• facebook
  • whatsapp
  • telegram

సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేదెప్పుడు?

కేంద్రం - రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు
 

స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను పణంగా పెట్టే అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భారతదేశ సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాలను విభజించడం ఈ జాగ్రత్తల్లో కీలకమైనది. రాజ్యాంగాన్ని 22 విభాగాలుగా రూపొందించి, వివిధ వ్యవస్థల అధికారాలు, పని విధానాల గురించి సవివరంగా ఉల్లేఖించారు. ఇంతటి శ్రద్ధ తీసుకోవడంవల్లనే భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. అదే అమెరికా రాజ్యాంగ రూపకల్పన కేవలం నాలుగు నెలల్ల్లో పూర్తయింది. అనేక పాశ్చాత్య దేశాల్లో అనుసరిస్తున్న సమాఖ్య వాదానికి భిన్నమైనది మన దేశంలో కనిపిస్తుంది. రాజ్యాంగంలోని 11వ విభాగం పూర్తిగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఇచ్చింది.
 

పెరుగుతున్న జోక్యం
కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాలను విభజించడం, భారత రాజ్యాంగ విశిష్ట గుణమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 1949లో ఉద్ఘాటించారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో చేర్చని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్నికూడా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చింది. కానీ, కేంద్రం ఇంతగా రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. కేంద్రం, రాష్ట్రాలు రాజ్యాంగాన్ని మనసావాచా కర్మణా ఆచరిస్తాయని వారు భావించారు. మూడో రాజ్యాంగ అధికరణను కేంద్రం ఎన్నటికీ ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఉపయోగించదని సర్దార్‌ పటేల్‌ 1949లో రాజ్యాంగ నిర్మాణ సభకు హామీ ఇచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వాలు ఆ హామీని పదేపదే ఉల్లంఘిస్తూ వచ్చాయి.
సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించిన తాజా రాష్ట్రం పంజాబ్‌. దీనికి ముందు పశ్చిమ్‌ బంగ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీబీఐకి అనుమతి నిరాకరించాయి. ఇవన్నీ ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు. గతంలో వేర్వేరు సమయాల్లో ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, మిజోరం సైతం అనుమతి నిరాకరించాయి. సీబీఐ స్థాపన, నిర్వహణకు సంబంధించి కేంద్ర చట్టమేదీ లేదు. 1946నాటి దిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థాపన చట్టం (డీపీఎస్‌ఈ) ద్వారా సీబీఐ ఏర్పడింది. 1861నాటి పోలీసు చట్టంలో దిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు అవసరాలకు సంబంధించిన క్లాజులు ఏమీ లేకపోవడంతో ఈ ప్రత్యేక చట్టం అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తునకు ఆదేశించినా, సీబీఐ ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాలని డీపీఎస్‌ఈ లో ఆరో సెక్షన్‌ నిర్దేశిస్తోంది. ఇది ప్రతి కేసుకూ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోతే సీబీఐ అధికారులకు 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కింద పోలీసు అధికారులకు ఉండే దర్యాప్తు అధికారాలు లేకుండా పోతాయి. అలాంటప్పుడు రాష్ట్ర హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన కేసులను మాత్రమే సంబంధిత రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుంది. నిజమైన రాజ్యాంగ స్ఫూర్తితో చూస్తే రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించడం సబబు అనిపించుకోదు. ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలకూ ప్రతికూలం. ఏదైనా కేసును ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేయవలసి వచ్చినప్పుడు అది సీబీఐ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక రాష్ట్ర పోలీసు అధికారులకు వేరే రాష్ట్రంలో పూర్తి దర్యాప్తు అధికారాలు ఉండవు. అదీ కాకుండా ప్రతి రాష్ట్ర పోలీసు శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుచుకోవలసి వస్తుంది. అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం దాని మీద జాస్తి. మరోవైపు సీబీఐ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ లేదా కూటమి అవసరాలకు తగ్గట్టుగా నడుచుకొంటుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టులైనవారి మీద దర్యాప్తును నత్తనడకగా సాగిస్తూ, ప్రత్యర్థుల మీద మాత్రం ఒంటి కాలి మీద లేస్తోందని సీబీఐపై ఆరోపణలు ఉన్నాయి.
 

పార్లమెంటుకు జవాబుదారీగా...
సీబీఐలో రాజకీయ పక్షపాతమే తప్ప వృత్తి నిబద్ధత, నైపుణ్యాలు కనబడటం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ కారణాల వల్లనే సుప్రీంకోర్టు 2013లో సీబీఐని ‘పంజరంలోని చిలక’ అని వర్ణించింది. సీబీఐ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలను సరిదిద్దడం అసాధ్యం కాదు. అందుకు సమయమూ మించిపోలేదు. మొదట కేంద్ర ప్రభుత్వం సీబీఐ కోసం కొత్త చట్టం తీసుకురావాలి. ఆ చట్టం ద్వారా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) మాదిరి స్వతంత్ర ప్రతిపత్తిని సీబీఐకి కల్పించాలి. చట్టబద్ధ అధికారాలతో దేశంలో ఎక్కడైనా సరే స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును దఖలు పరచాలి. కేంద్ర హోంశాఖకు కాకుండా పార్లమెంటుకు జవాబుదారీ వహించే సంస్థగా సీబీఐ రూపాంతరం చెందాలి. కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరచే పార్టీ లేదా కూటమి సీబీఐని శాసించగలిగే మాట నిజమే కానీ, దీర్ఘకాల దృష్టితో చూస్తే సీబీఐకి చట్టపూర్వకంగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీబీఐ అందరి పట్ల, అన్ని పార్టీల పట్ల సమ భావం పాటిస్తూ దర్యాప్తు జరిపేలా చూడాలి. పాలక పార్టీకి సంబంధించిన కేసులను నీరుగారుస్తూ, ప్రతిపక్షాల కేసులపై దూకుడు ప్రదర్శించబోదనే నమ్మకం కలిగించాలి. అలా చేసినప్పుడు ఈ దేశంలో నిజంగానే సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. ప్రస్తుత పొరపొచ్చాలు తాత్కాలికమని నిరూపితమవుతుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిరంతరం అపనమ్మకం రాజ్యమేలడం దేశానికి మంచిది కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు కేంద్రం, రాష్ట్రాలు చెట్టపట్టాల్‌గా ముందుకు సాగాలి. ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరస్పర సన్నిహిత సహకారం ఉండాలి. నిర్బంధ సమాఖ్యవాదం కాకుండా సహకార సమాఖ్యవాదం నెలకొనడానికి ఇది ఎంతో అవసరం. కేంద్రం, రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి రాజకీయంగా పైచేయి సాధించాలని చూడకుండా ఇచ్చిపుచ్చుకొనే వైఖరి అవలంబించాలి. పరస్పరం నమ్మకం పెంచుకోవాలి.
 

సీబీఐ తీరుపై అసంతృప్తి
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తరవాత తాజాగా తీవ్ర విభేదాలకు గురైన అంశం కేంద్ర దర్యాప్తు సంఘం (సీబీఐ) తీరుతెన్నులు. సీబీఐ విచారణకు పలు రాష్ట్రాలు అనుమతి ఉపసంహరించడం వల్ల సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి మీద అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించిన అంశాల్లో ఇదీ ఒకటి. ఈ దుస్థితికి అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాలి. సహకార సమాఖ్యవాదమనేది స్వతంత్ర భారతంలో ఇప్పటికీ సుదూర స్వప్నంగా మిగలడం చింతించాల్సిన విషయం.

 

Posted Date: 25-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం