• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికానికి కొవిడ్‌ కాటు

పెచ్చరిల్లుతున్న పేదరికం

ఎప్పటిలాగే ఈ ఏడాదీ అక్టోబరు 17న అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినం జరుపుకొంటున్నాం. ‘దారిద్య్రాన్ని రూపుమాపడానికి సమష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి, భూమండల పరిరక్షణకు అంకితం కావడం’- ఈ ఏడాది నినాదం. కొవిడ్‌ మహమ్మారి ఇప్పటిదాకా దేశదేశాల్లో 50 లక్షల మందిని బలిగొని, దారిద్య్ర నిర్మూలనలో దశాబ్దాల ప్రగతిని వెనక్కు నెట్టింది. కరోనా వల్ల ప్రపంచమంతటా 7.1 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రజలు దారిద్య్రంలోకి జారిపోతున్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇప్పటికే పేదల సంఖ్య అధికంగా ఉన్న దక్షిణాసియా, సహారా ఎడారి దిగువ దేశాల్లో కటిక పేదరికం పెరుగుతోందని పేర్కొంది. కొవిడ్‌ కారణంగా కొత్తగా పేదరికంలోకి జారిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది 16.3 కోట్ల దాకా పెరగనుంది. ఇప్పటికే కటిక పేదరికంలో మగ్గుతున్న 130 కోట్ల మందికి వీరు అదనం. పేదరికాన్ని తగ్గించి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధనకు భారత్‌ ముమ్మరంగా కృషి చేయాలి. ఇండియాలో 91శాతం ఉపాధి అసంఘటిత రంగంలోనే లభిస్తోంది. కొవిడ్‌ కాలంలో ఈ రంగంలోని వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కుదేలై లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. కొవిడ్‌వల్ల ఈ ఏడాది అదనంగా 23 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోతారని అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం మదింపువేసింది. 93శాతం కుటుంబాలు ఆదాయ నష్టం చవిచూశాయని సీఎంఐఈ సంస్థ సర్వే నిర్ధారించింది. భారత్‌లో కొవిడ్‌కు ముందే ఎక్కువగా ఉన్న పేదరికం వైరస్‌ కాలంలో తీవ్రమైంది.

అరకొర ఆదాయం

దారిద్య్ర నిర్మూలనలో చైనా, వియత్నామ్‌ల విజయాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 1978లో చైనాలో 80శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, ప్రస్తుతం అయిదు శాతానికి తగ్గింది. వియత్నామ్‌లో 1992లో 58శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, 2016నాటికి 7.6శాతానికి దిగివచ్చింది. మొదట సాగుకు ప్రాధాన్యమిచ్చిన చైనా, తరవాత వ్యవసాయం నుంచి పరిశ్రమలకు పెద్దయెత్తున మానవ శక్తిని తరలించి ఆదాయ వృద్ధి సాధించింది. వియత్నాం సైతం అదే బాటలో నడిచింది. సోషలిస్టు మార్కెట్‌ వ్యవస్థను ఏర్పరచి ప్రజల్లో వ్యవస్థాపక సామర్థ్యానికి అనువైన వాతావరణం కల్పించింది. ఆర్థిక సంస్కరణలు తెచ్చి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. తమ ప్రజలకు ఆధునిక నైపుణ్యాలు అలవరచి, ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగింది. భారత్‌ సైతం పేదరిక నిర్మూలనకు సరైన వ్యూహాన్ని అనుసరించాలి. దేశంలో మొత్తం గ్రామీణ ఆదాయంలో వ్యవసాయం వాటా 2003లో 46శాతం; అది 2018-19లో 37శాతానికి తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం వ్యవసాయ కుటుంబాల మొత్తం ఆదాయంలో వేతన వాటా పెరిగింది. అంటే, గ్రామాల్లో పోనుపోను అనేకమంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారని అర్థం. 2013 నుంచి 2018 వరకు ఆరేళ్లలో రైతుల ఆదాయం ఏటా 3.5శాతం చొప్పున పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది.  రైతుల ఆదాయాలు రెట్టింపు కావాలంటే వారి వార్షిక రాబడి ఏటా 10శాతం మించి పెరగాలి. 2018-19లో రైతులకు వ్యవసాయం ద్వారా లభించిన సగటు ఆదాయం రోజుకు రూ.127కు మించలేదు. సేద్యంతోపాటు కూలి పనులు, పాడి, కోళ్ల పెంపకం, వ్యవసాయేతర ఉపాధులను కలుపుకొన్నా- రైతు దినసరి ఆదాయం రోజుకు రూ.341 మించదు.

నైపుణ్యాలు నేర్పాలి...

38శాతం భారతీయ బాలల్లో ఎదుగుదల లోపాలున్నట్లు 2015-16లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చాటింది. 2019-20 నాటికీ దీన్ని అధిగమించలేకపోయాం. ఈట్‌-లాన్సెట్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన ప్రకారం గ్రామీణ కుటుంబాల్లో ప్రతి వ్యక్తికీ పౌష్టికాహారం లభించాలంటే రోజుకు మూడు నుంచి అయిదు డాలర్లు ఖర్చవుతుందని టాటా-కార్నెల్‌ అధ్యయనం తెలిపింది. వాస్తవంలో అంత ఖర్చు చేసే స్తోమత గ్రామీణ కుటుంబాలకు లేదు. సుస్థిర వ్యవసాయంతోపాటు సుస్థిర ఆహార సరఫరా, సుస్థిర గ్రామీణ ఆరోగ్య యంత్రాంగమూ అవసరమేనని కొవిడ్‌ కాలంలో అనుభవమైంది. ఉపాధి హామీ పథకం, పీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకాలను మరింత పటిష్ఠంగా అమలుచేస్తే గ్రామీణ ఆదాయాలు,జీవనోపాధి, పోషణ స్థాయులు మెరుగుపడతాయి. పీడీఎస్‌ ద్వారా పప్పులు, నూనెలు, విటమిన్లు, ఖనిజలవణాలు చేర్చిన ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలి. గ్రామీణులకు కొత్త నైపుణ్యాలు నేర్పడమూ అవసరం. వ్యవసాయం నుంచి పరిశ్రమలు, సేవా రంగంలోకి శ్రామిక ప్రవాహం పెరగాలి. వీరి వలసలను తట్టుకొనేలా పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి. కనీస వేతనాలనూ పెంచాలి. దీనివల్ల వ్యాపార సంస్థలు ఉద్యోగ నియామకాలను తగ్గిస్తాయని, అది ఉపాధి నష్టానికి దారితీస్తుందని వాదనలు వినిపిస్తుంటాయి. అవి తప్పని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న డేవిడ్‌ కార్డ్‌, జీడబ్ల్యూ ఇంబెన్స్‌, జోషువా యాంగ్రిస్ట్‌లు చాటిచెప్పారు. వలసల వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు, వేతనాలు తగ్గవని వారి అధ్యయనంలో నిరూపితమైంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కొవిడ్‌ అనంతర ఆర్థిక విధానాలను రూపొందించాలి. ఐక్యరాజ్యసమితి పిలుపిచ్చినట్లు 2030కల్లా దారిద్య్రాన్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించే కృషిలో ముందడుగు వేయాలి!

మూడు పంటలకే ప్రాధాన్యం

స్వాతంత్య్రం వచ్చిన తరవాత భారతదేశం ఆహారం విషయంలో కొరతను అధిగమించి స్వయం సమృద్ధమైంది. ఇది ప్రధానంగా హరిత విప్లవం వల్లనే సాధ్యమైంది. హరిత విప్లవం భూసార క్షీణతకు, భూగర్భ జల వనరులు హరించుకుపోవడానికి, వ్యర్థ జలం నిలిచిపోవడానికి దారితీసింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలపై నానాటికీ వ్యయం పెరిగిపోయి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది. సాగునీరు, ధాన్య సేకరణ ప్రధానంగా వరి, గోధుమ, చెరకు చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మూడు పంటలే 75 నుంచి 80శాతం సాగునీటిని ఉపయోగించుకొంటున్నాయి. పప్పు, నూనెగింజలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయల పెంపకాన్ని పెద్దయెత్తున చేపట్టి, వ్యవసాయంలో అసమతుల్యతను తొలగించాలి. నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ, వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తూ గ్రామీణ ఆదాయాలు పెంపొందించాలి. మహిళలు, చిన్న రైతులకు అభివృద్ధి ఫలాలను అందించాలి. ఈ విషయంలో గుజరాత్‌లో పాడి సహకార సంస్థ అమూల్‌ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకం.


 

Posted Date: 16-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం