- మంత్రి ఎన్ఎండీ ఫరూక్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ఏపీ టెట్-2024 కోసం ఉర్దూ, తెలుగు మీడియంలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు, తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా 19 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమశాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్(సీఈడీఎం) ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. విజయవాడలోని సీఈడీఎం ప్రధాన కార్యాలయం, ఆర్సీఈడీఎంఏఎం కళాశాల(గుంటూరు), ఉస్మానియా కళాశాల(కర్నూలు), ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్(విశాఖ), ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ(గుంటూరు), జోయా కోచింగ్ సెంటర్(నంద్యాల), సీఈడీఎం స్టడీ సెంటర్(కదిరి), ప్రభుత్వ యూహెచ్ స్కూల్(రాయదుర్గం), కుట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ(అనంతపురం), ఎంయూహెచ్ స్కూల్(మదనపల్లె), శ్రీవేంకటేశ్వర కోచింగ్ సెంటర్(తిరుపతి), శ్రీవిద్యా కోచింగ్ సెంటర్(తిరుపతి), డార్జిలింగ్ టాలెంట్ అకాడమీ, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్(ప్రొద్దుటూరు), ఆజాద్ కోచింగ్ సెంటర్(రాయచోటి), గవర్నమెంట్ హైస్కూల్(కంభం), భావపురి విద్యాసంస్థలు(బాపట్ల), నోబుల్ కళాశాల(మచిలీపట్నం), వెంకటసాయి అకాడమీ(కడప)లలో శిక్షణ అందిస్తామని తెలిపారు.