• facebook
  • whatsapp
  • telegram

ట్రైబ్యునళ్లలో పేరుకుపోయిన ఖాళీలు

కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

దేశంలోని అన్ని ట్రైబ్యునళ్లలో న్యాయ, సాంకేతిక సభ్యుల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవల విమర్శించింది. ఫలితంగా ఆగమేఘాల మీద ఆయా ట్రైబ్యునళ్లలో కేంద్రం నియామకాలు చేపట్టింది. సెలెక్షన్‌ కమిటీ సిఫార్సు చేసిన పేర్ల ఎంపికలో క్రమపద్ధతిని పాటించకపోవడంపై మరోసారి సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం ఈ కేసు విచారణలో చేసిన వ్యాఖ్యలు- సుప్రీం తీర్పులకు మన్నన కొరవడిన చందాన్ని కళ్లకు కడుతున్నాయి. ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వ ఉదాసీనత వల్ల కేసుల కొండలు పెరిగి, ట్రైబ్యునళ్ల ఏర్పాటులోని రాజ్యాంగ లక్ష్యమే నీరుగారిపోతోందన్నది సుప్రీం ఆవేదన!

జటిల వివాదాలకు ముగింపు

తొలిసారిగా 1941లో ఏర్పడిన ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌తో భారతదేశం సమాంతర, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల దిశగా అడుగులు వేసింది. 1969నాటి మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో సర్వీసు ట్రైబ్యునళ్లను ఏర్పరచాలని సూచించింది. 1974లో ఆరో లా కమిషన్‌- హైకోర్టులపై కేసుల భారాన్ని తగ్గించే దిశగా అత్యున్నత అధికార ట్రైబ్యునళ్లు, కమిషన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ అంశంపైనే 1976లో ఏర్పాటైన స్వరణ్‌ సింగ్‌ కమిషన్‌ సైతం హైకోర్టుల్లో ప్రభుత్వ అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివాదాలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇందుకోసం అన్ని స్థాయుల్లోనూ కార్మిక వివాదాల ట్రైబ్యునళ్లను, అఖిల భారత అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌, కార్మిక, పారిశ్రామిక న్యాయ మండళ్లను సత్వరమే ఏర్పాటు చేయాలని సూచించింది. రెవిన్యూ, భూ కమతాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, దాచివేతలపై ప్రత్యేక స్థాయిలో ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసి, వాటన్నింటినీ సుప్రీంకోర్టు సమీక్ష పరిధిలోకి చేర్చడం ద్వారా, వాటికి హైకోర్టులతో సమాన స్థాయిని కల్పించాలని సిఫార్సు చేసింది. 42వ రాజ్యాంగ సవరణతో అమలైన 323ఏ, 323బీ అధికరణల నేపథ్యంలో అనేక ప్రత్యేక చట్టాలకు అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తిగల క్వాజీ జ్యుడీషియల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఆర్టికల్‌ 136 ద్వారా సుప్రీంకోర్టుకు దఖలుపడిన ‘ప్రత్యేక న్యాయ పరిధి’ మినహా ఇతర అన్ని న్యాయస్థానాల న్యాయ అధికార పరిధులు ఈ ట్రైబ్యునళ్లకు సంక్రమించాయి. వీటి ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం- వివిధ న్యాయస్థానాల్లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఎవిడెన్స్‌ చట్టం వంటి నిబంధనల చట్రంలో ఇరుక్కుని కునారిల్లుతున్న వివాదాలకు సత్వర మోక్షం కలిగించడమే. ఈ ట్రైబ్యునళ్లకు న్యాయాధికారులుగా కేవలం న్యాయశాస్త్ర పట్టభద్రులు, జ్యుడీషియరీ నేపథ్యం కలిగినవారే కాకుండా, సంబంధిత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష అనుభవమున్న వ్యక్తులూ నియమితులవుతారు. ఇలాంటి అనుభవజ్ఞుల సారథ్యంలో నడిచే ట్రైబ్యునళ్లను సర్వ స్వతంత్ర ‘న్యాయమండళ్లు’గా సుప్రీంకోర్టు గతంలో అభివర్ణించింది. 1980 లగాయతు ఏర్పడిన వివిధ ట్రైబ్యునళ్లు సాధారణ కోర్టులపై పనిభారం తగ్గించడమే కాకుండా అనుభవశీలురైౖన న్యాయ, సాంకేతిక సభ్యుల సారథ్యంలో అనేక జటిల వివాదాలకు సత్వర ముగింపు పలికాయి. కంపెనీ లా ట్రైబ్యునల్‌, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, రుణ రికవరీ, పరిపాలన, సాయుధ బలగాలు, సెక్యూరిటీ అప్పిలేట్‌ తదితర ట్రైబ్యునళ్లు దశాబ్దాలుగా సేవలందిస్తూ, దేశ న్యాయవ్యవస్థలో సమాంతర భాగంగా తమవంతు పాత్రను సజావుగా పోషించాయి.

నిర్లక్ష్యానికి నిదర్శనం

ట్రైబ్యునళ్ల పునర్‌ వ్యవస్థీకరణకు ఫైనాన్స్‌ చట్టం-2017 శ్రీకారం చుట్టింది. తద్వారా ఒకే తరహా విధులు నిర్వర్తిస్తున్న ట్రైబ్యునళ్లన్నింటినీ ఏకీకృతం చేసి, వాటి సంఖ్యను క్రమేణా కుదించాలని కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీంతో ఈ సమాంతర న్యాయవ్యవస్థపై అధికారిక దాడి మొదలైనట్లయింది. సభ్యుల నియామకాలు, అర్హత, తొలగింపు వంటి అంశాలపై కేంద్ర సర్కారుకు ఫైనాన్స్‌ చట్టం గంపగుత్త అధికారాలను కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. 2021 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుంచిన ‘ట్రైబ్యునల్‌ రిఫార్మ్స్‌ (రేషనలైజేషన్‌ అండ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌) బిల్లు కాలదోషం పట్టి ఆర్డినెన్సు రూపంలో వెలువడింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టం 2021 రూపంలో మళ్ళీ ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం చట్టం తెచ్చింది. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఫైనాన్స్‌ చట్టం-2017ను అనుసరించి తెచ్చిన ట్రైబ్యునళ్ల ఆర్డినెన్సును కొట్టివేస్తూ ధర్మాసనం గతంలో వెల్లడించిన అభిప్రాయాలను తోసిరాజని, అదే ఆర్డినెన్స్‌ మూసలోనే ట్రైబ్యునల్‌ చట్టాన్ని వండి వార్చడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తు నిదర్శనమని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ట్రైబ్యునళ్లకు స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తి లోపిస్తున్నాయని అనేక సందర్భాల్లో సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ట్రైబ్యునళ్ల చట్టం-2005 రాజ్యాంగబద్ధతను సమీక్షిస్తూ- వాటిపై కార్యనిర్వాహక వర్గం కర్రపెత్తనం చలాయించరాదని హితవు పలికింది. స్వల్ప పదవీ కాలంతో ట్రైబ్యునల్‌ సభ్యులు సరైన కర్తవ్య నిర్వహణ చేయలేరని, అన్ని ట్రైబ్యునళ్లకూ ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది. సభ్యులకు కనీసం అయిదేళ్ల పదవీకాలం, 67 లేదా 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని నిర్ధారించాలని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ట్రైబ్యునళ్లను బలోపేతం చేసే దిశగా అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సిఫార్సుల బేఖాతరుపై అసంతృప్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ చేసిన సిఫార్సులను కాదని, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు కేంద్రం ఇటీవల చేపట్టిన నియామకాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల న్యాయాధికారుల స్వేచ్ఛ, వారి స్వతంత్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని, ఈ వ్యవస్థ హైకోర్టులతో సమానమైన రాజ్యాంగ వ్యవస్థ అని సంపత్‌కుమార్‌ కేసు(1986)లో, చంద్రకుమార్‌ కేసు(1997)లో సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రైబ్యునళ్ల జ్యుడీషియల్‌, సాంకేతిక సభ్యుల అర్హతలు, ఆయా రంగాల్లో వారి వృత్తిపర అనుభవం, ప్రావీణ్యతలు, ఇతర సర్వీసు నిబంధనలపై 2019లో రోజర్‌ మాథ్యూ కేసులో తీర్పు ఇచ్చింది. జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ ఏర్పరచి, సభ్యుల ఎంపిక, నియామకాలను శాస్త్రీయంగా, స్వతంత్రతతో చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. సభ్యుల గరిష్ఠ, కనిష్ఠ పదవీకాలం, వయో పరిమితులపై పలు సూచనలు చేసింది. వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నదే విమర్శ.


 

Posted Date: 20-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం