* ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బీసీ భవన్ల నిర్మాణం
* ఆప్కో, ఖాదీ బోర్డులకు రాయితీలిస్తాం
* మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సవిత
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు డీఎస్సీ కోచింగ్ను ఉచితంగా అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2014-19 మధ్య ప్రతి జిల్లాలోనూ తెదేపా ప్రభుత్వం బీసీ భవన్లను మంజూరు చేసిందని, వాటన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. చేనేత రంగానికి తోడ్పాటు ఇచ్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని, వారంలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. సచివాలయంలో గురువారం ఆమె బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తొలి సంతకాన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్, రెండో సంతకాన్ని ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణపై చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెదేపా. వారికి సేవ చేసేందుకు చంద్రబాబు నాకు ఈ పదవి ఇచ్చారు. 2014-19 మధ్య 74 బీసీ గురుకులాలను తెదేపా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ విదేశీ విద్య కింద అప్పట్లో 2,173 మంది బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ఆర్థిక సాయం అందించాం. కానీ గత ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్య కింద ఆర్థికసాయం అందించింది 89 మందికే. వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం’ అని మండిపడ్డారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.