* సాంఘికశాస్త్రం, గణితం, సైన్స్ పాఠాల బోధనకు విఘాతం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. విద్యార్థులకు శాపంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 79 శాతం పాఠశాలల్లో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. మిగిలిన 21 శాతం బడులు ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేకుండానే నడుస్తున్నాయి. అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చినమేరకు ఉపాధ్యాయుల సర్దుబాట్లు పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో దాదాపు 3 వేల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్)ల్లో 6, 7 తరగతులు, 4,500 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు నడుస్తున్నాయి. ఒక యూపీఎస్లో విద్యార్థుల సంఖ్య 100 ఉంటే నలుగురు టీచర్లు, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 220 వరకు ఉంటే ఉంటే ఏడుగురు సబ్జెక్టు టీచర్లు ఉండాలి. రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్)ని చూస్తే సాంఘికశాస్త్రంలో 76 మంది విద్యార్థులకు ఒక టీచర్, గణితంలో 50, సైన్స్లో 36 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆ మూడు సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని స్పష్టం చేసింది. సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అవసరమైన పాఠశాలల్లో పని సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్మెంట్) చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ గతేడాది మార్చి 24న కేంద్రానికి తెలిపింది. అంటే ఒకచోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే, కొరత ఉన్న పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారు. దీనిపై డీఈఓలు ఆదేశాలు ఇస్తున్నా.. ప్రజాప్రతినిధులు, నేతలతో ఒత్తిడి తెచ్చి వాటిని అమలు కాకుండా ఉపాధ్యాయులు అడ్డుకుంటున్నారు.
ఉదాహరణకు గత నవంబరు, డిసెంబరులో కరీంనగర్ జిల్లాలో 72 మంది ఉపాధ్యాయుల సర్దుబాటుకు డీఈఓ ఆదేశాలిచ్చినా 33 మంది విధుల్లో చేరలేదు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఇంకా 10 మంది వరకు కదల్లేదు. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ప్రాథమిక పాఠశాలల్లో 7,194 మంది ఎస్జీటీలతోపాటు 2,179 మంది సబ్జెక్టు టీచర్ల ఖాళీల భర్తీకి కసరత్తు ప్రారంభించామని, ప్రభుత్వస్థాయిలో ఆ విషయం పరిశీలన ఉందని మార్చిలో విద్యాశాఖ కేంద్రానికి తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబరులో 5,089 ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులు స్వీకరించినా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆన్లైన్ పరీక్షలను వాయిదా వేశారు. అటు సర్దుబాట్లు పూర్తిగా జరగక... ఇటు నియామకాలు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే తమపై కలెక్టర్లు, డీఈఓలు చర్యలు తీసుకుంటారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.