హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ హామీ
ఈనాడు, అమరావతి: గిరిజన ప్రాంత ఉపాధ్యాయుల పోస్టులను గురుకుల ‘బైలా’ను అనుసరించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ద్వారానే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీఎస్సీతో కలిపి గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి చెప్పిన వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు.. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మార్చి 4న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేకంగా భర్తీ చేయాలని, ఆ అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఉంటుందంటూ టి.విజయ్కుమార్ మరో 9 మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గిరిజన ప్రాంతానికి చెందిన 517 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ జనరల్ కేటగిరీలో చేర్చడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రావణ్కుమార్ వాదనలు వినిపించారు. గురుకుల బైలా ప్రకారం ఐటీడీఏ పీఓ నేతృత్వంలోని కమిటీకి మాత్రమే షెడ్యూల్ ఏరియాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అధికారం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన ప్రాంత నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతుందన్నారు. బైలాను పరిశీలించిన న్యాయమూర్తి అందుకు భిన్నంగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో బైలాకు అనుగుణంగా భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.