‣ ఉసూరుమనిపించిన కేంద్ర బడ్జెట్
ఈ ఏటి కేంద్ర బడ్జెట్ను సమర్పించేటప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం నిరుటికన్నా క్లుప్తంగా ఉంది. ఆ ప్రసంగం ఎన్నెన్నో ఇబ్బందికర వాస్తవాలను దాచింది. వ్యవసాయం, సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు కేటాయింపుల గురించి, ప్రభుత్వ వాస్తవ ఆర్థిక స్థితిగతుల వివరాలు లేకుండా- బంగరు భవితను కనుల ముందు ఆవిష్కరింపజేయడానికి ప్రయాసపడింది. రాబోయే 25 సంవత్సరాల్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించి దేశ స్వరూపాన్ని మార్చేయనున్నట్లు ప్రకటించింది. వర్తమాన సమస్యలకు మాత్రం పరిష్కారం చూపకుండా దాటవేసింది. ప్రభుత్వ ఆదాయం రూ.1.30 లక్షల కోట్ల మేరకు పెరిగిందని చాటుకుంటూనే సామాజిక సేవలకు కేటాయింపులను భారీగా తెగ్గోసింది. కొవిడ్ కాలంలో ఎంతోకొంత ఉపాధి చూపి పేదలను ఆదుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25,000 కోట్ల మేరకు కోత వేసింది.
అంతంతమాత్రం కేటాయింపులు...
తాజా బడ్జెట్లో జల జీవన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించామని చాటుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి- గ్రామీణాభివృద్ధికి కేటాయింపులను గతేడాదికన్నా రూ.8,000 కోట్ల మేరకు ఎందుకు తగ్గించారో చెప్పనేలేదు. రైల్వే, రక్షణ, గృహనిర్మాణం, టెలికమ్యూనికేషన్లకు కేటాయింపులు పెంచినా- ఈ కొవిడ్ కాలంలోనూ ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించకపోవడం విస్మయపరచింది. బూస్టర్ డోసు కోసం కేటాయింపులూ లేకపోవడం ఆశ్చర్యకరం. 2020-21లో రూ.6.57 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయాన్ని తాజా బడ్జెట్లో రూ.10.67 లక్షల కోట్లకు పెంచామని ఆర్థిక మంత్రి చాటుకున్నారు. అందులో లక్ష కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామన్నారు. కానీ, గత పదేళ్ల అనుభవాన్ని చూస్తే కేంద్ర కేటాయింపుల్లో 70శాతం నుంచి 80శాతం మాత్రమే వాస్తవంగా ఖర్చవుతున్నట్లు తేలుతోంది. ఈ ఏడాది మూలధన వ్యయంలో రూ.52,000 కోట్లను ఎయిరిండియా బకాయిలు తీర్చడానికి వెచ్చించనున్నారు తప్ప- కొత్త ఆస్తులను సృష్టించడానికి కాదు. బ్లాక్ చెయిన్ సాంకేతికతను ఉపయోగించి రిజర్వు బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని, వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30శాతం పన్ను వేయాలని చేసిన ప్రతిపాదనలు మాత్రమే వినూత్నమైనవి. కొత్త పింఛను పథకం (ఎన్పీఎస్) విషయంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉద్యోగులకు సమాన ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవడమూ కొత్త విషయమే. గుజరాత్ గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు, నియంత్రణకు అతీతంగా విదేశీ విశ్వవిద్యాలయాలు కోర్సులను నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గిఫ్ట్ సిటీలో వ్యాపారాలు, ఇతర సంస్థలు ఎక్కువ స్వేచ్ఛగా, ఎక్కువ నిర్నిబంధంగా కార్యకలాపాలు సాగించవచ్చు. గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఇస్తున్న రాయితీలను ఇతర రాష్ట్రాలకూ విస్తరించాలని కేంద్రంపై ఒత్తిడి పెరిగితే ఆశ్చర్యం లేదు. కేంద్రం 2014 నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. 2020-21లో రూ. 6.79 లక్షల కోట్లుగా ఉన్న వడ్డీ చెల్లింపులు 2022-23లో రూ.9.40 లక్షల కోట్లకు పెరిగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో 20శాతానికిపైగా వడ్డీలకే సరిపోతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనున్నందువల్ల- స్వల్ప వడ్డీకి రుణాలు అందే రోజులు అంతరించనున్నాయి. అంటే, భారత ప్రభుత్వ వడ్డీ భారం మరింత పెరుగుతుందన్నమాట. అంతేకాదు, బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యలభ్యత హరించుకుపోయి అందుబాటులో ఉన్న పరిమిత నిధుల కోసం పోటీ పెరుగుతుంది. ప్రభుత్వ రంగం అందుబాటులో ఉన్న కొద్ది నిధులనూ ఎగరేసుకుపోవడంతో ప్రైవేటు రంగం- ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) నిధుల కోసం కటకటలాడాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అవసరమైనంత నిర్వహణ మూల ధనం అందేట్లు జాగ్రత్త వహించాలి. బడ్జెట్లో నదుల అనుసంధానానికి రూ.40,000 కోట్లు కేటాయించినా నీరు ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల, నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదాలు దీర్ఘకాలం నుంచి కొనసాగుతూ ఉండటంవల్ల- నదుల అనుసంధానం కాగితాల మీదనే మిగిలిపోవచ్చు. అది చివరకు పటిష్ఠ ఆర్థిక విధానంగా కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసిన ప్రకటనగా తేలవచ్చు.
కిం కర్తవ్యం?
కొవిడ్ దెబ్బకు జీవనవ్యయం పెరిగిపోయి పన్ను రాయితీల కోసం ఎదురుచూస్తున్న మధ్యతరగతిని బడ్జెట్ తీవ్రంగా నిరాశపరచింది. ఆదాయ పన్ను తగ్గించాల్సింది పోయి ఆర్థికమంత్రి ‘క్షమాపణ’తో సరిపెట్టారు. వ్యవసాయం, ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచడానికి కేంద్రం నిరాకరించడం దీర్ఘకాలంలో ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుంది. కేంద్రం విదేశీ కంపెనీలకు ఎర్రతివాచీ పరుస్తుంటే- వాటిని ఆకర్షించడానికి రాష్ట్రాలు భూమి, నీరు, విద్యుత్ వంటి సదుపాయాలను అందించడానికి పోటీపడుతున్నాయి. తీరా విదేశీ కంపెనీలు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చేది పోయి- మన దేశంలోని బ్యాంకులు, బాండ్ల మార్కెట్ నుంచి మూలధనాన్ని సమీకరిస్తున్నాయి. దీంతో అసలే నిధుల కటకటతో అల్లాడుతున్న స్వదేశీ కంపెనీలు మూలధనం కోసం, రుణాల కోసం విదేశీ దిగ్గజాలతో పోటీపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి విదేశీ కంపెనీలు ఇక్కడ స్థాపించే యూనిట్లకు కావలసిన మూలధనంలో సగభాగాన్ని విదేశ మారక ద్రవ్య రూపంలో తీసుకురావాలని బడ్జెట్లో షరతు విధించాల్సింది. ఆ పని చేయకపోవడం పెద్ద లోటు. పైగా కేంద్రం ఆశించిన అభివృద్ధికి చమురు ధరలు గండికొట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఏతావతా, ఈ ఏటి బడ్జెట్ద్వారా కేంద్రం భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్నా- ఆచరణలో అనేక గండాలు ఎదురుకావచ్చు.
‘ప్రైవేటు’పై భ్రమలు
కొవిడ్ నుంచి దేశార్థికం కోలుకున్నాక ఉపాధి అవకాశాలు వాటంతట అవే వృద్ధి చెందుతాయని కేంద్రం భావిస్తున్నట్లుంది. ఇది కేవలం జూదం తప్ప మరొకటి కాదు. మౌలిక వసతుల విస్తరణకు భారీగా నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం మంచిది కాదు. ఈ రంగంలో మూలధన లోటును ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందని సర్కారు వేసుకున్న అంచనా రకరకాల కారణాల వల్ల తప్పిపోవడం ఖాయం. గడచిన సంవత్సర కాలంగా ప్రైవేటు రంగ లాభాలు పెరుగుతున్నా అదనంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు ముందుకురావడం లేదు. తాను చేయాల్సిన పనిని ప్రైవేటు రంగం చేసిపెడుతుందనే దింపుడుకళ్లం ఆశవల్లే కేంద్రం ఈ బడ్జెట్లో వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాలకు సరిగ్గా పెట్టుబడులు కేటాయించలేదు. పెట్టుబడులు, గిరాకీకి ఎదురవుతున్న సమస్యలను అధునాతన సాంకేతికత, ఎలెక్ట్రానిక్ అనుసంధానాలు పరిష్కరించేస్తాయనే భ్రమలోకి కేంద్రం జారిపోయినట్లుంది. దీనివల్ల చివరకు ఆశాభంగం తప్పదు.
******************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.