• facebook
  • whatsapp
  • telegram

మనిషి నిర్లక్ష్యం... ధరణికి శాపం!

ఆందోళనకరంగా వాతావరణ మార్పులు

వెర్రితలలు వేస్తున్న మనిషి స్వార్థం అనేక వైపరీత్యాలకు దారి తీస్తోంది. వ్యక్తిగత వాహనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం, చేత్తో చేసుకోగలిగిన అనేక పనుల కోసం యంత్రాల మీద ఆధారపడటం, విద్యుత్‌ వాడకాన్ని తద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచేయడం... ఇలాంటి అనేకానేక కారణాలతో భూమ్యాకాశాలే కాదు, చివరకు సముద్రాలూ వేడెక్కుతున్నాయి. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన నివేదిక కేవలం వాతావరణ శాస్త్రవేత్తలనే కాదు, సామాన్య ప్రజానీకాన్నీ కలవరపరుస్తోంది. ఎక్కడో ఉష్ణోగ్రతలు పెరిగితే మనకేమవుతుందిలే అనే ధోరణులను తుడిచిపెట్టేస్తూ ప్రపంచ నలుమూలలా వాతావరణ మార్పులు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. నేడీ దుస్థితి దాపురించడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒక్కతరంలోనే ఈ మార్పులన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల కళ్లకు కడుతున్నాయి.

స్వయంకృతాపరాధాలు

భూతాపం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదట 1824లో ఫ్రెంచి గణితశాస్త్రవేత్త జీన్‌ బాప్టిస్ట్‌ జోసెఫ్‌ ఫోరియర్‌ ప్రతిపాదించారు. భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోందని గుర్తించింది ఆయనే. భూమి వాతావరణం సౌర రేడియోధార్మికతను గ్రహించి, దాన్ని భూమ్మీదకు పరావర్తనం చెందిస్తోందని ఆయన సూత్రీకరించారు. 19వ శతాబ్దం చివరకు ఆయన సిద్ధాంతానికే ‘గ్రీన్‌హౌస్‌ ప్రభావం’ అని పేరుపెట్టి, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల తీరుపై పరిశోధనలు ఆరంభించారు. తరవాత స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే అరేనియస్‌ దీన్ని మరింత విస్తృతంగా వివరించారు. బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌-సీఓ2), నీటి ఆవిరి సూర్యుడి వేడిని గ్రహించి, భూ ఉపరితల ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ ఉండేందుకు దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు. 20వ శతాబ్దం ద్వితీయార్ధం వరకు దీన్నెవరూ అంతగా పట్టించుకోలేదు కానీ, తరవాత అదే ప్రామాణికమైంది. 1976లో స్వీడన్‌కే చెందిన మరో శాస్త్రవేత్త స్టీఫెన్‌ స్నైడర్‌ భూతాపాన్ని శాస్త్రీయంగా వివరించారు. ఐరోపా ఖండంలో 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. దాదాపు వందేళ్ల పాటు రైళ్లు, ఓడలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు... ఇలా ఏవి నడవాలన్నా బొగ్గు ఒక్కటే ఆధారం. అనంతరం వచ్చిన మరో ప్రత్యామ్నాయ ఇంధనం పెట్రోలియం. పర్యావరణాన్ని భ్రష్టు పట్టించేందుకు ఇది తనవంతు కృషి చేసిందనడంలో సందేహం లేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఓడల నుంచి చివరకు విమానాల వరకూ అన్నీ పెట్రోలియం ఉత్పత్తులతోనే నడుస్తున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తరవాత ప్రజారవాణా, వ్యవసాయ యాంత్రీకరణ, విమానయానం, పారిశ్రామికీకరణ విస్తృతంగా పెరిగాయి. ఫలితంగా నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్నిచోట్లా కాలుష్యమేఘాలు ఆవరించాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. విద్యుచ్ఛక్తి, పెట్రోలియం ఉత్పత్తులను విచ్చలవిడిగా వినియోగిస్తూ ఒకవైపు కాలుష్యానికి, మరోవైపు భూతాపం పెరిగిపోవడానికి మనిషే ప్రధాన కారణం అవుతున్నాడు. ఈ ఉష్ణోగ్రతలు సముద్రాలకూ వ్యాపిస్తున్నాయి. ఇది మరింత కలవరపరుస్తున్న అంశం. హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తీరప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐపీసీసీ హెచ్చరించింది. ఇప్పటికే భారతదేశం చుట్టూ ఉన్న సముద్రమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. సముద్ర వాతావరణం 1970 నుంచి గణనీయంగా మారుతూ వస్తోంది. సముద్రాల్లో రెండు వేల మీటర్ల లోతున సైతం వేడి వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను నియంత్రించకపోతే ఇది ఎలాంటి ఉత్పాతాలకు దారితీస్తుందో ఊహించడమూ కష్టమే. మానవులు చేస్తున్న ఇలాంటి తప్పిదాలవల్ల వర్షాలు, వరదలు సైతం బాగా ఎక్కువయ్యాయి. భారత్‌ లాంటి దేశాల్లో సుదీర్ఘ వర్షాకాలం ఉండబోతోందనీ ఐపీసీసీ హెచ్చరించింది. వేడి వాతావరణంలో తేమ ఎక్కువసేపు ఉండటం ఇందుకు ప్రధాన కారణం. 

అరికట్టడం సాధ్యమేనా?

పారిశ్రామిక విప్లవం తరవాత గాలిలో విడుదలవుతున్న సీఓ2 అంతకుముందు ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేదు. మొత్తం ఉద్గారాల్లో 85శాతం శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వెలువడుతున్నాయి. మిగిలిన 15శాతం భూమి వినియోగతీరులో మార్పు అంటే... అడవుల నరికివేత లాంటి కారణాలతో వస్తున్నాయి. దీంతోపాటు మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి వాయువుల ఉద్గారాలూ గణనీయంగా పెరిగిపోయాయి. 20వ శతాబ్దం తొలినాటి నుంచి చివరినాటికి భూ ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 1.33 డిగ్రీల ఫారెన్‌హీట్‌ పెరిగింది. 21వ శతాబ్దం చివరినాటికల్లా ఇది 2.0 నుంచి 11.5 డిగ్రీల ఫారెన్‌హీట్‌ మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో వేడి అధికం కావడం వల్ల కొన్నిరకాల సూక్ష్మజీవులు, వైరస్‌లు తమ వ్యాప్తిని మరింతగా పెంచుకుంటున్నాయి. వేడి వాతావరణం వల్లే కలరా, డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‌గన్యా లాంటి వ్యాధుల సంఖ్య పెరిగిందని, ఇవి క్రమంగా ఎడారుల నుంచి చల్లటి ప్రాంతాలైన కొండలకూ వ్యాపిస్తున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. గబ్బిలాల నుంచి మనుషులకు నిపా లాంటి వైరస్‌లు వ్యాపించడానికీ కారణమిదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పెరుగుతున్న భూతాపాన్ని, సముద్ర ఉష్ణోగ్రతలను అదుపుచేయడం పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉంది. విద్యుత్‌ ఉత్పత్తిలో ఇప్పటికీ ఎక్కువగా బొగ్గును వాడటం వల్లే కాలుష్యం ఎక్కువవుతోంది. దానికితోడు వాహనాలూ ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహించడం, విద్యుత్‌ వాహనాల ధరలను అందుబాటులోకి తేవడం ద్వారా చాలావరకూ ఉద్గారాలను నియంత్రించగలం. ఈ దిశగా ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేస్తేనే అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు ఈ ప్రభావం నుంచిబయట పడగలవు. లేనిపక్షంలో భూతాపం వల్ల సంభవించే ఉత్పాతాలవల్ల పెనుముప్పు తప్పదు.

వేడెక్కుతున్న సాగరాలు

వాతావరణంలో ఉన్న గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 85శాతాన్ని సముద్రాలు గ్రహిస్తాయి. ఫలితంగా అవి వేడెక్కుతున్నాయి. ఈ పరిణామం గత 15 ఏళ్లలో బాగా పెరిగింది. దీనివల్ల కొన్నిరకాల సముద్రజీవులు అంతరించిపోతున్నాయి. సముద్ర జీవవైవిధ్యంలో అసమతౌల్యం నెలకొంటోంది. హిమానీనదాలు కరిగిపోవడం, సముద్రాలు ముందుకు విస్తరించడమూ దీని ప్రభావమే. 1901 నుంచి 2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 20 సెంటీమీటర్ల మేర పెరిగింది. 1901-71 మధ్య ఏడాదికి 1.3 మిల్లీమీటర్లు, 1971-2006 మధ్య ఏటా 1.9 మి.మీ. 2006-18 మధ్య ఏకంగా సంవత్సరానికి 3.7 మి.మీ. చొప్పున సముద్ర మట్టం పెరిగింది. దీనికితోడు సీఓ2ను గ్రహించడం వల్ల సాగరాల్లో ఆమ్లీకరణ సైతం అధికమవుతోంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను కొంతవరకు మానవప్రయత్నంతో తగ్గించుకోవచ్చు గానీ, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు మాత్రం అంత త్వరగా తగ్గడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ

Posted Date: 11-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం