• facebook
  • whatsapp
  • telegram

అన్నదాత ఓటు ఎటు?

కర్షకుల తీర్పుపై భాజపాలో ఉత్కంఠ

ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్న భారతీయ జనతా పార్టీని తొలిచేస్తోంది. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. తమ అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైనందుకు వారు ఇటీవలే విశ్వాస్‌ఘాత్‌ దినాన్ని నిర్వహించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ప్రసన్నులవుతారని భాజపా పెట్టుకున్న ఆశ నెరవేరేలా లేదు. రైతు చట్టాల రద్దు మోదీ ఘనత కాదని, ఏడాదిపాటు తాము చేసిన ఉద్యమ ఫలితమేనని రైతులు భావిస్తున్నారు. కనీస మద్దతు ధరను 23 పంటలకు వర్తింపజేయాలంటూ ఉద్యమం కొనసాగిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఈసారి భాజపాకు తప్ప మరే పార్టీకైనా సరే ఓటు వేయాలని రైతులకు పిలుపిస్తోంది.

సర్కారు వ్యూహాలు ఫలించేనా?

ఎస్‌కేఎం పోరాటం కేవలం భాజపా మీదనే కాదు, ప్రధాని మోదీ పైన కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిస్తే సర్కారు మళ్ళీ వ్యవసాయ చట్టాలను తీసుకొస్తుందని ఎస్‌కేఎం అనుమానిస్తోంది. కేంద్రం రైతు అనుకూలం కాదని నమ్ముతోంది. వ్యవసాయ చట్టాల రద్దుకు ఏడాదిపాటు ఎండావానలను, గడ్డ కట్టించే చలిని లెక్కచేయకుండా జరిపిన ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. లఖింపూర్‌ ఖేరిలో గత అక్టోబరులో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా రైతులపైకి మోటారు వాహనం తోలి- వారి మరణానికి కారకుడయ్యారు. అయినా కేంద్ర సర్కారు రైతులను ఖలిస్థానీలుగా, ఆందోళన జీవులుగా ఈసడించింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపా వేరే వ్యూహం అనుసరిస్తోంది. అక్కడ ఆ పార్టీ హిందుత్వ కార్డు ప్రయోగిస్తోంది. ఏడేళ్ల క్రితం ముజఫర్‌ నగర్‌లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 60 మంది మరణించడాన్ని అది గుర్తుచేస్తోంది. ‘మీరు ఆనాటి హింసాకాండను మరచిపోయారా?’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఓటర్లను ప్రశ్నించారు. జనవరి 29న ముజఫర్‌ నగర్‌లో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. జాట్లు మొదట తాము హిందువులని, తరవాతే రైతులని గ్రహించాలని భాజపా సందేశమిస్తోంది. కానీ, ఏడాదిపాటు ఉద్యమంలో పాల్గొన్న రైతులు తాము మొదట రైతులం, తరవాతే హిందువులమని అంటున్నారు.

పశ్చిమ యూపీలో జాట్ల పార్టీగా పేరుపడిన రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధ్యక్షుడు జయంత్‌ చౌధురి వైఖరి ఇదే. సమాజ్‌వాదీ పార్టీతో పెట్టుకున్న పొత్తును తెంచుకుని ఆర్‌ఎల్‌డీ మళ్ళీ సొంతింటికి రావాలని జనవరి 26న భాజపా ఎంపీ పర్వేష్‌ వర్మ పిలుపిచ్చారు. గత ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్న ఆర్‌ఎల్‌డీ ఈసారి సమాజ్‌ వాదీ పార్టీతో చేతులు కలిపింది. వర్మ పిలుపునకు స్పందించిన జయంత్‌ చౌధురి ‘నన్ను మీ ఇంటికి రమ్మని ఆహ్వానించకండి. ఉద్యమంలో ప్రాణాలర్పించిన 700 మంది రైతుల కుటుంబాలను పిలవండి’ అని ట్వీట్‌ చేశారు. పశ్చిమ యూపీలో జాట్లు తాము మొదట హిందువులం తరవాతే రైతులమని భావించారు కాబట్టి 2014, 2017, 2019 ఎన్నికల్లో భాజపాకు ఓటు వేశారు. కానీ, 2022 ఎన్నికల్లో మతాన్ని బట్టి కాకుండా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలనుకొంటున్నారు. అందుకే ఈసారి జాట్‌ రైతులు ముస్లిం కర్షకులతో చేతులు కలిపారు. వ్యవసాయ చట్టాలపై ఉభయులూ ఏడాది పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. 2013నాటి అల్లర్ల చేదు స్మృతుల ప్రభావం ఉద్యమంపై కనిపించలేదు. ముజఫర్‌ నగర్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా ఇటీవల నిర్వహించిన మహా పంచాయత్‌లో జాట్‌, ముస్లిం రైతులు పాల్గొన్నారు. మత భేదాలను పక్కనపెట్టి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉభయులూ ఏకమవుతున్నారనడానికి అది సంకేతం.

ఆర్థిక ప్రయోజనాలే...

పంజాబ్‌ రైతులూ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక్క తాటి మీదకు వచ్చారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మందిలో 500 మంది పంజాబ్‌కు చెందినవారే. ఏడాదిపాటు సాగిన ఆ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని రైతు సంఘాలు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలుగా మారి పోరాడుతున్నాయి. పంజాబ్‌లో భాజపా హిందూ కార్డును ఉపయోగించకుండా జాతీయవాద నినాదాన్ని భుజానికెత్తుకుంది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదం జాతీయ భద్రతకు హానికరమని చాటుతోంది. కానీ, ఈసారి పంజాబ్‌ ఎన్నికలు రైతు సమస్యల మీద జరుగుతున్నాయి తప్ప- జాతీయ భద్రత కోసం కాదు. గ్రామాల్లో రైతు ఓటర్లు తనకు దూరమవుతూ ఉండటంతో అకాలీదళ్‌ ముందుజాగ్రత్తగా భారతీయ జనతా పార్టీతో పొత్తును తెంచుకుంది.

- అరుణ్‌ సిన్హా

(సామాజిక రాజకీయ విశ్లేషకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ స్వప్నానికి అంతర్జాల సవాళ్లు

‣ సంక్లిష్ట రాజకీయ సమరం

‣ పల్లవించని రైతు సంక్షేమం

‣ విచ్చలవిడిగా నీటి తోడివేత

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం