కానిస్టేబుల్ ఫలితాల్లో వీరు ప్రత్యేకం
ప్రజలకు నేరుగా సేవలందించే ఉద్యోగం పోలీస్. న్యాయం కోసం వచ్చే వారికి వీరి సేవలు కీలకం. అలాంటి పోలీసు శాఖలో కొలువు సాధించడం అంత తేలిక కాదు.. మొదటగా ప్రిలిమినరీ రాయాలి. తర్వాత దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. చివరకు ప్రధాన పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా అన్నింటా విజయం సాధించి వీరు మిగతావారికి స్ఫూర్తిగా నిలిచారు.
ఒకే కుటుంబం నుంచి..
నేటి రోజుల్లో ఒక కుటుంబంలో ఒకరు కొలువు సాధించడమే కష్టం. అలాంటిది ఇద్దరు, ముగ్గురు ఒకేసారి పోలీసు కొలువు సాధించి ఔరా అనిపించారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అనుకున్న లక్ష్యం చేరుకున్నారు..
ఒకే ఇంట్లో ఇద్దరికి..: నర్సంపేట రూరల్
‣ అన్నాచెల్లెళ్లు చిలువేరు శ్రీకాంత్, వినిత
‣ కమ్మపల్లి, నర్సంపేట మండలం
‣ శ్రీకాంత్ 2021లో డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వినిత హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గురుకులంలో ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేశారు.
‣ చిలువేరు రమ, రవి..తండ్రి రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తల్లి రమ కూలీ పనులకు వెళ్తారు.
‣ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ హనుమకొండలో ఒకే దగ్గర ఉండి ప్రిపేరయ్యారు. బుక్స్ కొనుగోలు చేసి స్వియ సన్నద్ధంతో శ్రీకాంత్ జైళ్ల శాఖలో, వినిత సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు.
‣ దళిత కుటుంబానికి చెందిన వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. వారి కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదు. ఒకేసారి అన్నాచెల్లికి ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
అక్కా చెల్లెళ్లు సాధించారు..: ఖానాపురం
‣మర్ద ప్రత్యూష, వినీష
‣ ఖానాపురం మండలం కొత్తూరు
‣ అక్క ప్రత్యూష దూరవిద్య డిగ్రీ, డీఎడ్, వినీష డిగ్రీ, బీఎడ్
‣ అంజలి, శ్రీనివాస్: వృత్తి తండ్రి ఎస్జీటీ, తల్లి: ఒప్పంద క్రాఫ్ట్ టీచర్
‣ ప్రత్యూష ప్రిలిమ్స్ పరీక్షకు కోచింగ్కు వెళ్లగా అదే నోట్సుతో ఇద్దరూ సన్నద్ధమయ్యారు.
‣ ఆది నుంచి ఆటలంటే ఇష్టం. అమ్మానాన్నలాగా తామూ ఉద్యోగం చేయాలన్న తపన. ఉద్యోగం వచ్చాకే వివాహం చేసుకోవాలన్న లక్ష్యం.
భార్యాభర్తలు..: చెన్నారావుపేట
‣ పెంతల రాజేందర్, కల్పన (భార్యభర్తలు)
‣ ఖాదర్పేట, చెన్నారావుపేట మండలం
‣ రాజేందర్ డీఫాం పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగానికి శిక్షణ తీసుకున్నారు. కల్పన ఎంఎస్సీ వృక్షశాస్త్రం పూర్తి చేశారు.
‣ బుచ్చిరెడ్డి- రమ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
‣ భార్యభర్తలు ఇద్దరూ హనుమకొండలో శిక్షణ కేంద్రంలో చేరారు. ః మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించారు.
ముగ్గురు సోదరులు..: వర్ధన్నపేట
‣ కట్కూరి సంపత్రెడ్డి, కట్కూరి రామ్రెడ్డి, కట్కూరి లక్ష్మణ్ రెడ్డి
‣ కడారిగూడెం గ్రామం, మండలం వర్ధన్నపేట, జిల్లా వరంగల్
‣ సంపత్రెడ్డి, రామ్రెడ్డిలు బీటెక్, లక్ష్మణ్రెడ్డి బీఎస్సీ డిగ్రీ
‣ కట్కారి అశోక్రెడ్డి, నర్సమ్మ, తండ్రి విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్, తల్లి వ్యవసాయం, గృహణి
‣ హైదరాబాద్లో 2019 నుంచి ఉంటూ వివిధ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాల్లో చేరి 4 సంత్సవరాలు కష్టపడి చదివారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నిరంతరం కృషి చేశారు.
‣ ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కష్టపడితే విజయం సాధించవచ్చని నిరూపించారు. సర్పంచి మంద సతీశ్ వారిని శాలువాలతో సత్కరించారు.
ఒక్క ఊరు.. 11 మందికి కొలువు
భీమదేవరపల్లి: పోలీస్ ఉద్యోగాల కోసం 25 మంది యువకులు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ ప్రజాగ్రంథాలయానికి నిత్యం వెళ్లి సన్నద్ధమయ్యారు. వీరిలో 11 మంది కొలువులు సాధించారు. ఇక్కడి పుస్తకాలు చదివి ఉద్యోగాలు సాధించామని యువకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో ఉద్యోగాలు సాధించిన దొండ దివ్య, మాల శిరీష, దాసరి అజయ్, గంజి సాయిరాజ్, కొప్పుల రాజు, సంగ కుమారస్వామి, మ్యాకల రాజు, రేవెల్లి మోహన్ను జడ్పీటీసీ రవీందర్, సర్పంచి కొమురయ్య, గ్రంథాలయ కమిటీ నిర్వాహకులు ప్రమోద్రెడ్డి, ఎదులాపురం తిరుపతి, తాళ్ల వీరేశం సన్మానించారు.
సత్తా చాటిన వల్లభాపూర్ యువత
ఎల్కతుర్తి: కానిస్టేబుళ్ల ఎంపికలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్కు చెందిన యువత సత్తా చాటారు. 10 మంది కానిస్టేబుల్ కొలువులకు పోటీపడగా.. ఐదుగురు ఉద్యోగాలు సాధించారు. గ్రామంలోనే ఉంటూ పట్టుదలతో చదివి కొలువు కొట్టారు. అంబాల మానస (సివిల్), తంగళ్లపల్లి అనిల్కుమార్(సివిల్), పెండాల్య నాగరాజు (బెటాలియన్), పెండ్యాల అనిల్ (బెటాలియన్), పోతిరెడ్డి హరికృష్ణ (ఏఆర్) ఉద్యోగం సాధించారు. అంబాల మానస మొదటి ప్రయత్నంలోనే రాణించారు. గురువారం సాయంత్రం గ్రామ పంచాయతీ వద్ద అభ్యర్థులను సర్పంచి మమత, గ్రామస్థులు శాలువాతో సత్కరించారు.
అన్న ఎస్సై.. తమ్ముడు కానిస్టేబుల్
భీమదేవరపల్లి(హనుమకొండ కలెక్టరేట్): ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు పోలీస్ కొలువులు సాధించారు. అన్న ఎస్సైగా ఎంపిక కావడంతో తమ్ముడు పట్టుదలతో సాధన చేసి రెండో ప్రయత్నంలో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన నిరుపేద గీతకార్మికుడు చింత మొగిలి-విజయ దంపతులకు ముగ్గురు కుమారులు చింత రాజు, సురేష్, మహేశ్. పిల్లలు ముగ్గురు ఉన్నత చదువులు చదివి కొలువులు సాధించారు. పెద్దకుమారుడు చింత రాజు 2008లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అన్నను స్ఫూర్తిగా తీసుకున్న మహేశ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కష్టపడి చదివారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా ఈసారి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. సురేష్ సివిల్ ఇంజినీర్గా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
అమ్మానాన్న ఆకాంక్ష నెరవేర్చి..: మడికొండ
‣ పోతరాజు జయ
‣ మడికొండ
‣ ప్రాథమిక విద్యాభ్యాసం కాజీపేట ఫాతిమానగర్, ఇంటర్ హనుమకొండ, బీటెక్ ఎస్వీఎస్
‣ ప్రకాశ్, పర్వీన్భానులది మతాంతర వివాహం. స్వగ్రామంలోనే టైలర్ వృత్తిలో కొనసాగుతున్నారు.
‣ ఆన్లైన్, పుస్తకాలు చదివి. ఫిజికల్ ఈవెంట్స్ హైదరాబాద్ 21 సెంచరీ అకాడమీలో నాలుగు నెలల శిక్షణ
‣ ఎస్సై ఉద్యోగం త్రుటిలో తప్పింది. గ్రూప్-4 పరీక్ష రాశారు. తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు.
తల్లిదండ్రులు లేకున్నా..: వర్ధన్నపేట
‣ నల్లతీగల మురళి
‣ కొత్తపల్లి గ్రామం, వర్ధన్నపేట మండలం, జిల్లా వరంగల్
‣ డిగ్రీ
‣ 2016లో తండ్రి కొమురయ్య, 2017 తల్లి ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
‣ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు శిక్షణ సంస్థలో చేరి కొన్ని నెలల శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఇంటి దగ్గల ఉండి పెద్దమ్మ కొడుకు అన్న ఓరుగంటి కృష్ణ సహకారంతో పరీక్షకు సిద్ధమయ్యాడు.
‣ తల్లిదండ్రులు ఒకే సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందినా కుంగిపోకుండా డిగ్రీ పూర్తి చేశారు. అక్క అరెల్లి కోమల, బావ ఎల్లయ్యల సంరక్షణలో ఉంటూ హెడ్ కానిస్టేబుల్ అన్న కృష్ణ సహకారంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.
పేద కుటుంబం నుంచి: ఏటూరునాగారం
‣ ఆకుధారి కళ్యాణ్: రొయ్యూరు గ్రామం, ఏటూరునాగారం మండలం, ములుగు జిల్లా
‣ బీటెక్
‣ తండ్రి ఆకుధారి రామయ్య, తల్లి సమ్మక్క వ్యవసాయ కూలీలు, వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు
‣ పత్రికల్లో వచ్చే వర్ధమాన వ్యవహరాలపై ప్రధానంగా దృష్టి సారించారు. శారీరక సామర్థ్య పరీక్షలో నెగ్గేందుకు కఠినంగా సాధన చేశారు.
‣ తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులో కానిస్టేబుల్గా 122 మార్కులు సాధించారు.
కూలీ పనులకు వెళ్లి..: గీసుకొండ
‣ సాదు రవళి
‣ గీసుకొండ
‣ ఎంఎస్సీ ఫిజిక్స్
‣ సాదు నర్సమ్మ, సారయ్య, వ్యవసాయ కూలీలు
‣ జిల్లా పోలీసు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇచ్చిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో శిక్షణ పొందారు.
‣ కూలీ చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి. నాలుగేళ్ల కిందట తండ్రి సారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. రవళి ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తల్లి నర్సమ్మతో కలిసి కూలీ పనికి వెళ్లగా వచ్చే డబ్బులతో కుటుంబం గడిచేది. ఏడాది కిందట జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో కొద్ది తేడాతో ఉద్యోగం చేజారింది. మరింత పట్టుదలతో కృషి చేసి ఈసారి ఏఆర్లో ఉద్యోగం సాధించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్తో 7,547 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుళ్లు