• facebook
  • whatsapp
  • telegram

పోరుబాటలో ఆకాశనేత్రం

యుద్ధరంగాన కీలకంగా అంతరిక్ష సాంకేతికత

యుద్ధరంగంలో పదాతి దళం, వైమానిక, నౌకా సేనలు వేటికవే సాటిలేనివి. ఇవి సరైన సమన్వయంతో రంగంలోకి దిగినప్పుడు శక్తి ఇనుమడిస్తుంది. సముద్రంలో నుంచి యుద్ధ విమానాల్ని ప్రయోగించేందుకు నౌకాదళం తోడ్పాటు ఎంతో కీలకం. పదాతి దళం ముందంజ వేయడానికి యుద్ధ విమానాల దన్ను మరెంతో అవసరం. ఇలా త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వీటికి అంతరిక్ష శక్తి కూడా తోడైతే తిరుగులేని బలం సమకూరుతుంది. భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకొనే వారిదే పైచేయిగా మారే అవకాశం ఉంది. యుద్ధాల్లో విజేతలను నిర్ణయించడంలో అంతరిక్ష సాంకేతిక సంపదే ప్రధాన పాత్ర పోషించనుంది. అంతరిక్షంలోని సాధన సంపత్తితో వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి ఇటీవల పేర్కొనడమే దీనికి నిదర్శనం. భవిష్యత్‌ యుద్ధాల్లో విజేతలను ఇవే నిర్ణయిస్తాయంటున్నారు. పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ ఆధారిత సామర్థ్యాన్ని సాధించేందుకు భూతల, అంతరిక్ష వ్యవస్థలను వైమానికదళం ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంతటి శక్తిమంతమైన సైన్యానికైనా నిఘా, కమ్యూనికేషన్‌, యుద్ధరంగంలో ముందంజ వేయడం మాత్రమే విజయాల్ని సాధించి పెట్టలేవు. వీటన్నింటికీ ఉపగ్రహాలు తోడవ్వాల్సిందే. అంతరిక్షం నుంచి చిత్రాలు అందనిదే శత్రువు సాయుధ సంపత్తిపై అంచనా వేయడం కుదరదు. నావిగేటర్‌ వంటి ముందుకు నడిపే సాంకేతికత లేకుండా క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ముందడుగు సాధ్యం కాదు. కమ్యూనికేషన్‌తోనే వివిధ యూనిట్ల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. ఆధునిక యుద్ధాల్లో ఇలాంటి అవసరాల కోసం నిఘా, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌లకు సంబంధించిన ఉపగ్రహాల్ని సైన్యాలు ఉపయోగిస్తాయి.

బలోపేతం చేయడంపై దృష్టి  

అంతరిక్ష రంగంలో పేరొందిన పెద్ద దేశాలన్నీ సైనిక సామర్థ్యాల్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఇందులో ఉపగ్రహాల్ని నాశనం చేసే ఆయుధాలు, రోదసి నౌకలకు సంబంధించిన సమాచార సేకరణ, పంపిణీ వంటి కార్యకలాపాల్ని నిరోధించి, అంతరాయం కలిగించే సాంకేతిక పరిజ్ఞానాల్ని సముపార్జించుకుంటున్నాయి. మరోదేశ ఉపగ్రహం నిర్దేశిత లక్ష్యాల ఫొటోల్ని తీయకుండా దాన్ని దెబ్బతీసే లేజర్‌ పుంజాన్ని రూపొందించే పనిలో ఫ్రాన్స్‌ నిమగ్నమైంది. ఉపగ్రహాల్ని పంపించే, స్వీకరించే రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలను అడ్డుకొనే పరిజ్ఞానంపై ఉత్తర కొరియా అధ్యయనం సాగిస్తోంది. ఉపగ్రహాలను దెబ్బతీసేలా చేపట్టే సైబర్‌ దాడులపై ఇరాన్‌ కసరత్తు సాగిస్తోంది. ఉపగ్రహాలను నిఘా ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఉపయోగించడంపై అమెరికా, రష్యా, చైనా యత్నిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష దళాన్నే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌ 2019లో ఉపగ్రహ నిరోధక క్షిపణిని ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇరాన్‌ సైతం సైనిక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శత్రుదళాల మోహరింపు, కదలికలకు సంబంధించిన నిఘా సమాచారాన్ని ముందస్తుగా చేరవేయడం ద్వారా ఉపగ్రహాలు- దళాల కార్యనిర్వాహక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు వంటి మారుమూల, క్లిష్టమైన ప్రాంతాల విషయంలో నిఘా ఉపగ్రహాల సేవలు గణనీయమైనవి. నావిగేషన్‌, కమ్యూనికేషన్లు, ప్రసారాలు, వాతావరణ సమాచారం వంటి వివరాల్ని అందజేస్తాయి. ఇలాంటివన్నీ నేలపై ఉండే వ్యవస్థలూ చేయగలిగేవే అయినా, సైనిక ఉపగ్రహాలు మరింత అదనపు సమాచారాన్ని నిక్కచ్చిగా అందించే అవకాశం ఉంది. ఏటా అంతరిక్షంలోకి పంపించే ఉపగ్రహాలతో మనదేశానికి సైనిక నిఘా సంబంధిత సమాచారాన్ని పూర్తిస్థాయిలో సాధించే సామర్థ్యం ఇనుమడించింది. భారత్‌, చైనా సైనిక బలగాల మధ్య లద్దాఖ్‌ ప్రాంతంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న పరిస్థితుల్లో- అంతరాయాలు, అవాంతరాలు లేని అత్యుత్తమ చిత్రాలు, నిఘా సమాచారమే కీలకం. నిరంతర ఉపగ్రహ సమాచారంతోనే ఇది సాధ్యం. ఇందుకోసం బహుళ ఉపగ్రహాల్ని ప్రయోగించాల్సిందే. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిలువరించడంలోనూ సైనిక ఉపగ్రహాల పాత్ర ముఖ్యమే.

సమష్టి కృషి

ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా పూర్తిస్థాయిలో పైచేయి సాధించలేకపోవడానికి సైనిక ఉపగ్రహాలు పరిమితంగా ఉండటం, పైగా వాటి నాణ్యత, సామర్థ్యాలు తక్కువగా ఉండటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. రష్యా చాలాకాలంగా కమ్యూనికేషన్లు, నిఘా ఉపగ్రహాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు సొంతంగా ఉపగ్రహాల దన్ను లేకపోయినా, ఆకాశం నుంచి అమెరికా అత్యాధునిక సాంకేతికత అండ దక్కుతోంది. దీంతో రష్యా సైనిక బలగాల కదలికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష రంగంలో పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఆధునిక సాంకేతికతను విభిన్న రీతుల్లో ఉపయోగించే దిశగా దృష్టిసారించాలి. సైనిక, పౌర రంగాలు చేతులు కలపడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- డి.శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కడగండ్ల సేద్యం

‣ దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

Posted Date: 22-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం