• facebook
  • whatsapp
  • telegram

ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా కొలువుదీరడంతో దిల్లీ, లండన్‌ల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అంచనాలు పెరిగాయి. కీలక రంగాల్లో ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్ళే వీలుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సైతం త్వరితగతిన కార్యరూపం దాల్చాలన్న ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇటీవల బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో మోదీ, రిషి భేటీ అయ్యారు. ఈ తరుణంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యే దిశగా తొలి అడుగులు పడినట్లే కనిపిస్తున్నాయి. వారి సమావేశం ముగిసిన వెంటనే- మనదేశ యువతకు ప్రయోజనం చేకూర్చే కీలక వీసా పథకాన్ని బ్రిటన్‌ సర్కారు ప్రకటించింది. డిగ్రీ పూర్తిచేసిన భారతీయ విద్యార్థులు/నిపుణులు (18-30 ఏళ్ల మధ్య వయసున్నవారు) బ్రిటన్‌కు వచ్చి రెండేళ్లపాటు పని చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం కింద ఏటా మూడు వేలమంది భారతీయులు లబ్ధి పొందనున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం

బాలి నుంచి స్వదేశానికి చేరుకున్నాక- మోదీతో తన భేటీ వివరాలను రిషి సునాక్‌ పార్లమెంటు సభ్యులకు తెలియజేశారు. ఎఫ్‌టీఏతోపాటు ఇరు దేశాల మధ్య పౌరుల ప్రయాణాలను సులభతరం చేయడం(ఈ-వీసా), భద్రతారంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, నేరగాళ్ల అప్పగింత, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై దిల్లీ వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఇరు దేశాలు దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్న వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు ఇకపై ముమ్మరంగా సాగే అవకాశం ఉందని ఆయన ప్రకటన నేపథ్యంలో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత కారణంగా ఎఫ్‌టీఏపై చర్చలకు విఘాతం కలిగింది. దానికితోడు ఔషధ తయారీ, స్కాచ్‌ విస్కీ ఎగుమతుల విషయంలో లండన్‌ పెడుతున్న షరతులు దిల్లీకి రుచించడం లేదు. కొన్ని మందుల్ని భారతీయ జనరిక్‌ ఔషధ తయారీ సంస్థలు ఉత్పత్తి చేయకూడదంటూ బ్రిటన్‌ మెలిక పెడుతున్నట్లు సమాచారం. దానికి అంగీకరిస్తే- అనేక దేశాల్లో పేదల ప్రయోజనాలను దెబ్బతీసినట్లవుతుందని ఇండియా భావిస్తోంది. మద్యంపై పన్ను వ్యవహారం సైతం ఇంకా కొలిక్కిరాలేదు.

ప్రస్తుతం రిషి మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్న భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్‌ భారతీయ వలసదారులను ఉద్దేశించి- గడువు ముగిసినా వారు బ్రిటన్‌ను వీడి వెళ్ళడం లేదని విమర్శించారు. ఆమె వ్యాఖ్యలపై దిల్లీ దీటుగా స్పందించడంతో ఎఫ్‌టీఏ చర్చలపై అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రకటించిన వీసా పథకంతో భారతీయుల వలసలపై బ్రిటన్‌ ఓ మెట్టు దిగినట్లుగా భావించవచ్చు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభ ప్రభావం బ్రిటన్‌పై తీవ్రంగా ఉంది. జీవన వ్యయం బాగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ మహమ్మారి తాలూకు ప్రతికూల ప్రభావం, బ్రెగ్జిట్‌తో తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నుంచీ బ్రిటన్‌ ఇంకా తేరుకోలేదు. ద్రవ్యోల్బణం సైతం పెరిగింది. ఆర్థిక వృద్ధి మందగించింది. మరోవైపు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా దిల్లీ నిలుస్తోంది. ఇప్పటికే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్‌ను తోసిరాజని అయిదోస్థానానికి ఇండియా చేరుకుంది. భారత్‌లో మానవ వనరులూ పుష్కలం. ఈ తరుణంలో భారత్‌తో ఎఫ్‌టీఏ లండన్‌కు అత్యావశ్యకం. వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్‌ ఎగుమతులు పెరుగుతాయి. విపణి విస్తృతమవుతుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కుదుపులను తట్టుకొనేలా సరఫరా గొలుసులు పటిష్ఠమవుతాయి.

అమలుకు నోచుకోని హామీలు

దిల్లీ, లండన్‌ సంబంధాలను కేవలం వాణిజ్య కోణంలోనే చూడలేం. సాంస్కృతికంగా, చారిత్రకంగా భారత్‌తో బంధం విలువ తనకు స్పష్టంగా తెలుసని రిషి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు ఇండో-పసిఫిక్‌ ప్రస్తుతం కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో బ్రిటన్‌కు అతిపెద్ద భాగస్వామి దిల్లీయే. ఇండో-పసిఫిక్‌లో ఏం జరుగుతుందనే దానిపైనే రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ పురోగమనం ఆధారపడి ఉంటుందంటూ ఇటీవల రిషి చేసిన వ్యాఖ్యలు, ఇండియాతో సఖ్యతగా ఉండటం లండన్‌కు ఎంత అవసరమో చాటిచెబుతున్నాయి. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాల బలోపేతంపై దిల్లీ, లండన్‌ గతేడాది ‘2030 రోడ్‌మ్యాప్‌’ను రూపొందించుకున్నాయి. అది సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మోదీ, రిషిలపై ఉంది. భారత్‌కు రక్షణ సాంకేతికతల బదిలీని సులభతరం చేస్తామని, దిల్లీతో కలిసి సరికొత్త యుద్ధ విమానాల సాంకేతికత అభివృద్ధికి కృషిచేస్తామని గతంలో బ్రిటన్‌ ఇచ్చిన హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. వాటిపై ఇరు దేశాలు దృష్టిసారించాలి. సైబర్‌ భద్రత రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే దిల్లీ, లండన్‌లు భారీగా లాభపడతాయి. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి నేరగాళ్లను భారత్‌కు అప్పగించే ప్రక్రియ ముమ్మరమయ్యేలా చూడాల్సిన బాధ్యతా రిషి సర్కారుపై ఉంది.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

‣ ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

‣ మడ అడవులకు మరణ శాసనం

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం