• facebook
  • whatsapp
  • telegram

సంస్కరణల గణగణ...

టెలికాం రంగంపై కేంద్రం కరుణ

ఎట్టకేలకు టెలికాం రంగానికి భారీ ఉపశమనం దక్కింది. వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు భారం, 5జీ లాంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు... వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రంగానికి ప్రభుత్వ తాజా నిర్ణయం కొత్త ఊపిరి పోసింది. దేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (అడ్జెస్టెడ్‌ గ్రాస్‌ రెవిన్యూ- ఏజీఆర్‌), స్పెక్ట్రమ్‌ బకాయిల వసూలుపై నాలుగేళ్లపాటు మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ చేసిన తాజా ప్రకటన ఆ సంస్థల నెత్తిన పాలుపోసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూరు శాతానికి పెంచడంతో టెలికాం సంస్థలకు మరింత విదేశీ రుణసాయం పొందే అవకాశం ఏర్పడుతోంది. ఇతరత్రా ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించడం, కొరత ఉన్న స్పెక్ట్రమ్‌ను పంచుకోవడానికి అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ‘టెలికాం రంగంలో పెట్టుబడులు పెరిగి, నగదు లభ్యత ఏర్పడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నాం. తద్వారా ఈ రంగంలో ఉన్న ఉద్యోగాలను కాపాడటానికి, కొత్తగా మరిన్ని కొలువుల కల్పనకు, సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడటానికి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి వీలవుతుందని భావిస్తున్నాం’ అని టెలికాం మంత్రి చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడంలో కీలకమైన టెలికాం రంగానికి కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యలను స్వాగతిస్తున్నామని, ఈ చర్యల వల్ల ‘డిజిటల్‌ ఇండియా’ లక్ష్యాలను భారత్‌ చేరుకుంటుందని రిలయన్స్‌ జియో అధినేత ముకేశ్‌ అంబానీ అంటున్నారు. తాజా సంస్కరణల వల్ల భయం లేకుండా పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారీ బకాయిలు

ప్రైవేటు టెలికాం కంపెనీలు కేంద్రానికి ఏజీఆర్‌ కింద చెల్లించాల్సిన బకాయిల్లో ఎయిర్‌టెల్‌ వాటా రూ.43,980 కోట్లు; వొడాఫోన్‌ ఐడియా కట్టాల్సింది రూ.58,254 కోట్లు. ఇవికాక స్పెక్ట్రమ్‌ ఛార్జీలు మరో రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలంటూ 2019 అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. స్పందన రాకపోవడంతో తక్షణమే చెల్లించాలంటూ గతేడాది మరోమారు ఆదేశించింది. ఎయిర్‌టెల్‌ దాదాపు రూ.18 వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను చెల్లించింది. వినియోగదారుల సంఖ్య తగ్గిపోతూ ఆదాయంలో భారీ లోటు ఏర్పడిన వొడాఫోన్‌ ఐడియా మాత్రం రూ.7,854 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులెత్తేసింది. వొడాఫోన్‌ ఐడియాలో తన వాటాను కేంద్ర ప్రభుత్వానికిగాని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థకుగాని ఉచితంగా ఇచ్చేస్తానంటూ ఆ సంస్థ ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా ఈ ఏడాది జులైలో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి లేఖ రాయడం దాని ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నాలుగేళ్ల వెసులుబాటు కల్పించడం వొడాఫోన్‌ ఐడియాకు అతిపెద్ద ఉపశమనం కానుంది! బకాయిలు తక్షణం చెల్లించాల్సిందేనన్న సుప్రీం తీర్పుతో దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. కొత్త సాంకేతికతను సమకూర్చుకోవడం, 4జీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠపరచడం, 5జీ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు కదపడం... ఇలా అన్నింటిపైనా బకాయిల భారం ప్రభావం చూపింది. తాజా వెసులుబాటుతో కంపెనీలు వీటన్నింటిపైనా దృష్టిపెట్టే అవకాశం ఉంది. దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్‌ కూడా నాణ్యంగా లేదు. దీన్ని మెరుగుపరచడానికి, 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ముందడుగు వేయడానికి తాజా నిర్ణయం ఉపకరిస్తుంది. ఎప్పటి నుంచో పరిశ్రమ కోరుతున్న చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, తాజా సంస్కరణలు 4జీ, 5జీకే కాకుండా 6జీ సాంకేతికతకు సైతం కార్యాచరణ ప్రణాళికలా ఉంటాయని భావిస్తున్నామని భారత సెల్యులర్‌ నిర్వాహకుల సంఘం (కాయ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌, టెలికాం ఉపకరణాల తయారీదారుల సంఘం (టెమా) గౌరవ అధ్యక్షులు ఎన్‌.కె.గోయల్‌ వంటివారు విశ్లేషిస్తున్నారు.

పెరగనున్న పోటీ

టెలికాం రంగంలో నేరుగా (ఆటోమేటిక్‌ మార్గంలో) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 49 శాతానికి మించకూడదన్నది ప్రస్తుత నిబంధన. అంతకంటే ఎక్కువగా తెచ్చుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సడలిస్తూ నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించింది. దేశంలో పదేళ్ల కిందట 20కి పైగా ప్రైవేటు టెలికాం సంస్థలు ఉండేవి. ఇప్పుడు ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే ప్రధానంగా రంగంలో ఉన్నాయి. వొడాఫోన్‌ ఐడియా ఉనికి నిలుపుకోవడానికి పోరాడుతోంది. ఒకప్పుడు బలమైన ముద్ర వేసిన టాటా డొకోమో, టెలినార్‌లను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ టెలికాం దివాలా తీశాయి. 70 కోట్లకు పైగా టెలికాం వినియోగదారులున్న మన దేశంలో కేవలం మూడు, నాలుగు కంపెనీలే రంగంలో ఉండటం వినియోగదారుల ప్రయోజనాల రీత్యా సరికాదు. ఇష్టారాజ్యంగా టారిఫ్‌లు పెంచకుండా ఉండటానికి, సేవల్లో నాణ్యతకు కట్టుబడాలంటే ఎక్కువ కంపెనీలు పోటీలో ఉండటం అవసరం. నిధుల కొరతతోనే ఎక్కువ కంపెనీలు మూతపడిన నేపథ్యంలో ఎఫ్‌డీఐల పెంపు నిర్ణయం, కొత్తవాటి ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా బోధన మొదలు పలురకాల సేవలు ఆన్‌లైన్‌లోకి మారడంతో మొబైల్‌ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. డిమాండుకు తగినట్లుగా మౌలిక వసతులు పెంచకపోవడంతో నెట్‌వర్క్‌పరంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. టెెలికాం రంగానికి ఊపిరులూదేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందువల్ల- ఇక నాణ్యమైన సేవలు అందించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలి. సేవాలోపాలు తలెత్తితే కంపెనీలను బాధ్యులను చేసేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా టారిఫ్‌లు పెంచకుండా కట్టడి చేయాలి. అది- పరిశ్రమకు, వినియోగదారుడికి ఉపయుక్తం.

ధరల్లో నిలకడ!

వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్‌పీయూ) చాలా తక్కువగా ఉందని, దానికితోడు రూ.100 ఆదాయంలో ప్రభుత్వానికే వివిధ రూపాల్లో రూ.35దాకా చెల్లించాల్సి వస్తోందని ఎయిర్‌టెల్‌ అధినేత మిత్తల్‌ చెబుతున్నారు. దీంతో ధరలు పెంచక తప్పేలా లేదని అంటున్నారు. పోటీలో నిలబడాలంటే టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించడం చాలా అవసరమని కంపెనీలకూ తెలుసు. అయితే ఏజీఆర్‌ బకాయిలు భారంగా మారుతుండటంతో ధరలు పెంచుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం బకాయిల చెల్లింపునకు వెసులుబాటు దక్కినందువల్ల టారిఫ్‌ పెంపును కంపెనీలు కొంతకాలం వాయిదా వేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ బోధన, ఇంటి నుంచే పని వంటి వాటితో ప్రతిఇంటికి మూడు, నాలుగు ఫోన్లు వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు ధరల పెంపును చేపట్టకపోతే వినియోగదారులపై ఎంతోకొంత భారం తగ్గించినట్లే!

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి
 

Posted Date: 17-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం