• facebook
  • whatsapp
  • telegram

కార్మిక చట్టాలకు కొత్త రూపు

దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేడు పరస్పర అనుసంధానంగా, పరస్పరాశ్రితంగా పనిచేస్తోంది. ఈనాటి స్థితిగతుల్లో భారత్‌ వంటి వర్ధమాన దేశాలు భారీ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సాగించి, ఆ వస్తువులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేయడం ద్వారా మాత్రమే ప్రగతి పథంలో దూసుకువెళ్ళగలుగుతాయి. ప్రస్తుతం ప్రపంచం వినియోగిస్తున్న ఎయిర్‌ కండిషనర్లలో 80శాతం, మొబైల్‌ ఫోన్లలో 70శాతం, పాదరక్షల్లో 60శాతం, సౌర బ్యాటరీల్లో 74శాతం, లగ్జరీ బ్రాండ్ల వస్తువుల్లో 60శాతం- చైనా నుంచి చవక ధరలకు ఎగుమతి అవుతున్నవే. చైనాకన్నా సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడమే లక్ష్యంగా భారతదేశం తగు విధానాలను రూపొందించి అమలు చేయాలి. మొదట భారీ స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. అది సాధ్యపడాలంటే మన కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచాలి. పరిశ్రమలకు తక్కువ ధరలపై నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలి. విస్తృతంగా రహదారులు, రేవులు, విమానాశ్రయాలను నిర్మించి సరకుల రవాణా ఖర్చులను తగ్గించాలి. మరీ ముఖ్యంగా పురాతన కార్మిక చట్టాల్లో మార్పులుచేర్పులు చేయాలి. ఈ చైతన్యంతోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

ఉద్యోగులు, యజమానులపై ప్రభావం

ఇంతవరకు ఉద్యోగుల జీతంలో కొంత శాతాన్ని భవిష్య నిధి (పీఎఫ్‌), గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ చెల్లింపులకు కేటాయిస్తున్నారు. వేతన సంహిత మూలంగా ఈ పద్ధతిలో మార్పులు రానున్నాయి. ఉద్యోగమిచ్చేటప్పుడే కొత్త నిబంధనలను ఉల్లేఖిస్తారు. నాలుగు కార్మికకోడ్‌లు అన్ని రంగాల్లో ఒప్పంద కార్మికులు, పూర్తికాల ఉద్యోగులతోపాటు ఒప్పంద కార్మికులు, డిజిటల్‌ వేదికలపై పనిచేసే ఉద్యోగులు అందరికీ వర్తిస్తాయి. ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేదా అతడిని తొలగించినా, బర్త్‌రఫ్‌ చేసినా రెండు రోజుల్లోనే పూర్తి వేతనాలను చెల్లించాలని వేతన సంహిత నిర్దేశిస్తోంది.

కీలకమైన నాలుగు ‘కోడ్‌’లు

కేంద్ర ప్రభుత్వం 44 పాత కార్మిక చట్టాలను నాలుగు ‘కోడ్‌’లు లేదా ‘సంహితలు’గా వర్గీకరించింది. వీటిలో మొదటిదైన వేతన సంహిత (2019) సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఒకే విధమైన పని చేసే శ్రామికులకు ఒకే విధమైన వేతనాలు, బోనస్‌ లు చెల్లించాలని నిర్దేశిస్తోంది. ఇది అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలకు వర్తిస్తుంది. రెండోది- కార్యస్థానాల్లో వృత్తి ఉద్యోగపరమైన భద్రత, ఆరోగ్య రక్ష, పని పరిస్థితులకు సంబంధించినది. దీన్ని 2020లో రూపొందించారు. అదే సంవత్సరం సామాజిక భద్రత, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన తొమ్మిది పాత చట్టాలను సామాజిక భద్రతా సంహిత కింద సంఘటితపరచారు. అది మూడో కార్మిక కోడ్‌. తరవాత 1947నాటి పారిశ్రామిక వివాదాల చట్టం, 1926 నాటి కార్మిక సంఘాల చట్టం, 1946నాటి పారిశ్రామిక ఉపాధి చట్టాలను పారిశ్రామిక సంబంధాల సంహిత (2020) కింద సంఘటితం చేశారు. ఇది దేశంలో వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించింది. ఈ నాలుగు కార్మిక సంహిత(కోడ్‌)లు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొందాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు కోడ్‌లను ఒకే దఫాలో అమలులోకి తీసుకురావాలని కేంద్రం లక్షిస్తోంది. దీంతో కార్మిక సంస్కరణలు ఒక కొలిక్కి వస్తాయి. కార్మిక చట్టాలు రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోనివి కాబట్టి, ఈ కోడ్‌లకు తోడుగా రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను రూపొందించి అమలు చేసుకోవచ్చు.

ఉద్యోగులు, యజమానుల మధ్య విభేదాలుంటే వ్యాపారం సజావుగా సాగదు. ఉత్పాదకత, నవీకరణలు వికసించవు. ఏ వ్యాపారానికైనా మొత్తం ఖర్చులో 10 నుంచి 50శాతం వరకు సిబ్బందిపైనే అవుతుంది. కొత్త కార్మిక కోడ్‌లు ఈ ఖర్చులను ప్రభావితం చేయనున్నాయి. ఉపాధి ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, జీతభత్యాల్లో మార్పులుచేర్పులను తీసుకురానున్నాయి. కంపెనీలు, వ్యాపార సంస్థల నిర్వహణ వ్యవస్థల్లో, ఆ సంస్థలు వినియోగించే ఐటీ యంత్రాంగాల్లోనూ మార్పులు తీసుకొస్తాయి. ఇంతవరకు అమలవుతున్న కార్మిక చట్టాల్లో ‘వేతనాలు’ అనే పదానికి 12 రకాల నిర్వచనాలు ఉన్నాయి. ఇది సందిగ్ధతకు, కోర్టు వ్యాజ్యాలకు దారితీస్తోంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి నాలుగు కార్మిక కోడ్‌లలో ‘వేతనాలు’ అనే పదానికి ఒకే విధమైన నిర్వచనమిచ్చారు. వ్యాపార సంస్థల యాజమాన్యాలు ఏవి వేతనాల కిందకు వస్తాయో, ఏవి రావో స్పష్టంగా తెలుసుకుని వ్యవహరించాలి. వేతనం కిందకు పరిగణనలోకి రాని భత్యాలు వేతనంలో సగానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు, వాటిని కూడా వేతనంలో కలిపి చూపించే పద్ధతికి వేతన కోడ్‌ స్వస్తి పలుకుతోంది.

కత్తిమీద సాము!

కార్మిక కోడ్‌ల మూలంగా భవిష్య నిధి (పీఎఫ్‌), పింఛన్లు, గ్రాట్యుటీ వంటి పథకాలకు జీతంలో ఎక్కువ భాగాన్ని కేటాయించాల్సి వస్తుంది. అంటే ఉద్యోగి చేతిలో మిగిలే జీతం తగ్గనున్నది. యజమానులు జీతాలు పెంచనిదే ఈ లోటు భర్తీ కాదు. 2019 నాటి కార్మిక కోడ్‌ల ప్రకారం మూల వేతనం, కరవు భత్యం, రిటెన్షన్‌ చెల్లింపులను కలిపి వేతనం కింద పరిగణించారు. పీఎఫ్‌, బోనస్‌లు, పింఛను, హెచ్‌ఆర్‌ఏ, గ్రాట్యుటీ, ఓవర్‌ టైమ్‌లు వేతనం కిందకురావు. ఒక ఉద్యోగి మీద కంపెనీ చేసే మొత్తం వ్యయం (సీటీసీ)లో మూల వేతనం 50శాతం ఉండాలని పూర్వ కార్మిక చట్టాలు నిర్దేశించాయి. కొత్త వేతన కోడ్‌ సైతం మూల వేతనాన్ని సీటీసీలో 50శాతంగా నిర్ణయించింది. మిగతా 50 శాతాన్ని ఇతర భత్యాలు, ఇంటి అద్దె, ఓవర్‌ టైమ్‌ రూపంలో చెల్లించాలి. ఇంతకన్నా ఎక్కువ చెల్లిస్తే ఆ మొత్తాలనూ జీతంలో కలపాలి. వేతన సంహిత కింద గ్రాట్యుటీ చెల్లింపునకు మూల వేతనం, ప్రత్యేక అలవెన్సులను సైతం పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి, కంపెనీలకు ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులపై ఎక్కువ ఖర్చవుతుంది. ఇంతకాలం కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను రకరకాల అలవెన్సుల కింద విడగొట్టి పీఎఫ్‌, ఆదాయ పన్ను చెల్లింపులు తక్కువగా ఉండేట్లు చూస్తున్నాయి. కొత్త వేతన సంహిత ప్రకారం మొత్తం జీతంలో 50శాతంపై పీఎఫ్‌ను లెక్కించాలి. ఒప్పంద ఉద్యోగి అయినా, పూర్తి కాల ఉద్యోగి అయినా పూర్తి వేతనం చెల్లించాల్సిందే. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాల్సిందే. కొవిడ్‌ వల్ల వచ్చిపడిన విపత్కర పరిస్థితిలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి, కొత్త ఉద్యోగాల సృష్టి బహు కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్మిక కోడ్‌లను అమలు చేయడం అంత తేలిక కాదు. ఇప్పటికే కేంద్రం రూపొందించిన కొన్ని నిబంధనలపై దేశవ్యాప్తంగా కార్మికవర్గాల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది. కొన్ని నిబంధనలు కార్మికుల పాలిట శాపంలా పరిణమిస్తాయని కొందరు నిపుణులూ వాదిస్తున్నారు. కార్మిక నియమావళి వల్ల సంఘటిత, అసంఘటిత రంగాల్లో మొత్తం 50 కోట్లమందికి చట్టపరంగా సామాజిక భద్రత లభిస్తుంది.

- సౌమ్య
 

Posted Date: 29-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం