* వివిధ వర్సిటీలకు హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనలు, రిజర్వేషన్ ఖరారు విషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 90ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఆన్లైన్ విధానంతోపాటు నేరుగా దరఖాస్తులను స్వీకరించవచ్చని వర్సిటీల అధికారులకు సూచించింది. ప్రొవిజనల్ జాబితా జారీచేసే నిమిత్తం ఆ దరఖాస్తుల ఆధారంగా ప్రక్రియను చేపట్ట వద్దని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించారు. వారికి నోటీసులు జారీచేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరు 13న జారీచేసిన జీవో 90ని రద్దు చేయాలని, ఆ జీవో ఆధారంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనల అమలును నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విజయవాడకు చెందిన డాక్టర్ పొదిలి వెంకటేశ్వరరావు, మరో 21 మంది, వి.చరణ్కుమార్రెడ్డి మరో అయిదుగురు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ప్రొవిజనల్ జాబితా జారీకి ప్రక్రియ చేపట్టవద్దని వర్సిటీల అధికారులను ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాక్ మార్కెట్లో చక్కని కెరియర్!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.