నాలుగున్నరేళ్లలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
తెదేపా, జనసేన నాయకులకు విశ్వసనీయత లేదు
విద్యాదీవెన సభలో సీఎం జగన్
ఈనాడు, భీమవరం: ‘దేశ భవితను మార్చగల శక్తి విద్యావంతులకు ఉంది. ఆ నమ్మకంతోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నాం. వైకాపా నాలుగున్నర ఏళ్ల పాలనలో రూ.73 వేల కోట్లు కేటాయించి విద్యారంగం రూపురేఖలు మార్చాం’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన డిసెంబరు 29న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేశారు.
విద్యా దీవెన ద్వారా రూ.584 కోట్లు జమ చేస్తున్నాం
‘రాష్ట్రంలో విద్యాదీవెన పథకం ద్వారా 8.39 లక్షల విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేస్తున్నాం. గత నాలుగున్నరేళ్లలో 27.61 లక్షల విద్యార్థులకు దాదాపు రూ.11,900 కోట్లు ఖర్చు చేశాం. వసతి దీవెన పథకం ద్వారా రూ.4,275 కోట్లు అందించాం. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు గత నాలుగున్నరేళ్లలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు ద్వారా బడులను బాగు చేశాం. విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి వంటి పథకాల ద్వారా విద్యార్థుల ప్రగతికి కృషి చేశాం. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, డిజిటల్ విద్యాబోధనకు బాటలు వేశాం. విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు ట్యాబ్లను అందించాం’ అని సీఎం తెలిపారు.
ఉన్నత విద్యలో సంస్కరణలు
‘ఉన్నత విద్యలో రాష్ట్రయువతను ముందంజలో ఉంచేందుకు విశ్వవిద్యాలయల్లోని కోర్సులను ఆన్లైన్లో పూర్తి చేసేందుకు ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పించనున్నాం. విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఇతర దేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు ఒక్కో విద్యార్థికి రూ.1.2 కోట్ల వరకు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 400 మందికిపైగా ఈ పథకం ద్వారా చదువుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు బైజూస్ కంటెంట్ను అందుబాటులోకి తెచ్చాం’ అని సీఎం తెలిపారు.
విద్యార్థులను బెదిరించి మరీ తరలించారు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డిసెంబరు 29న ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న బహిరంగసభకు వైకాపా నాయకులు ప్రతి గ్రామానికీ 3 నుంచి 5 బస్సులను పంపి జనాన్ని సమీకరించారు. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల నుంచి 100కుపైగా ఆర్టీసీ, పాఠశాలల బస్సులను ఏర్పాటు చేశారు. చాలా మంది బస్సులు దిగి సభా ప్రాంగణానికి కూడా వెళ్లకుండా వారికి ఇచ్చిన ఆహారం తిని మళ్లీ బస్సులు ఎక్కేశారు. కార్యక్రమం జరుగుతుండగానే జనం బయటికి వెళ్లిపోవడం మొదలు పెట్టారు. పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి వారిని వెళ్లకుండా ఆపారు. అయినా పోలీసులను తోసుకుంటూ బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం కొనసాగుతుండగానే కొన్ని గ్యాలరీలు ఖాళీ అయ్యాయి.
పరీక్షలు రద్దు చేసి..
విద్యార్థులు తప్పనిసరిగా సీఎం సభకు హాజరయ్యేలా చూడాలని ముందురోజే జిల్లా అధికారులు కళాశాలల యాజమాన్యాలకు అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులను యజమాన్యాలు ఒత్తిడి చేశాయి. సభకు వెళ్లకుంటే హాజరులో కోతవేసి అంతర్గత మార్కులు తగ్గిస్తామని బెదిరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.