• facebook
  • whatsapp
  • telegram

అఫ్గాన్‌పై పాక్‌ కుటిల వ్యూహం

అభివృద్ధి అజెండాతో... భారత్‌

అఫ్గానిస్థాన్‌ సంక్షోభంపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ప్రాంతీయ భద్రతా చర్చలు జరిపిన సమయంలోనే పాకిస్థాన్‌ కూడా దౌత్యపరమైన భేటీకి ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్ల ఆక్రమణతో కాబూల్‌లో ఏర్పడిన భద్రతాపరమైన సమస్యలపై భారత్‌ సహా పొరుగు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఫ్గాన్‌ పరిస్థితులపై చర్చకు పాక్‌, చైనాలను భారత్‌ ఆహ్వానించినా- అవి హాజరు కారాదని నిర్ణయించుకున్నాయి. భారత్‌, రష్యా, ఇరాన్‌తోపాటు అయిదు మధ్యాసియా దేశాలు సమావేశంలో పాల్గొని, అఫ్గాన్‌ ప్రజల సంక్షేమానికి సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, భద్రత పటిష్ఠానికి సంయుక్త చర్యలు చేపట్టాలని పిలుపిచ్చాయి. తాలిబన్ల ఆక్రమణతో భద్రతకు పెనుముప్పు వాటిల్లిందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పాక్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాలిబన్లకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని పావులు కదుపుతోంది. సహాయం అందకపోతే అఫ్గాన్‌లో మానవతా సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరిస్తోంది. మరోవైపు తాలిబన్‌ అగ్రనేతల అండతో ఉగ్ర సంస్థ, తెహ్రీకే- తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ)తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా అలజడులు సృష్టించి అనేకమంది మరణాలకు కారణమైన టీటీపీకి క్షమాభిక్ష ప్రసాదించే అంశంపై పాకిస్థాన్‌ పౌర సమాజం ఇమ్రాన్‌ ప్రభుత్వంపై మండిపడుతోంది. తాలిబన్లకు అనుకూలంగా పాకిస్థాన్‌ వ్యవహరిస్తుండగా, అఫ్గాన్‌ అభివృద్ధి అజెండాతో భారత్‌ ముందుకు సాగుతోంది. తాలిబన్లను తమ సైనిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోంది. శాంతి ఒప్పందంతో టీటీపీని చెప్పుచేతల్లో పెట్టుకుని, తమ అజెండా నెరవేర్చుకోవాలని ఇమ్రాన్‌ సర్కారు తహతహలాడుతోంది. పాక్‌ నిర్వహించిన చర్చలకు తాలిబన్ల విదేశాంగమంత్రి ఆమీర్‌ఖాన్‌ ముత్తాకీతో అఫ్గానిస్థాన్‌కు అమెరికా ప్రత్యేక రాయబారి థామస్‌ వెస్ట్‌ సమావేశం కావడం విశేషం. తాలిబన్లతో దోహా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న రాయబారి ఖలీజద్‌ జల్మా స్థానంలో వచ్చిన వెస్ట్‌, రానున్న కాలంలో అఫ్గాన్‌ సమస్యలో కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు.

తాలిబన్లపై భారత్‌ అనుసరిస్తున్న విధానాలను ఎదుర్కొనేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బహుముఖ వైఖరిని అవలంబిస్తున్నారు. భారత్‌ వాదనను తొక్కిపట్టేందుకు దౌత్యపరంగా, మతపరంగా శ్రమిస్తున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ) సభ్యులను ఆహ్వానించగా, ఇటీవలే వారు అక్కడ పర్యటించారు. కశ్మీర్‌ వ్యవహారంలో ఓఐసీ సభ్యులు తమకు బహిరంగంగా మద్దతు తెలపాలని పాక్‌ కోరుకుంటోంది. కనీసం భారత్‌కు వ్యతిరేకంగానైనా స్పందించాలని ఆశిస్తోంది. ఈ విషయంలో పాక్‌ వ్యూహాలు కొంతమేర ఫలిస్తున్నాయి. ఖతార్‌ పార్లమెంట్‌ వేదికగా ఓ సభ్యుడు కశ్మీర్‌ అంశంలో భారత్‌పై నిప్పులు చెరిగారు. గతంలో తాలిబన్ల శాంతి ఒప్పందానికి వేదికగా నిలిచిన ఖతార్‌ ఇప్పుడు పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతుండటం గమనార్హం.

ఇలాంటి పరిణామాల మధ్యే అమెరికాకు పాక్‌ రాయబారిగా మసూద్‌ ఖాన్‌ను ఎంపిక చేయడం ద్వారా ఇమ్రాన్‌ ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పుర్‌కు చెందిన మసూద్‌ ఖాన్‌ భారత వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తారనే పేరుంది. కశ్మీర్‌ ముద్రకలిగిన మసూద్‌ ఖాన్‌ను రాయబారిగా ఎంపిక చేయడం వెనక రాజకీయ కోణాన్ని విస్మరించలేం. ఇది అంతర్జాతీయంగా ప్రభావం చూపేందుకు వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు. అయితే, ఉగ్రవాద సంస్థలకు ప్రయోజనం చేకూరేలా తీసుకునే నిర్ణయాలతో తమ దేశానికే ముప్పు కలుగుతుందన్న విషయాన్ని పాక్‌ సర్కారు విస్మరిస్తోంది. మరోవైపు, పాకిస్థాన్‌ అజెండా నెరవేర్చేందుకు తాలిబన్లు, టీటీపీ ఉగ్రవాదులు ఒక్కటై పనిచేస్తే పరిస్థితి ఏమిటన్నది భారత్‌తోపాటు పొరుగు దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. రాత్రికి రాత్రే అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకున్న అమెరికాకు తాలిబన్ల ఆక్రమణతో తీవ్ర భంగపాటే మిగిలింది. రష్యాపై ఆధిపత్యం కోసం ఒకప్పుడు అఫ్గాన్‌ సాయుధులకు అమెరికా అండగా నిలవగా, ఇప్పుడు పాక్‌ దౌత్యపరమైన శిక్షణ ఇస్తోంది. అఫ్గాన్‌ సంక్షోభం నుంచి భారత్‌ కూడా పాఠాలు నేర్వాలి. ఈ విషయంలో తాలిబన్లవైపుగాని, వారికి వ్యతిరేకంగా గానీ వ్యవహరించి చేతులు కాల్చుకోవడం కన్నా, తటస్థ వైఖరి ప్రదర్శించడం సమంజసంగా భావిస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సరైన అవగాహన లేనప్పుడు తటస్థ వైఖరే మేలు.

- బిలాల్‌ భట్‌ 

(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణానికి కొండంత అండ

‣ దట్టంగా అవినీతి కాలుష్యం

‣ ఇటు దౌత్యరీతి... అటు ద్వంద్వనీతి!

‣ సత్వర న్యాయమే సమున్నత లక్ష్యం

Posted Date: 22-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం