* తుది నిర్ణయానికి విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది. విద్యాహక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం.. టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టిసారించింది. ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది.
* ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా.. పదోన్నతి పొందాలన్నా.. టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరని ఎన్సీటీఈ 2010లోనే నిబంధనలను నిర్దేశించింది.అయితే, కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ... పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు. ఈ క్రమంలో టెట్ ఉన్న వారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి పొందేందుకు టెట్లో పాస్ అయినవారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబరు 27న హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
టెట్ ఉత్తీర్ణులైన టీచర్లు 26 వేల మందే
రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా... ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. అంటే టెట్ పాసై ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15 వేల మందికి మించరు. దానికితోడు మరో 11 వేల మంది 1996, 1998, 2001, 2002, 2003 డీఎస్సీల్లో నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. మొత్తానికి సుమారు 26 వేల మంది టెట్ పాసైన టీచర్లు ఉన్నారు. అంటే ఇంకా 96 వేల మందికి టెట్ అర్హత లేదు. వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో అయిదేళ్లు(2019 వరకు) గడువు పెంచుతూ పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి.రేవంత్కుమార్ పేర్కొన్నారు.
ప్రత్యేక టెట్ నిర్వహించాలి: చావా రవి, ప్రధాన కార్యదర్శి, టీఎస్యూటీఎఫ్
పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ నిబంధనలు చెబుతున్నాయి. మేం స్వయంగా వెళ్లి అడిగినా.. అదే సమాధానం వచ్చింది. ప్రస్తుత టీచర్లకు అందరితోపాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.