• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర వర్సిటీల సంస్కరణల మార్గం

నూతన విద్యావిధానంలో తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా- అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన కీలకమైంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో(సీయూ) ప్రవేశాలన్నీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సన్నద్ధం కావాల్సిందిగా సీయూలకు సూచించింది. దేశంలో ఉన్నత విద్యాప్రమాణాలు అడుగంటుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో నూతన విద్యావిధానం సీయూల్లో పలు సంస్కరణలకు ఉపక్రమించడం శుభ పరిణామం. దానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నాందిగా భావించవచ్చు. ప్రమాణాలు మెరుగుపడితే విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. విదార్థులు వారి విద్యాసంవత్సరం పూర్తయ్యేలోపు మార్కెట్‌ అవసరాలకు సరిపడే నైపుణ్యాలను సాధిస్తారు.

దేశంలో మొత్తం 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి వర్సిటీ ఏటా 2,500 నుంచి 3,000 వరకు విద్యార్థులకు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి 41 వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 13 వర్సిటీలు కొత్తగా ఏర్పాటైనవి. భవిష్యత్తులో వాటినీ ఉమ్మడి పరీక్ష పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. మేనేజ్‌మెంట్‌ విద్యకు క్యాట్‌, న్యాయ విద్యకు క్లాట్‌, ఇంజినీరింగ్‌కు గేట్‌... మాదిరిగానే ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూసెట్‌) వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కాబోతోంది.

ఇంటర్మీడియట్‌ సబ్జెక్టుల్లో మార్కులివ్వడంలో వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. మార్కుల ఆధారంగా జరిగే ప్రవేశాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరాలంటే 98శాతం పైనే మార్కులు ఉండాలి. అది గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షే. సీయూసెట్‌ ఈ వ్యత్యాసాలను తగ్గిస్తుంది. అందరికీ సమానావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు వివిధ వర్సిటీల్లో కోర్సులకు దరఖాస్తు చేయాలంటే చాలా సమయం, డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు సీయూసెట్‌ ఒక చక్కని పరిష్కారం. ఒకే దరఖాస్తు విధానం విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. గ్రామీణ విద్యార్థులకు సీయూలు అందుబాటులోకి వస్తాయి. వర్సిటీలకు పరీక్షల నిర్వహణ వ్యయం, అధ్యాపకుల పని భారం తగ్గుతాయి. సీయూసెట్‌ మూల్యాంకనం కంప్యూటర్లలో పారదర్శకంగా జరుగుతుంది. కాబట్టి కచ్చితత్వం, జవాబుదారీతనం పెరుగుతాయి. సీయూసెట్‌ ద్వారా వర్సిటీలన్నింటి మధ్య సమన్వయం కుదిరే అవకాశం ఉంది. సమయానుకూలంగా వివిధ కొత్త కోర్సులు రూపొందించి, మెరుగైన మానవ వనరులు తయారు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని వర్సిటీల అధ్యాపకులు సమగ్రంగా చర్చించి ఆధునిక కోర్సుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకొనే వీలుంది.

ఈ తరహా ఎంపిక ప్రక్రియ గ్రామీణ విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. అయినా, దేశంలోని ప్రఖ్యాత కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశంకోసం ఉన్న విపరీతమైన పోటీ కారణంగా ముందుగానే సంసిద్ధులు కావాల్సి ఉంటుంది. ఉమ్మడి పరీక్ష వల్ల చురుకైన విద్యార్థులందరూ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చేరేందుకే మొగ్గు చూపుతారు. తక్కువ మార్కులు వచ్చినవారికి అంతగా నాణ్యత లేని వర్సిటీల్లో మాత్రమే సీట్లు వస్తాయి. దీనివల్ల విద్యార్థుల నాణ్యతా ప్రమాణాల్లో అసమానతలు తలెత్తే అవకాశాలున్నాయి. ప్రాంతీయ భాషలను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి పరీక్ష స్థానిక భాషల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది. కేవలం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే ఉంటే హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రామీణ, ఆదివాసీ విద్యార్థులకు సాంకేతిక మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ఒక లోపం. అలాగే కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రత్యేకించి కొన్ని సమూహాల కోసం ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో ఆదివాసులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరిగితే వాటి మూల ఉద్దేశం దెబ్బతినే ప్రమాదం ఉంది. ర్యాంకు ఆధారంగా ఒక వర్సిటీకి ఎంపికైన విద్యార్థి మరో విశ్వవిద్యాలయంలో చేరే అవకాశం కల్పించాలి. వివాహం, కుటుంబ వ్యవహారాలవల్ల మహిళలు వివిధ ప్రదేశాలు మారాల్సి వస్తుంది. ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెంచాలంటే ఈ అవకాశం తప్పనిసరిగా కల్పించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో సంస్కరణలు అవసరం. స్వాతంత్య్రం వచ్చిన తరవాత విద్యారంగంలో సంస్కరణలు ప్రారంభం కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఇప్పటికైనా ఈ తరహా మార్పులకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగిన పరిణామం.

- డాక్టర్‌ రమేష్‌ బుద్దారం

మధ్యప్రదేశ్‌లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు

Posted Date: 19-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం