భారత దేశ జనాభా ఎంత? అక్షరాస్యత శాతం ఎంత? స్త్రీ, పురుషుల నిష్పత్తి ఎంత? ఇలాంటి ప్రశ్నలకు అధికారిక గణాంకాలు కావాలంటే ఇప్పటికీ 2011 జనాభా లెక్కలే ఆధారం. అంటే పన్నెండేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే! ఈ పుష్కర కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశం ఎంతో పురోగతి సాధించింది. ఆ వివరాలన్నీ కచ్చితంగా తెలియాలంటే తక్షణం జన గణన చేపట్టాల్సిందే. కానీ, కొవిడ్ కారణంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.
ప్రస్తుత ‘డేటా ఎకానమీ’కి సమగ్ర సమాచారమే సరికొత్త ఇంధనం. త్వరితగతిన, కచ్చితత్వంతో సేకరించిన సమాచారం చాలా విలువైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా విశ్వసనీయ, ప్రామాణిక సమాచారమే నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా మారుతుంది. మనదేశంలో అతి పెద్ద, నమ్మకమైన, అమూల్యమైన డేటా అంటే- పదేళ్లకోసారి సేకరించే జనాభా లెక్కల సమాచారమే. పాలకులకు ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు వీటిద్వారానే తెలుస్తాయి. 1872 మొదలు 2011 వరకు జన గణన చేపడుతూ వచ్చారు. రెండు ప్రపంచ యుద్ధాలు, ఆపైన చైనా, పాకిస్థాన్లతో యుద్ధాల సమయంలోనూ దేశంలో జన గణన ఆగలేదు. యుద్ధాలు సైతం ఆపలేని జన గణనను కొవిడ్ నిలువరించింది. ప్రభుత్వాలు పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పటికీ 2011 నాటి జనాభా లెక్కల వివరాల్ని, వివిధ ప్రభుత్వ విభాగాలు సేకరించే అసమగ్ర సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోంది. కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన జన గణన- ప్రస్తుతానికి 2023 సెప్టెంబరు 30దాకా వాయిదా వేశారు. కీలకమైన ఈ ప్రక్రియను వాయిదా వేయడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం కొవిడ్ను సాకుగా చూపుతున్నా- ఈ రెండు మూడేళ్లలోనే అమెరికా, రష్యా, యూకే, బ్రెజిల్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాయి. జన గణన అంటే దేశ ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితుల్ని తెలియజేసే విలువైన సమాచారం. ఈ విషయంలో ఆలస్యం, అలసత్వం ఉండకూడదన్నది నిపుణుల అభిప్రాయం.
అన్నింటికీ అదే ఆధారం...
‘దేశంలో ప్రజల ఆవాసాల పరిస్థితి, గృహాల్లోని వసతులు, గ్రామాలు, పట్టణాల్లో మానవ వనరులు... ఇలాంటి సమాచారానికి ఏకైక ఆధారం పదేళ్లకోసారి చేపట్టే జన గణన. ప్రణాళికా రచన, విధానాల రూపకల్పన, ప్రజా పాలనలో ప్రభుత్వాలకు ఇదే ప్రామాణికం’ అని 2020 నాటి భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ వివేక్ జోషీ జన గణన విశిష్టతను చాటారు. పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల వార్డుల హద్దులు నిర్ణయించడానికి, రిజర్వేషన్ల నిర్ధారణకు ఇదే ఆధారం. వివిధ సంక్షేమ పథకాలకు, ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు కేటాయించడానికి జనాభా లెక్కలే మూలం. దేశ పౌరుల గతిని, ప్రగతిని నిర్ధారించే ఇలాంటి ప్రక్రియను ఆలస్యం చేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా శ్రేయస్కరం కాదు.
రెండు దశల్లో గణన...
జన గణనకు కొవిడ్ మాత్రమే అడ్డంకి అనుకుంటే, అది ఎన్నికలకూ వర్తించాలి. కానీ 2020 తరవాత పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలనగానే ర్యాలీలు, పెద్దయెత్తున సమూహాలు గుమిగూడటం, లక్షల మంది ఓటర్లు దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడం వంటివన్నీ ఉంటాయి. ఇలాంటివాటికి కొవిడ్ను అడ్డంకిగా భావించకున్నా, జన గణనకు మాత్రం దానినే సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ సకల జనుల సర్వే, ఆంధ్రప్రదేశ్ ప్రజాసాధికార సర్వే నిర్వహించాయి. వాటి ఆధారంగా పథకాల రూపకల్పన జరిగింది. కేంద్రం తాజా బడ్జెట్లో జనాభా లెక్కల సేకరణ కార్యకలాపాల కోసం రూ.1,564 కోట్లు కేటాయించింది. అయినప్పటికీ, ఈసారైనా అవాంతరాలు లేకుండా జన గణన పూర్తవుతుందా అనేది వేచిచూడాలి.
జన గణన రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆవాసాల సమాచారం సేకరిస్తారు. ఇళ్ల పరిస్థితి, సదుపాయాలు, పరికరాలు... అంటే విద్యుత్ సదుపాయం, వంటగ్యాస్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు తదితర వివరాలు అడిగి తెలుసుకుంటారు. రెండో దశలో జన గణన చేపడతారు. ఇందులో ఇంట్లో సభ్యుల వివరాలు వారి చదువు, కులం, మతం, ఉపాధి, భాష, అక్షరాస్యత, వలసలు, పిల్లలు... వంటి సమాచారం సేకరిస్తారు. గతంలో రెండు దశల మధ్య కొంత సమయం ఉండేది. ఈసారి డిజిటల్ పరికరాలతో జన గణన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రక్రియను ఆరు నెలల్లో ముగించి 2024 ప్రారంభం నాటికి జనాభా లెక్కల్ని విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న దేశం మనది. ఇలాంటి మానవ వనరుల్ని ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకోవాలి. ఇందుకు జనగణన కీలక ఉపకరణం. అందుకని, ప్రభుత్వం వీలైనంత త్వరగా జన గణనను ప్రారంభించాలి. భవిష్యత్తులో కొవిడ్ లాంటి సమస్యలు, ఇంకో రకమైన విపత్తులు ఎదురైనా ఈ ప్రక్రియ ఆలస్యం కాకూడదు. మరోవైపు, ఇప్పటికీ దశాబ్దానికి ఒకసారి జనాభాను లెక్కించి ప్రణాళికలు రచించే ప్రక్రియను అనుసరించడం కాకుండా, అంతకన్నా తక్కువ వ్యవధిలో జన గణన చేపట్టే దిశగానూ యోచించాలి.
ఆహార భద్రత
అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అవతరించాలంటే సరైన సమాచారంతో వేగవంతంగా ప్రణాళికలు రచించుకోవడం, అంతే వేగంగా వాటిని అమలు చేయడం చాలా అవసరం. లేకుంటే ప్రజల అవసరాలకు, ప్రభుత్వ పథకాలకు మధ్య పొంతన కుదరదు. జాతీయ ఆహార భద్రత పథకం కింద 75 శాతం గ్రామీణ, 50 శాతం పట్టణ ప్రజలకు పౌర సరఫరా వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల్ని అందిస్తున్నామని, లబ్ధిదారుల సంఖ్య 81 కోట్లకుపైగానే ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారం లబ్ధిని అందిస్తోంది. రెండు దశాబ్దాల్లో జనాభా గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ లెక్కన చాలామంది ఆహార భద్రతకు నోచుకోవడం లేదని, ముఖ్యంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ‘ఆహార భద్రత ప్రజల ప్రాథమిక హక్కు’గా స్పష్టంచేసిన సర్వోన్నత న్యాయస్థానం- తాజా వివరాలతో ఎక్కువ మందికి ఆహార భద్రత కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
- సుంకరి చంద్రశేఖర్