• facebook
  • whatsapp
  • telegram

భారత్‌... ప్రపంచానికే అన్నపూర్ణ!

బియ్యం ఎగుమతుల్లో అగ్రగామి

ప్రపంచంలోనే అగ్రస్థాయి బియ్యం ఎగుమతిదారుగా థాయ్‌లాండ్‌కు 30 ఏళ్లుగా ఉన్న పేరును భారత్‌ 2012లోనే చెరిపేసింది. ఆ స్థానాన్ని తాను ఆక్రమించింది. ఆ తరవాత నుంచి రెండు, మూడో స్థానాలను వియత్నాం, థాయ్‌లాండ్‌ తరచూ పంచుకుంటూ వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా 2020-21 సీజనులో భారత్‌ నుంచి 70,000 టన్నుల నూకల దిగుమతికి వియత్నాం ఒప్పందం కుదుర్చుకొంది. అసలు 2016-17 నుంచే వియత్నాం నాసిరకం బియ్యాన్ని భారత్‌ నుంచి కొనుగోలు చేసి పశువుల దాణాకు, బీరు తయారీకీ ఉపయోగిస్తోంది. ఈ ఏడాది వియత్నాం నుంచి మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం దిగుమతి చేసుకునే చైనా మూడు దశాబ్దాల తరవాత మొదటిసారి 2020లో భారత బియ్యాన్ని కొనుగోలు చేసింది. 2021లో కూడా కొనుగోళ్లు కొనసాగించనుంది. చైనాకు లక్ష టన్నుల నూకల ఎగుమతికి ఒప్పందాలు కుదిరాయి. చైనా సాధారణంగా భారతీయ బియ్యం నాణ్యతకు వంకలు పెడుతూ పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ల నుంచి దిగుమతి చేసుకొంటూ ఉంటుంది. ఈ ఏడాది చైనాలో బియ్యానికి బాగా కొరత ఏర్పడటంతో మన బియ్యాన్ని కొనక తప్పలేదు. గత జులైలో యాంగ్ట్సే నదికి తీవ్రస్థాయి వరదలు రావడంతో చైనాలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తరవాత మిడతల దండు వచ్చిపడింది. మరోవైపు చైనాలో ఆహార వృథా ఎక్కువవుతూ వస్తోంది. ఇది చాలదన్నట్లు 3.7 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు పారిశ్రామికీకరణ, పట్టణీకరణపరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చైనా ఆహార భద్రత కోసం భారత్‌ నుంచి బియ్యాన్ని కొనక తప్పడం లేదు.

వరుణుడి కరుణ

ఇతర దేశాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలించినా భారత్‌లో విస్తారమైన వర్షాలు కురిసి వరి పంట విరగపండినందువల్ల, గత నవంబరు నాటికే 70 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయగలిగింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లోనూ కుండపోత వర్షాలు, వరదల వల్ల వరి పంట దెబ్బతిని బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్‌ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసి ధరల స్థిరీకరణకు తోడ్పడింది. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం జరిగిన ఎగుమతి. భారత్‌, సింగపూర్‌ల నుంచి మరో  రెండున్నర లక్షల టన్నుల బియ్యం కొనాలని నిర్ణయించిన బంగ్లా ప్రభుత్వం, బియ్యం దిగుమతులపై సుంకాన్ని 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. దీంతో బంగ్లాకు ఎగుమతులు పెంచడానికి భారతీయ సరఫరాదారులు సిద్ధమవుతున్నారు. 2020-21 సీజను ముగిసేసరికి భారత్‌ నుంచి మొత్తం బియ్యం ఎగుమతులు కోటి టన్నులకు చేరతాయని అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం (ఐరియా) అధ్యక్షుడు బి.కృష్ణారావు అంచనా. ఈ కోటి టన్నులూ సాధారణ బియ్యమే తప్ప బాస్మతి రకం కాదు. సీజను ముగిసేనాటికి బాస్మతి, సాధారణ బియ్యం ఎగుమతులు కలిసి మొత్తంకోటి 40 లక్షల టన్నులకు చేరవచ్చు. థాయ్‌లాండ్‌, వియత్నాంలకన్నా 10 శాతం తక్కువ ధరకే బాస్మతియేతర బియ్యాన్ని భారత్‌ సరఫరా చేస్తున్నందు వల్ల మన బియ్యానికి గిరాకీ పెరిగిందని కృష్ణారావు వివరించారు. థాయ్‌ కరెన్సీ విలువ పెరగడంతో ఆ దేశ బియ్యం ప్రియమైంది. అది చాలదన్నట్లు తీవ్ర అనావృష్టి వల్ల నిరుడు థాయ్‌ వరి పంట దెబ్బతిన్నది. గత ఏడాది 75 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన థాయ్‌లాండ్‌ ఈ ఏడాది 50 లక్షల టన్నులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌లో థాయ్‌లాండ్‌, వియత్నాం బియ్యం ఎగుమతులను నిలిపేయగా, భారత్‌ ఎగుమతులు కొనసాగించి నికరమైన సరఫరాదారుగా పేరుతెచ్చుకొంది. ఇది మరిన్ని ఎగుమతి ఆర్డర్లు రావడానికి తోడ్పడింది. మలేసియా, ఇండొనేసియాలూ ఈసారి థాయ్‌లాండ్‌ నుంచి కాకుండా భారత్‌ నుంచి బియ్యం కొంటున్నాయి. ఇలా తూర్పు ఆసియాతో పాటు గల్ఫ్‌, ఆఫ్రికా దేశాలకూ బియ్యం అందించడం ద్వారా భారత్‌ కొవిడ్‌ కాలంలో ప్రపంచ ఆహార భద్రతకు భరోసాదారుగా నిలిచింది. ప్రపంచ బియ్యం అవసరాలలో 32 శాతాన్ని భారత్‌ తీరుస్తోంది. కొవిడ్‌ కాలంలో ఆదాయాలు తరిగి, సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు పెరిగాయి. ఈ దేశాల్లోని  జనాభా అవసరాలను తీర్చే స్థాయిలో ఆహారోత్పత్తి అధికమవడం లేదు. భారత్‌ సరసమైన ధరలకు బియ్యం ఎగుమతి చేసి ఆఫ్రికాను ఆదుకొంటోంది. కంటైనర్ల కొరత లేకపోతే భారత్‌ మరింతగా బియ్యాన్ని ఎగుమతి చేసి ఉండేది. కంటైనర్లు దొరక్కపోవడంతో భారత రేవుల్లో రవాణా నౌకలు బియ్యం లోడు చేసుకోవడానికి నాలుగు వారాలపాటు వేచి ఉండాల్సి వస్తోంది.

అపార నిల్వలు

భారత్‌ ప్రస్తుతం ఆహార ధాన్యాల కొండ మీద కూర్చుని ఉంది. బియ్యం, గోధుమ బఫర్‌ నిల్వలు ఉండాల్సిన దానికన్నా మూడురెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎలుకలు తినివేయడం, మనుషులు దొంగిలించడం వల్ల లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోదాముల నుంచి తరిగిపోతున్నాయి. ఆహార ధాన్యాల ఎగుమతిని మరింత విస్తరిస్తే వృథాను, చోరీని అరికట్టి అమూల్య విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాములో 80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసిన భారత్‌, ఈ ఏడాది 1.4 కోట్ల టన్నుల బియ్యంతోపాటు 18 లక్షల టన్నుల గోధుమలనూ ఎగుమతి చేయనుందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లాభదాయక మార్గాల్లో ఆహార ధాన్యాల కొండను కరిగించకపోతే వృథా ఎక్కువవుతుంది. నీటిని అధికంగా తీసుకునే వరి, గోధుమల నుంచి రైతులను అధిక విలువనిచ్చే పండ్లు, కూరగాయల సాగుకు క్రమంగా మళ్లించడం ద్వారా బఫర్‌ నిల్వలను ఆశించిన స్థాయికి తీసుకురావాలి. ఆహార ధాన్యాల ఎగుమతులు, అమ్మకాల ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చు, రవాణా ఖర్చుల్లో రూ.20,000 కోట్లు ఆదా చేయవచ్చు. ఈ నిధులను ఇతర వ్యవసాయ సరకుల ధరల స్థిరీకరణ నిధిగా వినియోగించాలి.

ఇతర దేశాల తీరిలా...

గత ఏడాది ఆసియాలోని బియ్యం ఎగుమతి దేశాల్లో రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి తగ్గిపోవడమే కాదు, కొవిడ్‌ వల్ల నౌకా రవాణా దెబ్బతిని ఎగుమతులకు విఘాతం ఏర్పడింది. కొవిడ్‌ కాలంలో తమ జనాభా అవసరాల కోసం థాయ్‌లాండ్‌, వియత్నాం బియ్యం నిల్వలను పెంచుకోవడం వల్ల కూడా ఎగుమతులు తగ్గాయి. గత ఏడాది వియత్నాం 2,70,000 టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాలూ ఇదే విధంగా ఆలోచిస్తున్నందు వల్ల 2020-21లో ప్రపంచంలో బియ్యం నిల్వలు 17.82 కోట్ల టన్నులకు చేరనున్నాయని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా. నిల్వల సమీకరణ కోసం భారత్‌ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది.

- ప్రసాద్‌

Posted Date: 26-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం