• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణోగ్రతల కొలిమిలో విశ్వం విలవిల

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల భారీగా వరదలు, బురద ప్రవాహం వెల్లువెత్తాయి. వీటి కారణంగా ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉపద్రవానికి కారణం సముద్రాలన్నీ ముందెన్నడూ లేనంత స్థాయిలో వేడెక్కడమేనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వాతావరణ పరిశోధన సంస్థలన్నీ నొక్కి చెబుతున్నాయి.

సముద్రాల ఉష్ణోగ్రతలను లెక్కించడం 1940 నుంచి మొదలైంది. ఆరు దశాబ్దాలుగా ఈ వేడి పెరుగుతూ వస్తోంది. 1990 తరవాత ఇది మరింతగా ఎక్కువైంది. గత వెయ్యేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2022లో సాగర జలాలు వేడెక్కాయి. ఈ పరిణామాలపై- చైనా వైజ్ఞానిక సంస్థ, అమెరికాలోని జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ, జాతీయ సముద్రాంతర, వాతావరణ పర్యవేక్షణ కేంద్రం వంటి సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాలో వరదలు, బురద ప్రవాహం అనేవి ప్రారంభ సంకేతాలేనని, పోనుపోను మరిన్ని విపత్తులను చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సముద్రాల్లో వేడిని కచ్చితంగా లెక్కించగలిగితే, భూగ్రహం ఎలా అసమతౌల్యం అవుతోందన్నది మరింత విస్పష్టంగా తెలుసుకోవచ్చన్నది మిన్నెసోటాలోని సెయింట్‌ థామస్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జాన్‌ అబ్రహాం మేలిమి సూచన.

ఇంధనాల వెలికితీతతో...

శిలాజ ఇంధనాలను వెలికితీసినప్పుడు హరితవాయు (గ్రీన్‌హౌస్‌) ఉద్గారాలు విడుదలవుతాయి. అయితే, వీటిలో 90శాతం ఉద్గారాలను సముద్రాలే పీల్చేసుకుంటాయి. అందువల్ల శిలాజ ఇంధనాలను వెలికితీసినకొద్దీ సముద్రాలు వేడెక్కుతూనే ఉంటాయి. పరిశ్రమలు, వాహనాలు, ఇతరత్రా మానవ కార్యకలాపాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలనూ చాలామటుకు సముద్రాలే శోషిస్తాయి. దాంతో సాగరాలు వేడెక్కడం వల్ల తీవ్రస్థాయి తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. శాస్త్రవేత్తలు సముద్ర ఉపరితలం నుంచి 6,561 అడుగుల లోతు వరకు సముద్ర ఉష్ణోగ్రతలను కొలిచారు. 2021తో పోలిస్తే 2022లో సముద్రాలు పదింతలు అధికంగా ఉష్ణోగ్రతను పీల్చుకున్నట్లు తేలింది. ఇది- భూగోళంపై ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా అనునిత్యం 40 హెయిర్‌ డ్రయర్లను వాడటంవల్ల ఉత్పత్తి అయ్యే వేడికి సమానం! ఉష్ణోగ్రతలతో పాటే ఉప్పు స్థాయులు అధికమవుతుండటంతో సముద్రపు నీరు పొరలు పొరలుగా విడిపోతోంది. ఈ ప్రక్రియ కారణంగా సాగరాల్లో ఆమ్లజని స్థాయులు అంతకంతకు తగ్గడం- జలచరాలకు, తీరప్రాంత వాసులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా సముద్రాల్లోని జీవవైవిధ్యం ధ్వంసమై, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. దాంతో వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ పరంపర నిరాటంకంగా కొనసాగుతుండటం- సముద్ర జీవులు, మనుషుల ఆహారపు అలవాట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.

నిరుడు నవంబరులో నిర్వహించిన ‘కాప్‌-27’ వాతావరణ సదస్సులో శిలాజ ఇంధనాల నియంత్రణకు అనేక ప్రణాళికలను సిద్ధం చేశారు. భూతాపంలో వృద్థిని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న ప్యారిస్‌ వాతావరణ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలనీ తీర్మానించారు. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప, అగ్రరాజ్యాలేవీ ఆ దిశగా ముందడుగు వేయడంలేదు. ఇన్నాళ్లూ వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి విపత్తుల ప్రభావం ఎక్కువగా పేద దేశాలపైనే ఉంటూ వచ్చింది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాపైనా ఈ దుష్ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితులన్నీ యథాతథంగా కొనసాగితే 2100 నాటికి భూతాపం 2.9డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రపంచ దేశాలను ఘాటుగా హెచ్చరించింది. చమురు, సహజవాయు సంస్థలు తమ ఉత్పత్తులను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో 2100వ సంవత్సరానికంటే ముందే ఆ మార్కును దాటిపోవచ్చన్న అంచనాలున్నాయి.

ఉష్ణోగ్రతల మాదిరే సముద్ర మట్టాలూ అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో చెన్నై, కోల్‌కతాలతో పాటు మయన్మార్‌లోని యాంగాన్‌, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌, వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకూ ముప్పు పొంచి ఉంది. అంతర్గత వాతావరణ వైరుధ్యాల కారణంగా కొన్నిచోట్ల సముద్రమట్టాలు 20-30శాతం పెరుగుతాయని, ఫలితంగా వరదముప్పు మరింత అధికమవుతుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.

ప్రత్యామ్నాయ వనరులనే అనుసరించాలి...

శిలాజ ఇంధన సంస్థలకు లాభాలు ఆర్జించి పెట్టాలన్న తపనను ప్రపంచ దేశాలు విడనాడాలి. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఎక్కువగా ఆధారపడాలి. ముఖ్యంగా సౌర, పవన విద్యుత్‌ వినియోగాన్ని ఇతోధికంగా పెంచాలి. సహారా ఎడారి వంటి ప్రాంతాల్లో విస్తారంగా సౌరఫలకలను ఏర్పాటు చేయగలిగితే- యావత్‌ ప్రపంచానికి అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నది పరిశోధకుల తాజా అంచనా! విద్యుత్తు వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచాలి. దూరప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా వాటి రూపకల్పన, తయారీలో మార్పులు తీసుకురావాలి. గృహాలపై అమర్చుకోవడానికి వీలు కల్పించే పైకప్పు సౌర విద్యుత్‌ వ్యవస్థ (రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌)లకు ప్రోత్సాహకాలను పెంచాలి. అప్పుడు బొగ్గు ఆధార విద్యుత్‌ కేంద్రాల అవసరం చాలామేర తగ్గుతుంది. ప్రభుత్వాధినేతలు దూరదృష్టితో ఆలోచించాలేగాని- శిలాజ ఇంధనాల వినియోగాన్ని కట్టడిచేసే పరిష్కార మార్గాలెన్నో కనిపిస్తాయి. వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తేనే- భావి తరాల జీవనం మెరుగవుతుంది.

వాతావరణ విపత్తులు

పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే- 2022 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించింది. అదృష్టవశాత్తు ‘లా నినా’ ప్రభావం వల్ల వర్షాలు విస్తారంగా కురవడంతో వాతావరణం చల్లబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ ప్రభావం కొంతవరకే కొనసాగిందని, వాతావరణంలోకి వెలువడుతున్న హరిత వాయు ఉద్గారాల వల్ల పుడమి వేడెక్కుతూనే ఉందని వాతావరణ సంస్థ విశ్లేషించింది. 2015-2022 మధ్య ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వచ్చాయి తప్ప, ఒక్కసారైనా అవి తగ్గుముఖం పట్టిన దాఖలాల్లేవు! 2011-2020 మధ్య భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.09 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉండవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్‌ ప్రభుత్వాల సంఘం (ఐపీసీసీ) తన ఆరో నివేదికలో పేర్కొంది. అయితే 2013-2022 మధ్య అది 1.14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలే సముద్రాలు వేడెక్కడానికీ ప్రధాన కారణమవుతోంది. భూతాపం 1800 నాటి కంటే 1.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ విపత్తులు తీవ్రస్థాయిలో సంభవిస్తాయని కొన్నేళ్ల కిందటే పరిశోకులు హెచ్చరించారు. ఈ పెరుగుదల అంతకు మించిపోవడం వల్లే ఇప్పుడు కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

‣ బ్రిక్స్‌ విస్తరణకు డ్రాగన్‌ ఆరాటం

‣ దయనీయ స్థితిలో దాయాది

‣ ఈసారైనా జనగణన చేపడతారా?

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం