• facebook
  • whatsapp
  • telegram

Students: ఉపాధ్యాయులు.. విద్యార్థుల ఉన్నతి అంతంతే

ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించని అభ్యసన ఫలితాలు
రద్దు చేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు

ఈనాడు,హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అభ్యసన నైపుణ్యాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘ఉన్నతి’ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. ప్రతి పాఠశాలలో విద్యార్థులను చదివించడం, రాయించడం వంటి కృత్యాలను ఉపాధ్యాయులు చేయిస్తున్నా... సరిగ్గా చదువుకోని విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కొంతమంది పాఠాలు అర్థంచేసుకోలేక పోతుండడంతో ఉపాధ్యాయులు ఎక్కువసేపు వారితో ఉంటున్నారు. దీంతో సామాన్య, సాంఘిక, గణిత శాస్త్రాలను  బోధిస్తున్నప్పుడు విద్యార్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతి కార్యక్రమంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తరచూ నివేదికలు కోరుతుండడంతో ఉపాధ్యాయులు ఆయా అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుండడంతో పదోతరగతి విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరో రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉన్నతిని రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
పదో తరగతిలోపే విజ్ఞానాన్ని పెంచేందుకు..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థుల్లో 50 శాతం మంది ఉత్తీర్ణులు కావడం లేదు. ప్రత్యేక తరగతులు నిర్వహించినా ప్రయోజనం కనిపించడంలేదు. గత ఐదేళ్ల పదో తరగతి ఫలితాలను పరిశీలించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు..ఆరో తరగతి నుంచే విద్యార్థులకు చదువుపై ఆసక్తితో పాటు విజ్ఞానాన్ని పెంచేందుకు కొన్ని నెలల క్రితం ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని ఈ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులతో ముందుగా చదివించడం, తర్వాత రాయించడం వంటివి మొదలు పెట్టారు. కొందరు బాగా నేర్చుకుంటుండగా... సగానికిపైగా పాఠాలు చదివేటప్పుడు తడబడుతున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇదే పరిస్థితి ఉండడంతో సిలబస్‌ పూర్తికావడంలేదు.
మార్పులు.. చేర్పులతో ప్రయోజనం
సర్కారు బడుల్లో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు పదోతరగతికి వచ్చేసరికి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉండాలన్న లక్ష్యంతోనే ఉన్నతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నిపుణులు అంటున్నారు. పాఠశాలల్లో స్థితిగతులను పరిశీలించకుండా ఒకేసారి దీన్ని ప్రారంభించారని.. అందుకే ఫలితాలు అనుకున్నంత రావడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన సంఖ్యలో లేకపోవడం, విద్యా వలంటీర్లను నియమించకపోవడం ప్రధాన లోపాలని వివరించారు. ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నట్టు ‘ఉన్నతి’ని రద్దు చేయకుండా.. కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేయడం..అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకేగాటన కట్టకుండా... ప్రతి పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి సమస్యలు, ఇబ్బందులు గుర్తించిన తర్వాతే ‘ఉన్నతి’ని అమలు చేయాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.