• facebook
  • whatsapp
  • telegram

NEET Exam: నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు

సుప్రీంకోర్టులో కేంద్రం, ఎన్‌టీఏ అఫిడవిట్లు


 

దిల్లీ: నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐ విచారిస్తున్నట్లు తెలిపింది. పరీక్ష రద్దు చేస్తే అభ్యర్థుల కెరీర్‌ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ మే నెల 5న నీట్‌-యూజీ పరీక్ష నిర్వహించింది. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పరీక్షను రద్దు చేసి కోర్టు పర్యవేక్షణలో మళ్లీ నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు, అభ్యర్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యా శాఖ, ఎన్‌టీఏ అఫిడవిట్లు దాఖలు చేశాయి.


ఫలితాలు వచ్చాక రద్దు సబబు కాదు

‘‘దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫలితాలు కూడా విడుదలైన ఈ పరీక్షను మొత్తానికే రద్దు చేయడం సహేతుకం కాదు. నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు అది నష్టం చేకూరుస్తుంది’’ అని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఎలాంటి అక్రమ పద్ధతులు అనుసరించకుండా నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. అక్రమాలకు ఆధారాలు ఉన్న సందర్భాల్లో అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని, ఊహాగానాల ఆధారంగా పరీక్ష రద్దు కోరుతూ వేసిన పిటిషన్లను తిరస్కరించాలని అభ్యర్థించింది. అప్పుడే న్యాయబద్ధంగా పరీక్ష రాసిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బంది కలగదని పేర్కొంది. పరీక్షలో మోసాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యల కోసం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా చేపట్టామని, అక్రమాలు చోటుచేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎన్‌టీఏ వివరించింది.ఈ వ్యవహారంలో ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.