నేటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానంలో ప్రైవేటు కళాశాలల లెక్చరర్లు
ఈనాడు, అమరావతి: ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 4న నుంచి వారిని రిలీవ్ చేసి, ఆ స్థానంలో ఆయా ప్రైవేటు కళాశాలల్లో పని చేస్తున్న లెక్చరర్లనే ఇన్విజిలేటర్లుగా నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు చీఫ్ సూపరింటెండెంట్లకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నుంచి ఆదివారం ఆదేశాలొచ్చాయి. విద్యార్థులను జంబ్లింగ్ చేసినప్పటికీ అదే కళాశాలలో పని చేసే వారిని ఇన్విజిలేటర్లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల సంఖ్య తక్కువగా ఉన్నందున ఏటా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నారు. ఈ సారీ ఇదే విధానాన్ని పాటించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు అకస్మాత్తుగా పదో తరగతి విద్యార్థుల బోధనకు సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ ఇన్విజిలేటర్లను మార్చాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రైవేటు లెక్చరర్లకు ఎలాంటి శిక్షణా ఇవ్వకుండా విధుల్లో నియమిస్తే పరీక్షల నిర్వహణ ఎలా అని చీఫ్ సూపరింటెండెంట్లు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులను మొదట రిలీవ్ చేయాలని, ఆ తర్వాత అవసరం లేదనుకుంటే ప్రభుత్వ కళాశాలల్లో ఇన్విజిలేటర్లుగా ఉన్న వారిని సైతం రిలీవ్ చేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పేర్కొన్నారు. ఆదివారం అత్యవసరంగా ఆన్లైన్లో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.