‣ సమయం సద్వినియోగం చేసుకుంటే కెరియర్లో ఉన్నత స్థాయి
ఇంటర్ తర్వాత ఎక్కువమంది చేరుతోన్న మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు.. బీఎస్సీ, బీకాం, బీఏ! తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని కళాశాలల్లోనూ డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు మొదలయ్యాయి. వీటిలో చేరిన విద్యార్థులు భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుని, మూడేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!
లక్ష్యాన్ని ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే నిర్ణయించుకుని, ఆ దిశగా సాధన ప్రారంభించినవారు పోటీలో ముందుంటారు. డిగ్రీతో ఎన్నో దారులు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని, అందులో మీకు సరిపోయేది గుర్తించాలి. ఇందుకోసం మీ ఆసక్తి, నైపుణ్యం, అభిరుచి.. మొదలైనవి ప్రామాణికంగా తీసుకుని ఒక నిర్ణయానికి రావాలి. అనంతరం మూడేళ్ల ప్రణాళిక రూపొందించాలి. దాన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తే, లక్ష్యాన్ని అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ కోర్సులు చదువుతోన్న విద్యార్థుల ముందున్న మార్గాల్లో ముఖ్యమైనవి-
1. డిగ్రీలో చదివిన కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యలో కొనసాగడం
2. ఎంబీఏ, లా... మొదలైన ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడం
3. డిగ్రీ అర్హతతో ఉండే ఉద్యోగాలకు ప్రయత్నించడం
అనుబంధ విద్య
డిగ్రీ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఉన్నత విద్య (ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం)లోనూ కొనసాగించడం అనుబంధ చదువుల కిందికి వస్తాయి. అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, బోటనీ లాంటి సబ్జెక్టులను పీజీలో ఎంచుకోవడం. ఈ తరహా లక్ష్యం ఉన్నవారు యూజీ మొదటి ఏడాదిలో ఉన్నప్పుడే ఏదైనా ఒక సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని, అందులో రాణించడానికి కృషిచేయాలి. మూడేళ్ల పాఠ్యాంశాలూ బాగా చదువుకోవాలి. రోజూ కొంత సమయాన్ని ఎంచుకున్న సబ్జెక్టు కోసం కేటాయించాలి. ఇలా ముందస్తు సన్నద్ధతతో ప్రసిద్ధ విద్యాసంస్థల్లో సీటు పొందవచ్చు. సాధారణ సంస్థల్లో చదువులకు, జాతీయ సంస్థల్లో అందించే విద్యకు.. బోధన, అవకాశాల పరంగా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కేంద్రీయ, ప్రత్యేక సంస్థలు పీజీ కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా రూ.5000/రూ.8000 స్టైపెండ్ సైతం ఇస్తున్నాయి. వీటిలో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. అందువల్ల ముందునుంచే సన్నద్ధమైతే మేటి సంస్థల్లో సీటు ఖాయమవుతుంది.
చాలా ఐఐటీలు.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్...కోర్సులను ఎమ్మెస్సీ స్థాయిలో అందిస్తున్నాయి. ఈ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కూడా అందుబాటులో ఉంది. సబ్జెక్టులవారీగా దేశంలో ప్రత్యేక సంస్థలెన్నో నెలకొల్పారు. వీటిలో సీటును లక్ష్యంగా చేసుకుంటే మెరుగైన కెరియర్ సొంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువులకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. దేశంలో టాప్-5 విశ్వవిద్యాలయాల్లో ఇదొకటి. సైన్స్ కోర్సులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు, ఐఐఎస్ఈఆర్లు; హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్కు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; ఆంగ్లం, విదేశీ భాషలకు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్ పేరున్న సంస్థలు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మేటి చదువులకు వేదికలుగా నిలుస్తున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, తేజ్పూర్ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా...మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. ఇవన్నీ జాతీయ సంస్థలు. అందువల్ల స్థానిక రిజర్వేషన్లు వర్తించవు. ఆ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రతిభే కొలమానంగా ప్రవేశాలు చేపడతారు.
ఒకప్పటిలా యూనివర్సిటీల వారీ విడిగా దరఖాస్తు చేసుకుని, ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదిప్పుడు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ ఎన్టీఏ నిర్వహించే సీయూసెట్తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ ఒక్క పరీక్షతోనే సుమారు 50 సంస్థల్లో సీట్లకు పోటీపడవచ్చు.
ఉద్యోగ మార్గాలు
సాధారణ డిగ్రీతో జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలు వీటిలో ముఖ్యమైనవి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు ఎక్కువమంది పోటీ పడుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో క్లర్క్, పీవో (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు పోటీ పెరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఆశావహులు లక్షల్లో ఉంటున్నారు. యూనిఫారం ఉద్యోగాలు ఆశించేవారికి సబ్ ఇన్స్పెక్టర్ మంచి అవకాశం. రైల్వేల్లో.. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, క్లర్క్..తదితర పోస్టులనూ డిగ్రీ విద్యార్హతతోనే ఉమ్మడి పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఉన్న ఉద్యోగాల్లో దేన్నైనా లక్ష్యంగా చేసుకుని, ముందు నుంచే సన్నద్ధమైతే పోటీలో నిలవడానికి వీలవుతుంది. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సీ, ప్రభుత్వ బీమా కంపెనీలు...తదితర ఉద్యోగ పరీక్షలకు సిలబస్ దాదాపు ఒకటే. అందువల్ల వీటన్నింటికీ కలిపి సన్నద్ధం కావచ్చు. గ్రూప్-1, సివిల్స్ లక్ష్యంగా ఉన్నవారు హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమకాలీనాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముందు నుంచే సన్నద్ధమైతే డిగ్రీ పూర్తయ్యే సరికి పరీక్ష ఏదైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని, పోటీలో నిలదొక్కుకోవచ్చు.
ప్రొఫెషనల్ కోర్సులు...
ఎంబీఏ, లా... ఇలాంటి వాటికి డిగ్రీలో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాంశాలు డిగ్రీ సిలబస్ నుంచి ఉండవు. అందువల్ల ప్రత్యేకంగా చదువుకోవాలి. ప్రస్తుతం మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయ స్థాయిలో మేటి సంస్థలో మేనేజ్మెంట్ కోర్సులో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్)లో మెరవడం తప్పనిసరి. ఈ స్కోరుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లతోపాటు దేశంలో పేరొందిన ప్రభుత్వ సంస్థలు, బీ స్కూళ్లలో ప్రవేశం లభిస్తుంది. ఐఐఎంల్లో సీట్లు పరిమితంగానే ఉన్నప్పటికీ 80 పర్సంటైల్ సాధించినా, పేరున్న బిజినెస్ స్కూల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ తరహా సంస్థల్లో చదువుకున్నవాళ్లు ఆకర్షణీయ వేతనంతో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచి సన్నద్ధత ప్రారంభిస్తే గొప్ప సంస్థలో సీటు పొందడం సులువవుతుంది. ఎంసీఏ లక్ష్యమైతే నిమ్సెట్పై దృష్టి సారించవవచ్చు. ఈ స్కోరుతో ఎన్ఐటీలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది. డిగ్రీ అనంతరం లా కోర్సుల్లో చేరాలనుకున్న వారికి జాతీయ స్థాయిలో దిల్లీ యూనివర్సిటీ మేటి సంస్థ. రాష్ట్రీయ సంస్థల్లో లాసెట్ ద్వారా అవకాశం లభిస్తుంది. బీఎడ్కు . ఆర్ఐఈ, మైసూరు; అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం...మొదలైనవాటిలో చదువులు బాగుంటాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బీఎడ్+ఎంఎడ్ కోర్సులూ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ఎడ్సెట్తో విశ్వవిద్యాలయాలు, ఐఏసీఈ కేంద్రాల్లో అవకాశం దక్కించుకోవచ్చు. ఇలా కోర్సుల వారీ టాప్ సంస్థల్లో సీటు పొందడంలో ముందస్తు సన్నద్ధతే కీలకం.
కొన్ని జాతీయ ప్రవేశ పరీక్షలు
‣ జామ్: సైన్స్ కోర్సుల్లో పీజీ చదవాలనుకునేవారు దృష్టి సారించాల్సిన పరీక్ష జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్). ఇందులో సాధించిన మార్కులతో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లు, ఎన్ఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్డీ కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, బయలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్...తదితర కోర్సుల్లో చేరవచ్చు. సాధారణ డిగ్రీతో ఐఐటీ కల నెరవేర్చుకోవడానికి జామ్ చక్కని దారి. భవిష్యత్తులో పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు.
‣ గాట్-బి: బయోటెక్నాలజీలో భవిష్యత్తును కోరుకునేవారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ట్- బయోటెక్నాలజీ (గాట్-బి)పై దృష్టి సారించాలి. ఇందులో ప్రతిభ చూపినవారు జేఎన్యూ, హెచ్సీయూతోపాటు 40కుపైగా సంస్థల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరవచ్చు. వీరికి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతి నెలా రూ.5000 స్ట్టైపెండ్ చెల్లిస్తుంది.
‣ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)- కోల్కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కోర్సులో ప్రవేశం పొందినవాళ్లు నెలకు రూ.8000 చొప్పున స్టైపెండ్ అందుకోవచ్చు. ఇందుకోసం ఐఎస్ఐ ఏటా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.
‣ జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టు (జెస్ట్) తో.. ఫిజిక్స్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్డీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ సంస్థలన్నీ కేంద్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు.
‣ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ..మొదలైన సంస్థలు పీజీ స్థాయిలో మేటి కోర్సులు అందిస్తున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆఖరి దశలో క్యాట్ సన్నద్ధత ఎలా?
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ పవర్ గ్రిడ్లో కొలువు కావాలా?