను ఆర్థిక, సామాజిక అభివృద్ధితో లంకెపెట్టింది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఖుర్నాక్‌ ఫోర్ట్‌ వద్ద, ఆక్రమిత అరుణాచల్‌ప్రదేశ్‌లో, వాస్తవాధీన రేఖ వెంట కట్టడాలు, గ్రామాల నిర్మాణాలు చేపట్టింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తే చైనాకు ఈ సరిహద్దు వివాదాన్ని ఇప్పట్లో ముగించే ఉద్దేశం లేదని స్పష్టమవుతుంది. డ్రాగన్‌ ఒక్క 2019లోనే వేల కోట్ల రూపాయలను రోడ్ల నిర్మాణానికి వెచ్చించింది. ఆ స్థాయిలో ఖర్చుచేసే వెసులుబాటు భారత్‌కు లేదన్నది వాస్తవం. ఆ క్రమంలో సైనిక మోహరింపులు, మౌలిక వసతుల కల్పన కొనసాగిస్తూ, దౌత్యవ్యూహాలపై భారత్‌ ఆధారపడితే సరైన ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా, సైనిక పరంగా చాలా చిన్నదేశమైన తైవాన్‌ను ఆక్రమించుకోవడం చైనాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, డ్రాగన్‌ ఆ పని చేయదు! అగ్రదేశాలతో తైవాన్‌కు ఉన్న దౌత్య సంబంధాలే అందుకు కారణం. భారత్‌ సైతం పశ్చిమ దేశాలతో రక్షణ, ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవాలి. భారత్‌పై దుస్సాహసానికి పాల్పడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అనే విషయం డ్రాగన్‌కు అర్థమయ్యేలా చేయాలి.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స

‣ ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 07-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం